adani: పెట్టుబడులు తరలిపోతున్న వేళ.. అదానీ కంపెనీకి శుభవార్త !!
adani: నాలుగు రోజులుగా అదానీ పేరు మారుమోగిపోతోంది. హిండెన్ బర్గ్ నివేదికతో ఒక్కసారిగా మార్కెట్ లో అలజడి చెలరేగింది. కోట్లాది రూపాయలు ఇండియన్ ఈక్విటీల నుంచి బయటకు మళ్లాయి. గత వారం స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగియడానికి ఒక కారణం ఆ గ్రూపు సంస్థలే అని నిపుణులు చెబుతున్నారు. ఆయా సంస్థల్లో పెట్టుబడి పెట్టిన వారిలో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఆ ఇన్వెస్టర్లకు ప్రముఖ మీడియా సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. అదానీ కంపెనీల్లో ఓ దిగ్గజ సంస్థ పెట్టుబడులు పెట్టినట్లు వెల్లడించింది.
పోర్ట్స్ లోకి పెట్టుబడులు..
సింగపూర్ కు చెందిన టెమాసెక్ హోల్డింగ్స్ అనే సంస్థ అదానీ పోర్ట్స్ & స్పెషల్ ఎకనామిక్ జోన్ లో పెట్టుబడులు పెడుతున్నట్లు ది స్ట్రెయిట్స్ టైమ్స్ సోమవారం నివేదించింది. తన పబ్లిక్ షేర్ హోల్డింగ్స్ వెల్లడిలో భాగంగా ఈ మేరకు టెమాసెక్ పేర్కొన్నట్లు నివేదికలో తెలిపింది. అనుబంధ సంస్థ కామాస్ ఇన్వెస్ట్ మెంట్స్ ద్వారా అదానీ పోర్ట్స్ లో 1.2 శాతం వాటి కలిగి ఉన్నట్లు చెప్పింది. మార్కెట్ వర్గాల ఊహాగానాలపై తమ సంస్థ స్పందించదని టెమాసెక్ ప్రతినిధి సైతం వ్యాఖ్యానించినట్లు వెల్లడించింది.
విడదీయరాని బంధం:
సింగపూర్ తో అదానీ గ్రూపునకు ఏళ్ల తరబడి విడదీయరాని సంబంధాలు ఉన్నాయి. ఆ దేశానికి చెందిన విల్మర్ ఇంటర్నేషనల్ తో కలిసి వంటనూనె, ఇతర ఆహారపదార్థాల వ్యాపారం చేస్తోంది. అదానీ సింగపూర్ కేంద్రంగా ఆగ్నేయాసియాలో కార్యకలాపాలు కొనసాగిస్తోంది. భవిష్యత్తులో 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో వ్యాపారాల విస్తరణ కోసం ప్రణాళికలు రూపొందించుకుంది. వీటిలో 70 బిలియన్ డాలర్లను గ్రీన్ ఎనర్జీ, పోర్ట్స్, సిమెంట్ వ్యాపారాల్లో పెట్టాలని చూస్తుండగా..10 బిలియన్ డాలర్ల సమీకరణకుగాను టెమాసెక్, గవర్నమెంట్ ఇన్వెస్ట్ మెంట్ కార్ప్ సహా సింగపూర్ ఇన్వెస్టర్స్ తో చర్చలు జరిపినట్లు మీడియా నివేదికలో పేర్కొంది.
మరుసటి రోజే మీడియా నివేదిక:
గత రెండు ట్రేడింగ్ సెషన్లలో అదానీ షేర్లు తీవ్ర నష్టాలను చవిచూశాయి. అందుగు ప్రతిగా.. స్టాక్ మానిప్యులేషన్, అకౌంటింగ్స్ లో మోసాలు జరిగినట్లు హిండెన్ బర్గ్ చేసిన ఆరోపణలను అదానీ గ్రూప్ ఆదివారం తిప్పికొట్టింది. మరుసటి రోజే మీడియా నివేదిక బయటకు రావడం గమనార్హం.