మొబైల్ బిల్లు షాక్: త్వరలో టెల్కో టారిఫ్ పెంపు.. రెండుసార్లు తప్పదు
టెలికం ఆపరేటర్లకు ప్రస్తుతం సహేతుకమైన రాబడి రావడం లేదని, ఈ నేపథ్యంలో పెంపు అనివార్యమని, అయితే ఈ పెంపు కరోనా మహమ్మారి ప్రభావంపై ఆధారపడి ఉంటుందని కన్సల్టెన్సీ సంస్థ ఈవై అంచనా వేసింది. టెల్కోలు వచ్చే 12 నుండి 18 నెలల్లో రెండు విడతలుగా టారిఫ్స్ పెంచే అవకాశం ఉందని పేర్కొంది. ఇందులో భాగంగా రాబోయే ఆరు నెలల్లో అంటే డిసెంబర్ నాటికి మొదటి విడతగా టారిఫ్ పెంచవచ్చునని తెలిపింది.
టెలికం రంగం అప్పులు, మరిన్ని కథనాలు
వీటీపై ఆధారపడి టారిఫ్ పెంపు
రానున్న 12నెలల నుండి 18నెలల్లో పెంపు అనివార్యమని, కరోనా పరిణామాలు, యూజర్ల చెల్లింపు సామర్థ్యాలపై పడిన ప్రతికూల ప్రభావాలు వంటి అంశాలపై ఈ పెంపు ఆధారపడి ఉంటుందని ఈవై ఎమర్జింగ్ మార్కెట్స్ టెక్నాలజీ లీడర్ (టెక్నాలజీ, మీడియా, ఎంటర్టైన్మెంట్ అండ్ టెలి కమ్యూనికేషన్స్(TMT) ప్రశాంత్ సింఘాల్ తెలిపారు. ప్రస్తుత విధానంతో ఆపరేటర్లకు లాభాలు లేవని, అలాగే కరోనా కారణంగా ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపుతోందని తెలిపారు.
ఇప్పడికిప్పుడు సాధ్యం కాకపోవచ్చు కానీ
ప్రస్తుత టారిఫ్స్ పెంపు ఇప్పటికిప్పుడు సాధ్యం కాకపోయినా వచ్చే ఏడాది నుండి ఏడాదిన్నరలో రెండుసార్లు ఉండవచ్చునని పేర్కొన్నారు. కచ్చితంగా పెంచాలని నేను చెప్పడం లేదు కానీ... ఎంత త్వరగా పెంచితే టెలికం రంగానికి అంత మంచిది అని అభిప్రాయపడ్డారు. ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకోవాలన్నారు. రెగ్యులేటరీ జోక్యం లేదా పరిశ్రమ నుండి పెంపు చర్య వస్తుందా అనేది వేచి చూడాలన్నారు. కానీ ఆపరేటర్ల ఆర్థిక ఆరోగ్యం కోసం, మార్కెట్లో నిలబడాలంటే టారిఫ్స్లో సవరణ మాత్రం అవసరమన్నారు.
వర్ధమాన దేశాలతో సమానంగా చేరాలంటే
టెలికం రంగం మెరుగ్గా రాణించాలంటే కంపెనీలు అందిస్తున్న సేవలకు అనుగుణంగా ధరలు ఉండాలని ప్రశాంత్ సింఘాల్ అన్నారు. డిసెంబరులో ఓసారి పెంపు ఉండాలని, ఇతర వర్ధమాన దేశాలతో సమానంగా ధరలు చేరాలంటే ఒకటి రెండుసార్లు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. అదే సమయంలో కస్టమర్లకు భారం కాకుండా చూడాలని సూచించారు. అప్పుడే ఈ రంగానికి ప్రయోజనం అన్నారు.
రెండేళ్లలో పెరగనున్న ఆర్పు
రానున్న రెండు మూడేళ్లలో ఆర్పు (యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్) 60 శాతం నుండి 80 శాతం మధ్య పెరగవచ్చునని భావిస్తున్నట్లు తెలిపారు. ఇది టారిఫ్స్ పెంపు, ఫిక్స్డ్ ప్లాన్స్ నుండి డేటా వినియోగం ఆధారిత ప్లాన్స్ మారితేనే సాధ్యం అన్నారు. మొత్తానికి టారిఫ్ పెంపు అనివార్యమన్నారు. మహమ్మారి ప్రభావం లేకుంటే జూన్లోనే పెంపును చూసి ఉండేవారమేమో అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వచ్చే ఆరు నెలల్లో చూడవచ్చునన్నారు. ప్రస్తుతం కంపెనీలకు మూలధనంపై సముచిత రాబడి లేదన్నారు.