ఏదీ కొనొద్దంటున్న మిల్లీనియల్స్ .... ఎందుకో తెలుసా?
మిల్లీనియల్స్ ... ఈ తరం యువత పోకడ అంతా కొత్తగా ఉంటుంది. వారు చేసే పనిలోనూ, వేసుకొనే దుస్తుల్లోనూ, కొనే ఉత్పత్తుల్లోనూ అది స్పష్టంగా ప్రతిఫలిస్తుంది. ఒకప్పటి జనరేషన్ లాగా కాకుండా వీరిదంతా డిఫరెంట్ రూట్. బాగా పొదుపు చేయాలి. తక్కువ ఖర్చు చేయాలి. రిటైర్మెంట్ ప్లాన్ చేసుకొని అప్పుడు రామా... కృష్ణ అంటూ ఏదైనా పుణ్య క్షేత్రాలను సందర్శించడం చేసేవారు పాత తరం. కానీ నవతరం అలా కాదు. వారు అనుకొన్నది ఎంత కష్టమైనా చేసి తీరాల్సిందే.
ప్రయోగాలకు సై అంటున్నారు. అలాగే ఆస్తుల కొనుగోలు, ఆఫీసులు, ఫర్నిచర్, కార్ల కొనుగోలు ఇలా దేనినీ కొనుగోలు చేసేందుకు ఇష్టపడటం లేదు. ఇవన్నిటినీ కేవలం అద్దెకు తీసుకొనేందుకు మాత్రమే ఆసక్తి చూపుతున్నారు. దీంతో అన్ని రంగాల్లో మౌలికమైన మార్పులు కనిపిస్తున్నాయి. ఆస్తుల కొనుగోలు కోసం అప్పులు చేయటం ... వాటిని చెల్లించేందుకు ఏళ్లకేళ్లు కష్టపడటం వీరికి నచ్చటం లేదు. దానికి బదులు ఇన్స్టెంట్ గా పనులు జరిగిపోవాలి. తీసుకొన్న పనికి రెంట్ చెల్లించాలి అంతే. కేవలం రెంట్ మాత్రమే కాకుండా షేరింగ్ పద్ధతికి కూడా ఇప్పుడు ఆదరణ పెరిగింది. ముక్కూ మొఖం తెలియని వారితోనూ ఒకే రూమ్ లో కలిసి ఉండే సంస్కృతి మొదలైంది. దీనిపై ది ఎకనామిక్ టైమ్స్ లో ఒక కథనం ప్రచురితమైంది. దాన్నుంచి కొన్ని విషయాలు మీకోసం.
మన వారు విదేశీ వెబ్ సైట్లను వదలడం లేదు... దేనికో తెలుసా?
అద్దెకు అన్నీ...
ఏదైనా అద్దెకు తీసుకోవటమనేది మనకు కొత్తేమి కాదు. కానీ అది కొన్నిటికి మాత్రమే పరిమితమయ్యేది. ఇల్లు, వాహనాలు తప్ప పెద్దగా ఇతర వస్తువులు అద్దెకు దొరికేవి కావు. కానీ ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది. పుస్తకాల నుంచి, ఫుట్ బాల్ దాక, కార్ల నుంచి విమానాల దాకా, దుస్తుల నుంచి వంట పాత్రల వరకు అన్నీ అద్దెకు దొరుకుతున్నాయి. ఒక ఆర్థిక సేవల కంపెనీ కోసం అమెరికా లో పనిచేసే ఒక యువకుడు ఇటీవలే ఇండియాకు ఆఫీస్ పనిపై వచ్చాడు. రజత్ అరోరా అనే ఆ 23 ఏళ్ళ కుర్రాడు ... ఇల్లు, ఆఫీస్, ఫర్నిచర్, కారు, ఆఖరికి గొడుగు అయినా సరే రెంట్ కు తీసుకొంటానని చెబుతున్నాడు. ఎందుకంటే, ఉద్యోగం ఎలా ఉంటుందో, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనప్పుడు ఆసుపత్రులు కొనుగోలు చేసి అప్పులు చేసుకోవటం ఎందుకు అనేది ఆయన ఆలోచన. ఇది రజత్ అరోరా ఒక్కడి ఆలోచన ధోరణి మాత్రమే కాదు, మెజారిటీ మిల్లీనియల్స్ ది ఇదే రూట్.
షేరింగ్ బెటర్...
