సంచలన నిర్ణయం.. 2028 నుంచి కేవలం ఎలక్ట్రిక్ వాహనాలే రిజిస్ట్రేషన్..
ఢిల్లీ వాయు కాలుష్యం తారస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. కాలుష్యం వల్ల అక్కడి ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ప్రకటించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అక్కడి ప్రజలు చాలా మంది శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్నారు. ముఖ్యంగా చలికాలంలో ఢిల్లీ వాయు కాలుష్యం భారీగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో అక్కడి సర్కార్ గతంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంది. వాయు కాలుష్యం ఎక్కువగా ఉన్న రోజుల్లో సరి, బేసి సంఖ్య విధానం అమలు చేసింది. ఆ తర్వాత ఢిల్లీ డీజిల్ వాహనాలను నిషేధించారు. అయినప్పటికీ ఢిల్లీ కాలుష్యం తగ్గడం లేదు.
దీంతో అక్కడ ఎలక్ట్రిక్ వాహనాలు వాడాలని ప్రభుత్వం సూచించింది. వాహనాలు కొనుగోలు చేస్తే కొన్ని రాయితీలు కూడా ప్రకటించింది. అయినప్పటికీ అక్కడ పరిస్థితి మారలేదు. తాజాగా ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతిష్టాత్మకమైన ఎలక్ట్రిక్ వాహన (ఈవీ) విధానానికి ఢిల్లీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కొత్త పాలసీ ప్రకారం రూ.30 లక్షలలోపు ఈవీ కార్లకు రిజిస్ట్రేషన్ ఫీజులు, రోడ్ ట్యాక్స్ పూర్తిగా మినహాయింపు ప్రకటించింది. పాత వాహనాలను స్క్రాప్ చేసి, కొత్త ఈవీలను కొనుగోలు చేసే వారికి ఈ కొత్త విధానం లక్ష రూపాయల ప్రోత్సాహకాన్ని ఇస్తామని ప్రకటించింది.

ఏప్రిల్ 2028 నుంచి కేవలం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను మాత్రమే రిజిస్టర్ చేయాలని నిర్ణయించింది. జూలై 1వ తేదీ నుంచి దశలవారీగా నాలుగేళ్లలో అమలు చేయడానికి సిద్ధమైన ఈ ప్రతిష్టాత్మక ప్రణాళిక రూపొందించారు. 31 మార్చి 2030 నాటికి జాతీయ రాజధానిని పూర్తిగా సున్నా-ఉద్గార రవాణా వైపు మార్చడానికి 15 వేల కోట్ల రూపాయల భారీ నిధులను కేటాయించారు. నూతన విధానం పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలపై, ప్రత్యేకంగా సున్నా-ఉద్గార వాహనాలకు సంబంధించిందని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా చెప్పారు. దీని అంతిమ లఢిల్లీని క్రమంగా కాలుష్య రహిత నగరంగా మార్చడమేనని స్పష్టం చేశారు.
రాబోయే నాలుగేళ్లలో ఈ విధానాన్ని దశలవారీగా అమలు చేయడానికి ప్రభుత్వం ఒక సమగ్ర ప్రణాళికను రూపొందించిందని ప్రకటించారు. ఈవీ మౌలిక సదుపాయాల కల్పన, ఏటా రోడ్డు పన్నుల మాఫీ కోసం ప్రభుత్వం 8 వేల కోట్ల రూపాయలు కేటాయించినట్లు వివరించారు. అయితే దేశంలో కేవలం ఢిల్లీలోనే కాదు బెంగళూరు, హైదరాబాద్, ముంబై, చెన్నై, కోల్ కత్తా వంటి నగరాల్లో కూడా కాలుష్యం భారీగా పెరుగుతోంది. హైదరాబాద్ లో గాలి కాలుష్యం తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టింది. అలాగే ఈవీ వాహనాలకు పన్నులు రద్దు చేసింది.


Click it and Unblock the Notifications