Pensions: గుడ్ న్యూస్.. అక్టోబర్ 1 నుంచి కొత్త పింఛన్లు..!
ఏపీ ప్రభుత్వం ప్రజలకు శుభవార్త చెప్పింది. అక్టోబర్ 1 నుంచి కొత్త పింఛన్లు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఎన్టీఆర్ భరోసా పింఛను పథకం కింద కొత్త లబ్ధిదారుల ఎంపికకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. పింఛన్లకు సంబంధించి ఈ రోజు నుంచి వారం రోజుల పాటు దరఖాస్తులను తీసుకోనున్నారు. స్వర్ణగ్రామ, స్వర్ణవార్డు సచివాలయాల్లో దరఖాస్తులు స్వీకరిస్తారని ప్రభుత్వం తెలిపింది. దరఖాస్తుదారుల అర్హతను నిర్ధారించేందుకు 2019 డిసెంబరులో జారీ చేసిన జీవో 174ను అధికారులు ప్రామాణికంగా తీసుకోనున్నారు. ఇందులో భాగంగా ఆరంచెల తనిఖీ చేపట్టనున్నారు.
వచ్చిన దరఖాస్తులు, వాటి తనిఖీ, అర్హుల ఎంపిక, ప్రభుత్వ ఆమోద ప్రక్రియను 20లో పూర్తి చేస్తారు. ఎవరికి పింఛన్ మంజూరు అయిందో ముందే చెప్పనున్నారు. వారికి అక్టోబరు 1 నుంచి కొత్త పింఛన్లు ఇస్తారు. దరఖాస్తు స్వీకరణ బాధ్యతను సచివాలయాల్లోని డిజిటల్ అసిస్టెంట్/వార్డు ఎడ్యుకేషన్, డేటా ప్రాసెసింగ్ కార్యదర్శికి అప్పగించినట్లు ప్రభుత్వం పేర్కొంది. హర్హత పొందిన దరఖాస్తుదారుల వివరాలను పరిశీలించేందుకు వెల్ఫేర్, ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లేదా వార్డు వెల్ఫేర్ డెవల్పమెంట్ సెక్రటరీ వెళ్తారు. ఈ అధికారులు దరఖాస్తుదారుల నివాసాలకు వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం వివరాలను ఫారాల్లో నమోదు చేస్తారు. అప్పుడే ఈ కేవైసీ కూడా పూర్తి చేయనున్నారు.
క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత అధికారులు తమ లాగిన్లలో దరఖాస్తులు, సర్టిఫికెట్లను అప్లోడ్ చేసి ప్రభుత్వానికి పంపనున్నారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల దరఖాస్తులను ఎంపీడీవో/మున్సిపల్ కమిషనర్కు పంపిస్తారు. ఒంటరి మహిళల దరఖాస్తులను సంబంధిత తహసీల్దారు పరిశీలనకు పంపిన అనంతరం ఎంపీడీవో/మున్సిపల్ కమిషనర్లకు బదిలీ చేయనున్నారు.

చేనేత కార్మికులు, మత్స్యకారులు, డప్పు కళాకారులు, చర్మకారులు, గీత కార్మికులు, ట్రాన్స్జెండర్ వర్గాల దరఖాస్తులను వారి లాగిన్ల ద్వారా సంబంధిత జిల్లాస్థాయి అధికారులకు వద్దకు వెళ్తాయి. వీటిని జిల్లా స్థాయి అధికారి లేదా ప్రత్యేకంగా నియమించిన అధికారి ధ్రువీకరించి లాగిన్లలో వివరాలను అప్డేట్ చేసిన తర్వాత ఎంపీడీవో/మున్సిపల్ కమిషనర్లకు పంపనున్నారు. ఏపీలో ఇప్పుడు 61,92,396 మంది ఎన్టీఆర్ భరోసా కింద పింఛన్లు పొందుతున్నారు. ఇందుకు ప్రభుత్వం రూ.2,693 కోట్లు కేటాయిస్తోంది. కొత్త పింఛన్లతో ఈ ఖర్చు ఇంకా పెరగనుంది.
పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి ఆధార్ కార్డు, బియ్యం కార్డు/ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఉండాలి. వీటితో పాటు వితంతు పింఛనుకు - భర్త మరణ ధ్రువీకరణ పత్రం, భర్త ఆధార్ నంబర్ ఉండాలి.
ఒంటరి మహిళ పింఛను కోసం అయితే వివాహం అయితే కోర్టు/అదాలత్లు జారీ చేసిన విడాకుల పత్రం ఉండాలి. వివాహం కాని వారు అయితే పెళ్లి కానట్లు తహసీల్దారు జారీ చేసిన ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. దివ్యాంగుల పింఛను కనీసం 40 శాతం లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నట్లు తెలిపే సదరమ్ ధ్రువీకరణ పత్రం ఉండాలి. చేనేత పింఛను, మత్స్యకారుల పింఛను, డప్పు కళాకారుల పింఛను, సంప్రదాయ చర్మకారుల పింఛను, కల్లుగీత కార్మికుల పింఛను కోసం సంబంధిత శాఖలు జారీ చేసిన ధ్రువీకరణ పత్రం ఉండాలి.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
