IT సెక్టార్లో టెంపరరీ వర్కర్స్కు ఫుల్ డిమాండ్.. ఈ టెక్నాలజీల్లో అధిక అవకాశాలు
IT News: గతేడాది చివరి నుంచి జాబ్ మార్కెట్ పరిస్థితి అంత బాగాలేదు. IT సెక్టార్ లో అయితే మరీ దారుణంగా తయారైంది. ఎక్కడ చూసినా కంపెనీలు లేఆఫ్స్ ప్రకటిస్తూ, టెక్ ఉద్యోగులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అయితే ఈ టెక్కీల ఇబ్బంది మరొకరికి వరంగా మారినట్లు తెలుస్తోంది.
టెక్ రంగంలో ఉద్యోగుల తొలగింపు సహా కొత్త నియామకాల్లో మందగమనం కారణంగా తాత్కాలిక సిబ్బందికి డిమాండ్ పెరిగింది. ఆయా IT సంస్థలు సైతం తమ స్థిర వ్యయాన్ని తగ్గించుకోవడానికి టెంపరరీ వర్కర్స్ ను నియమించుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ ఏడాది ప్రథమార్ధంలో గిగ్ వర్కర్ల డిమాండ్ 157 శాతం పెరిగినట్లు జాబ్ సంస్థ అవిన్ తెలిపింది.

2022లో వెయ్యికి పైగా టెక్ సంస్థలు దాదాపు లక్షా 65 వేల మంది ఉద్యోగులను తొలగించినట్లు Layofffs.fyi డేటా చెబుతోంది. కాస్ట్ కటింగ్, బిజినెస్ ఆప్టిమైజేషన్, లేఆఫ్స్ కారణంగా గిగ్ ఎకానమీలో అధిక నైపుణ్యం కలిగిన వర్కర్స్ భాగస్వామ్యం పెరుగుతున్నట్లు అవిన్ CEO అన్నన్య సార్థక్ తెలిపారు.
2 నుంచి 7 సంవత్సరాల అనుభవం ఉన్న మిడ్-లెవల్, సీనియర్ పొజిషన్స్ లో అత్యంత నైపుణ్యం కలిగిన టెక్ ప్రొఫెషనల్స్కు చాలా డిమాండ్ ఏర్పడిందని అవిన్ పేర్కొంది. మెషీన్ లెర్నింగ్, C, C shartp, PHP, డాట్ నెట్, జావా, పైథాన్, రియాక్ట్, డేటా సైన్స్, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ వంటి టెక్నాలజీల్లో నిష్ణాతులకు అవకాశాలు ఎక్కువగా లభిస్తున్నట్లు వెల్లడించింది.
దేశవ్యాప్తంగా చూస్తే గిగ్ వర్కర్లలో 50 శాతం బెంగళూరు, ముంబై, హైదరాబాద్ వంటి టైర్-1 నగరాల నుంచి ఉన్నట్లు తెలుస్తోంది. 35 శాతం మంది కోయంబత్తూర్, నాసిక్, మైసూర్ వంటి టైర్-2 నగరాలు.. మిగిలిన 15 శాతం మంది రాయ్ పూర్ విజయవాడ తరహా టైర్-3 నగరాల నుంచి వస్తున్నారు. అస్థిర ఆర్థిక పరిస్థితుల వల్ల US, కెనడా, UAE వంటి దేశాల నుంచి కూడా అధిక నైపుణ్యం కలిగిన గిగ్ వర్కర్లు బయటకొస్తున్నట్లు డేటా చెబుతోంది.


Click it and Unblock the Notifications