టెలికంకు CAA దెబ్బ: ఇంటర్నెట్ బంద్తో గంటకు రూ.2.5 కోట్ల నష్టం
న్యూఢిల్లీ: అంతకుముందు ఆర్టికల్ 370, ఇటీవల CAA కారణంగా విపక్షాలు ఆందోళనలు నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్ దేశాల్లో మైనార్టీలు ఇబ్బందులుపడుతున్నారు. ఈ నేపథ్యంలో నెహ్రూ, రాజీవ్ గాంధీ, మన్మోహన్ సింగ్ ఏడు దశాబ్దాలుగా డిమాండ్ చేసిన ఆయా దేశాల మైనార్టీలకు పౌరసత్వం కల్పించే చట్టం CAAను తెచ్చామని బీజేపీ నేతలు చెబుతున్నారు. అయితే దీనిపై విపక్షాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. CAAను వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేయడం వరకు ఓకే. కానీ కొంతమంది సంఘ విద్రోహ శక్తులు వాహనాలు, భవనాలను ధ్వంసం చేశారు. విధ్వంసం సృష్టించారు. దీంతో ప్రభుత్వం పలుచోట్ల ఇంటర్నెట్ను నిలిపివేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. గతంలో ఆర్టికల్ 370 విషయంలోను ఇదే జరిగింది. నిరసనకారుల ఆందోళనలు హింసకు దారి తీస్తుండటం, దీంతో ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తుండటంతో టెలికం సంస్థలకు పెద్ద ఎత్తున నష్టం జరుగుతోంది.
2 నెలల గరిష్టానికి: భారీగా పెరిగిన బంగారం ధరలు, రూ.39,000 సమీపంలో...
ప్రతి గంటకు 24.5 మిలియన్ల ఆదాయం కోల్పోతున్నారు
ఇంటర్నెట్ బంద్వల్ల మొబైల్ ఆపరేటర్లు ప్రతి గంటకు రూ.24.5 మిలియన్ల ఆదాయాన్ని కోల్పోతున్నారు. సంఘ విద్రోహశక్తులు రెచ్చిపోతుండటంతో శుక్రవారం ఉత్తర ప్రదేశ్లోని 18 జిల్లాలు సహా వివిధ చోట్ల ఇంటర్నెట్ బంద్ చేశారు. ఈ నేపథ్యంలో ఆపరేటర్లు పెద్ద ఎత్తున నష్టపోతున్నారు. అల్లర్లు, ఆందోళనల సమయంలో ఎలాంటి వదంతులు వ్యాప్తి చెందకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇంటర్నెట్ సేవలు నిలిపి వేస్తారు.
నిన్న ఆర్టికల్ 370, నేడు CAA
గతంలో ఆర్టికల్ 370 రద్దు సమయంలో జమ్ము కాశ్మీర్లో, ఇప్పుడు CAA నేపథ్యంలో యూపీ, ఢిల్లీ, అసోం వంటి రాష్ట్రాల్లో మొబైల్ సేవలు నిలిపి వేశారు. ఢిల్లీలో కొన్ని గంటల పాటు మొబైల్, ఇంటర్నెట్ సేవలు పాక్షికంగా నిలిపివేశారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో తాము పెద్ద ఎత్తున ఆదాయం కోల్పోతున్నామని టెలికం ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
గంటకు రూ.2.45 కోట్లు
2019 లెక్కల ప్రకారం ఇంటర్నెట్ నిలిపివేత కారణంగా టెలికం ఇండస్ట్రీ ప్రతి గంటకు రూ.2.45 కోట్ల చొప్పున ఆదాయం కోల్పోతోందని సెల్యూలార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (COAI) డైరెక్టర్ జనరల్ రాజన్ మాథ్యూస్ అన్నారు. ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయిన తమకు ఇది మరింత నష్టం కలిగిస్తోందన్నారు. నష్టాలపై వొడాఫోన్ ఐడియా, ఎయిర్ టెల్, జియో స్పందించాల్సి ఉంది.