ఈ కామర్స్ సైట్ లకు షాక్ ఇచ్చిన కేంద్రం ... ఇక నుండి ఫ్లాష్ సేల్ కుదరదు
దేశంలో ఈ కామర్స్ సంస్థలు, వస్తుసేవల ఫ్లాష్ సేల్ నిర్వహించడానికి వీల్లేకుండా నిబంధన విధించాలని వినియోగదారుల వ్యవహారాల శాఖ ప్రతిపాదించింది. కన్స్యూమర్ ప్రొటెక్షన్ (ఇ-కామర్స్) రూల్స్ 2020 లో గణనీయమైన సవరణలను ప్రవేశపెట్టాలని కేంద్రం ప్రయత్నిస్తుంది. అంతేకాక ఈ కామర్స్ సంస్థలను నియంత్రణలోకి తీసుకురావాలని యోచిస్తోంది. వినియోగదారులను ఆకర్షించడానికి ఇ-కామర్స్ సైట్లు తరచుగా ఉపయోగించే ఫ్లాష్ అమ్మకాలపై ఉక్కుపాదం మోపాలని కేంద్రం ఆలోచిస్తోంది.
వీటితో పాటు వినియోగదారుల డేటా రక్షణ తీసుకురావాలని వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార విధానాన్ని బలోపేతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ 15 రోజుల్లోపు అభిప్రాయాలను కోరింది, అనగా జూలై 6, 2021న దీనిపై సూచనలు, సలహాలు ఇచ్చే అవకాశం ఉంది. అమెజాన్ మరియు ఫ్లిప్కార్ట్ వంటి ఇ-కామర్స్ సంస్థల పనితీరును క్రమబద్ధీకరించడం లక్ష్యంగా ఉంది. ప్రతిపాదిత సవరణలు ఇ-కామర్స్ ప్లాట్ఫామ్లలో పారదర్శకతను తీసుకురావడం మరియు నియంత్రణ పాలనను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఉన్నాయని అధికారిక వర్గాలు తెలిపాయి.
ఇ-కామర్స్ వ్యవస్థలో విస్తృతంగా మోసం మరియు అన్యాయమైన వాణిజ్య పద్ధతులపై ప్రభుత్వానికి అనేక ఫిర్యాదులు వచ్చిన క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సాంప్రదాయిక ఇ-కామర్స్ ఫ్లాష్ అమ్మకాలను నిషేధించలేదని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. నిబంధనలను సవరించడం వెనుక ఉన్న లక్ష్యం వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడం మరియు మార్కెట్లో ఉచిత మరియు సరసమైన పోటీని ప్రోత్సహించడం అని పేర్కొంది.