RBI: కాగితపు కరెన్సీ స్థానంలో ప్లాస్టిక్ కరెన్సీ.. 2027 అందుబాటులోకి..!
భారత కరెన్సీ నోట్లకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. కాగితపు నోట్లకు బదులుగా ప్లాస్టిక్ నోట్లను తయారు చేయాలని యోచిస్తోంది.
కాగితపు కరెన్సీ నోట్ల స్థానంలో మరింత మన్నికైన పాలిమర్ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. దశాబ్దాలుగా పరిశీలనలో ఉన్న ఈ ప్రణాళికను ఇప్పుడు ఆచరణలోకి తెచ్చేందుకు ఆర్బీఐ కసరత్తు ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన ట్రయల్స్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంత అనుకున్నట్లు జరిగితే 2027 నాటికి పూర్తి స్థాయిలో ఈ నోట్లను పాలిమర్ తో తయారు చేయాలని భావిస్తోందని సమాచారం.
కొన్ని వారాల క్రితం, కరెన్సీ నోట్లను ప్లాస్టిక్ నోట్లుగా మారుస్తున్నారని వార్తలు వచ్చాయి. ఇందుకోసం ఆర్బీఐ టెండర్లను ఆహ్వానించింది. ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను ఉత్పత్తి చేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అర్హతగల తయారీదారుల నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దరఖాస్తులను ఆహ్వానించింది. భారతదేశ చరిత్రలో ఇప్పటివరకు కేవలం కాగితపు కరెన్సీ నోట్లు మాత్రమే వాడుకలో ఉన్నాయి. కానీ మొదటిసారిగా, ప్లాస్టిక్ నోట్లను ప్రవేశపెట్టబోతున్నారు. దేశీయ, అంతర్జాతీయ కంపెనీలు ఆగస్టు 18 లోగా తమ దరఖాస్తులను సమర్పించాలని రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన నోటిఫికేషన్ లో పేర్కొంది.

పాలిమర్ నోట్లకు అవసరమైన భద్రతా లక్షణాలతో కూడిన అపారదర్శక పాలిమర్ షీట్లను ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉన్న కంపెనీలు మాత్రమే ఇందులో పాల్గొనాలని స్పష్టం చేసింది. అయితే ప్రస్తుతం, తక్షణ అవసరం కోసం 68,000 రీముల పాలిమర్ షీట్లు కావాలని.. రెండు వేర్వేరు డినామినేషన్ల నోట్ల కోసం, ఒక్కొక్కదానికి 34,000 రీముల చొప్పున కావాలని కోరింది. ఈ ట్రయల్ రన్ విజయవంతమైతే, భవిష్యత్తులో అదనపు కొనుగోళ్లు జరుగుతాయని తెలిపింది. జాతీయ భద్రత దృష్ట్యా ఈ టెండర్లో చాలా కఠినమైన నిబంధనలు పొందుపరిచారు.
దీనికి దరఖాస్తు చేసుకునే కంపెనీలు కేంద్ర ప్రభుత్వం నుంచి భద్రతా అనుమతిని తప్పనిసరిగా తీసుకోవాలి. ఒకవేళ వారికి చైనా లేదా పాకిస్తాన్లో వృత్తిపరమైన కార్యకలాపాలు ఉంటే, వారిని ఈ భారతీయ కాంట్రాక్టు నుంచి పూర్తిగా వేరుచేయాలి. అలాగే, ఈ కాంట్రాక్టుకు అవసరమైన ముడి పదార్థాలను ఆ రెండు దేశాల నుంచి కొనుగోలు చేయకూడదు. అలాంటి కంపెనీలో బీడ్ దాఖలు చేయాలని ఆర్బీఐ తన నోటిఫికేషన్ లో పేర్కొంది. అలాగే భారతదేశం కోసం ఉత్పత్తి చేయబడిన ఈ ప్రత్యేక పాలిమర్ షీట్లను మరే ఇతర మూడవ దేశానికి సరఫరా చేయకూడదు. అర్హత పొందాలంటే, దరఖాస్తుదారులు గత మూడు సంవత్సరాలుగా కేంద్ర బ్యాంకులకు లేదా నోట్ ప్రింటింగ్ కంపెనీలకు పాలిమర్ షీట్లను సరఫరా చేసిన అనుభవం కలిగి ఉండాలి అని అది పేర్కొంది.


Click it and Unblock the Notifications