ఒకప్పుడు స్నేహితులు, లేదా బాగా తెలిసిన వారితో మాత్రమే తమ గది షేర్ చేసుకొనేవారు. ఇప్పుడు అలా కాదు. అసలు పరిచయం లేని వారు అయినా సరే ఖర్చులు తగ్గుతాయంటే తమతో పాటు అద్దె ఇంట్లో ఉండనిస్తున్నారు. ఇలా షేరింగ్ కల్చర్ దేశంలోని అన్ని ప్రముఖ నగరాలూ పట్టణాల్లోనూ విస్తరించింది. మరీ ముఖ్యంగా స్టార్టుప్ కంపెనీలు అసలు సొంతంగా ఒక ఆఫీస్ ను అద్దెకు తీసుకొనే బదులు కేవలం షేర్డ్ ఆఫీస్ లనే ఇష్టపడుతున్నాయి. ఎందుకంటే... సొంతగా ఒక ఆఫీస్ పెట్టాలంటే కేవలం అద్దె కడితే సరిపోదు. ఫర్నిచర్, ఏసీ లు, కంప్యూటర్లు, ఇంకా చాలా వాటిని కొనుగోలు చేయాలి. ఇందుకోసం చాలా ఖర్చవుతుంది. పైగా ఏదైనా సమస్య వచ్చి ఆఫీస్ ను తీసి వేయాల్సి వస్తే... ఫర్నిచర్ తో పాటు దేనిని విక్రయించినా కనీసం 10% రాబడి కూడా తిరిగి రాదు. 90% కొనుగోలుపై పెట్టిన పెట్టుబడి నష్టమే. అందుకే... కొంచెం రెంట్ ఎక్కువైనా ఫుల్ ఫర్నిచర్, ఇంటర్నెట్, ఏసీ, కాన్ఫరెన్స్ హాల్ వంటి సదుపాయాలతో లభించే షేర్డ్ ఆఫీస్ చాలా బెటర్. ఇది అద్దె ఇళ్ల కూ వర్తిస్తోంది.
ఐదేళ్ళలో రూ 1.4 లక్షల కోట్లు...
మిల్లీనియల్స్ లో పెరుగుతున్న అద్దె సంస్కృతీ, అన్నీ అద్దెకు తీసుకొనే వెసులు బాటుతో పాటు షేరింగ్ చేసుకొనే ధోరణి అధికమవుతోంది. దీంతో దేశంలో ఈ రంగం చాలా వేగంగా దూసుకుపోతోంది. వచ్చే ఐదేళ్ళలో షేరింగ్ ఎకానమీ మార్కెట్ పరిమాణం ఏకంగా 20 బిలియన్ డాలర్లు (సుమారు రూ 1.4 లక్షల కోట్లు) ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఎర్నెస్ట్ అండ్ యంగ్ అనే ఆడిటింగ్ కంపెనీ నిర్వహించిన పరిశోధనలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఇది అనుకొన్న దానికంటే కూడా వేగంగా వృద్ధి చెందుతున్న రంగాల్లో ఒకటిగా నిలుస్తోంది. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పటికే బాగా పాకిన ఈ సంస్కృతీ ... ఇప్పుడు భారత్ లోనూ చాలా వేగంగా విస్తరిస్తోంది.
రెండేళ్లకోసారి..
మిల్లీనియల్స్ లో అభిరుచులు వేగంగా మారిపోతున్నాయి. కార్ల విషయానికి వస్తే... ఒకే మోడల్ కారును రెండేళ్ల కంటే ఎక్కువ నడిపేందుకు ఇష్టపడటం లేదు. అందుకే ఉబెర్, ఓలా వంటి రైడ్ షేరింగ్ కంపెనీల్లో ఎప్పటికప్పుడు కొత్త వాహనాల్లో ప్రయాణిస్తూనే... అవసరం అనుకొనుకొంటే జూమ్ కార్ల ను నెల వారీగా అద్దెకు తీసుకొంటున్నారు. భవిష్యత్లో తాము కొంటామో లేదో తెలియని మోడల్స్ అద్దెకు తీసుకొంటున్నారు. ఇందులో బెంజ్, బీఎండబ్ల్యూ, ఫార్చునర్ వంటి ఖరీదైన వాహనాలు అంటున్నాయి. నెస్ట్ అవే అనే స్టార్టుప్ కంపెనీ షేర్డ్ ఇళ్లను అద్దెకు ఇచ్చే రంగంలో ఉంది. ఫర్నిచర్ సహా వివిధ ఉత్పత్తులను అద్దెకు ఇచ్చే మరిన్ని స్టార్టుప్ కంపెనీలతో కలిసి పనిచేస్తోంది. ఇలా తన ఖర్చులనూ తగ్గించుకొంటోంది. సో, ఇప్పుడంతా కొనటం ఎందుకు దండగ... అద్దె ఉండగా ముద్దుగా అంటున్నారని నిపుణులు చెబుతున్నారు.