అప్పు కోసం మిల్లీనియల్స్ దేన్ని ముందు ఎంచుకుంటున్నారో తెలుసా?
మిల్లీనియల్స్ ఆలోచనలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. అభిరుచులు ఎప్పటికప్పుడు మారుతున్నాయి. జీవన శైలి లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తమ అవసరాలు ఏంటో.. వాటికి అవసరమైన సొమ్ము ఎలా సమకూర్చుకోవాలో తెలుసుకుంటున్నారు. ఇలా ఒకరిపై ఆధారపడకుండా వారి అవసరాలు తీర్చుకుంటున్నారు. అయితే ఇంతకు ముందు మిల్లీనియల్స్ తమ ఆర్ధిక అవసరాలు తీర్చుకోవడానికి తక్కువ ప్రత్యామ్నాయ మార్గాలు ఉండేవి ఇప్పుడు మాత్రం అవి పెరిగిపోయాయి. అందుకే వారి ఇష్టానుసారంగా జీవనం కొనసాగించ గలుగుతున్నారు. 1982 తర్వాత జన్మించిన వారిని మిల్లీనియల్స్ గా పేర్కొంటారు.
క్రెడిట్ కార్డుకు పెద్దపీట
మిల్లీనియల్స్ క్రెడిట్ కార్డులు తీసుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ కార్డుల ద్వారా విభిన్న రకాల కొనుగోళ్లు చేసే సదుపాయం ఉంటున్న కారణంగా దీని వాడకానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. దీనితో పాటు పర్సనల్ లోన్స్, కన్స్యూమర్ డ్యూరబుల్ లోన్స్ ఎక్కువ తీసుకుంటున్నారు. మిల్లీనియల్స్ రుణ అవసరాల్లో వీటి వాటాయే 72 శాతం ఉంటోంది.
* మిల్లీనియల్స్ రుణ అవసరాల్లో సెక్యూర్డ్ రుణాలైన టూవీలర్, ఆటో రుణాల వాటా కేవలం 9 శాతం మాత్రమే ఉంది.
రుణదాతల్లో ఆందోళన
* మిల్లీనియల్స్ కారణంగా గత రెండేళ్ల కాలంలో రుణాల్లో మంచి వృద్ధి నమోదు అవుతోంది. అయితే ఇదే సమయంలో రుణాలు ఇచ్చే రుణదాతల్లో ఆందోళన కూడా పెరుగుతోంది. ఇందుకు కారణం ఏమిటంటే వారు తీసుకుంటున్న రుణాలు అన్ సెక్యూర్డ్ రుణాలు. అంటే వీటికి ఎలాంటి హామీ ఉండదన్నమాట. వీటిపై బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ ఈ రుణాలు తీసుకోవడానికే మిల్లీనియల్స్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇవి ఎంతో రిస్క్ తో కూడుకున్నవని క్రెడిట్ బ్యూరో ట్రాన్స్ యూనియన్-సిబిల్ నివేదిక హెచ్చరిస్తోంది. పరిస్థితులు మారి పోతే ఈ రుణాలు కూడా మొండి పద్దులుగా మారి పోయే ప్రమాదం ఉందన్న వ్యక్తం అవుతున్నాయి.
* కొత్త రుణాలు తీసుకునే విషయంలో నాన్ మిల్లీనియల్స్ విభాగంలో 14 శాతం వృద్ధి ఉంటే మిల్లీనియల్స్ విభాగంలో 58 శాతం వృద్ధి నమోదయింది.
రిటైల్ రుణాలకు ప్రాధాన్యం...
కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చిన రుణాలు మొండి పద్దులుగా మారి బ్యాంకులకు తలనొప్పిగా మారుతున్న విషయం తెలిసిందే. ఇచ్చిన రుణాలను మళ్లీ వసూలు చేసుకోవడానికి నానా తంటాలు పడుతున్నాయి. కంపెనీలకు ఇచ్చే రుణాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. వీటిపై వడ్డీ రేటుకూడా తక్కువ. ఈ నేపథ్యంలోనే కార్పొరేట్ రుణాలను తగ్గించుకుంటూ రిటైల్ రుణాలకు బ్యాంకులు మొగ్గు చూపుతున్నాయి.
క్రెడిట్ స్కోర్ ఇలా...
* మిల్లీనియల్స్ క్రెడిట్ స్కోర్ మరీ అంత గొప్పగా ఏమీ ఉండటం లేదు. 900లో వీరి సగటు క్రెడిట్ స్కోర్ 740 ఉంటోంది.
* గుజరాత్ మిల్లీనియల్స్ సగటు క్రెడిట్ స్కోర్ అత్యధికంగా 747 ఉంది. హర్యానాలో 743, రాజస్థాన్ 742గా ఉంది. కర్ణాటకలో 740, తమిళనాడులో 736 గా ఉంది.
* తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్న వారు తమ స్కోరును పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆరు నెలల కాలంలో తమ క్రెడిట్ స్కోర్ పెంచుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు.