ఆగస్ట్ 6 నుంచి 8 వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మానిటరీ పాలసీ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో వడ్డీ రేట్లను తగ్గిస్తారా లేదా అనేది నిర్ణయించనున్నారు. ఆర్బీఐ ఫిబ్రవరి 2023 నుంచి దేశంలో వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగిస్తోంది. మానిటరీ పాలసీకి సంబంధించి వివరాలను ఆగస్ట్ 8న ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించనున్నారు. ఆర్బీఐ సమావేశం వేళ అందరి దృష్టి రెపో రేటుపైనే ఉంది.
దాదాపు ఏడాదిన్నరగా ఆర్బీఐ రెపో రేటును 6.5 శాతం వద్ద స్థిరంగా ఉంచింది. ఈసారి కూడా రెపో రేటులో ఎలాంటి మార్పు ఉండబోదని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. వడ్డీ రేట్లను తగ్గించే ముందు ఆర్బీఐ మరికొంత కాలం వేచి ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ద్రవ్యోల్బణం పెరుగుతుందనే భయంతో ప్రస్తుతం ఆర్బీఐ రెపో రేటులో ఎలాంటి మార్పును చేయడం లేదు.అమెరికా ఫెడరల్ రిజర్వ్ కూడా వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచింది.

ఫెడరల్ రిజర్వ్ భవిష్యత్తులో వడ్డీ రేట్లను తగ్గించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. దేశ ఆర్థిక వృద్ధి రేటు కూడా సరైన వేగాన్ని కొనసాగిస్తోందని నిపుణులు చెబుతున్నారు. చివరిసారిగా ఫిబ్రవరి 2023లో సెంట్రల్ బ్యాంక్ రెపో రేటును 6.5 శాతానికి పెంచింది. దీని తరువాత 7 సార్లు దానిలో ఎటువంటి మార్పు చేయలేదు. ప్రస్తుతం ద్రవ్యోల్బణం కూడా 5.1 శాతంగా ఉంది.
ఇది మరింత తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ద్రవ్యోల్బణం తగ్గితే ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణాన్ని 4 శాతం వద్దే ఉంచాలనుకుంటున్నామని ఆర్బీఐ గవర్నర్ గత సమావేశం తర్వాత చెప్పారు. రుతుపవనాల తర్వాత ఆహార ద్రవ్యోల్బణం గణాంకాలు కూడా బలహీనపడవచ్చు. ఈ సంవత్సరం మానిటరీ పాలసీ కమిటీ తదుపరి రెండు సమావేశాలు అక్టోబర్, 2024, డిసెంబర్, 2024లో జరగాల్సి ఉంది.


Click it and Unblock the Notifications