Vodafone Idea: చాలా కాలం తర్వాత టెలికాం రంగంలోని వొడాఫోన్ ఐడియాకి మంచి రోజులు వచ్చినట్లు కనిపిస్తోంది. ఇది చూస్తుంటే కంపెనీకి మళ్లీ గత వైభవం త్వరలోనే తిరిగి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
దేశంలో అంబానికి చెందిన రిలయన్స్ జియో టెలికాం రంగంలో పెను సంచలనంగా మారటంతో చాలా కంపెనీలు కనుమరుగయ్యాయి. అయితే భారీ నష్టాలు వస్తున్నా.. కస్టమర్లు తమను వీడుతున్నప్పటికీ వొడాఫోన్ మాత్రం తమ వ్యాపారాన్ని కొనసాగిస్తోంది. కంపెనీని ప్రధానంగా పీడిస్తున్న సమస్య ఏమిటంటే ఎక్కువ మంది యూజర్లు ఇప్పటికీ 2జీ వినియోగదారులు ఉండటమే.

తాజాగా కంపెనీ రాజస్థాన్ లో ఎక్కువ సంఖ్యలో 4జీ వినియోగదారులను పొందినట్లు క్యూ2 నివేదిక ప్రకారం వెల్లడైంది. ప్రభుత్వ చొరవతో గణనీయమైన పెరుగుదలను చూసిందని కంపెనీ పేర్కొంది. ఇందిరా గాంధీ స్మార్ట్ఫోన్ యోజన రాజస్థాన్ (IGSY) చొరవలో పాల్గొనడం Viకి ఒక వరంగా మారింది. రాజస్థాన్ ప్రభుత్వం సుమారు 2.5 మిలియన్ల మంది మహిళలకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లను అందిస్తున్న తరుణంలో కొత్తగా వొడాఫోన్ ఐడియా 18 లక్షల మంది కస్టమర్లను పొందింది. ఉదయం 11.27 గంటల సమయంలో స్టాక్ ధర రూ.13.50 వద్ద ఎన్ఎస్ఈలో కొనసాగుతోంది.
తాజా పెరుగుదల కారణంగా కంపెనీ కస్టమర్లను కోల్పోతున్న సంఖ్యలు సైతం సెప్టెంబర్ త్రైమాసికంలో తగ్గాయి. మొబైల్ కనెక్షన్లను పంపిణీ చేసే టెండర్లో ప్రారంభ ప్రమేయం తర్వాత SIMలతో హ్యాండ్సెట్లను బండిల్ చేయమని అడిగినప్పుడు భారతి ఎయిర్టెల్, రిలయన్స్ జియో ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాయి. దీంతో రాజస్థాన్ ప్రభుత్వం Vi, BSNLతో జతకట్టింది. రాజస్థాన్ ప్రభుత్వం ఇప్పుడు మహిళా ఓటర్లకు సిమ్లతో కూడిన 10 మిలియన్ల ఉచిత స్మార్ట్ఫోన్లను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది రానున్న రోజుల్లో మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications