మరింత పెరగనున్న మొబైల్ బిల్స్ ... ఎందుకంటే?
అదేంటో విచిత్రం. ఆదాయం తప్ప అన్నీ పెరుగుతాయి. తాజాగా మన మొబైల్ బిల్స్ కూడా మరింతగా పెరుగుతాయని తెలుస్తోంది. ఇప్పటికే 20 శాతం వరకు పెరిగిన బిల్లులు... 2020 లోనే మరో 25% నుంచి 30% పెరిగే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ప్రపంచంలోని అన్ని దేశాలతో పోల్చితే ఇండియా లోనే మొబైల్ ఫోన్ బిల్లులు తక్కువగా ఉన్నాయట. ఒక్కో వినియోగదారుని నుంచి టెలికాం కంపెనీలకు వచ్చే ఆదాయం చాలా తక్కువగా ఉంటోందట. అందుకే కంపెనీలు నష్టాలను మూటగట్టుకుంటున్నాయట.
రూ.179తో ఎయిర్టెల్ అదిరిపోయే ఆఫర్, రూ.2 లక్షల ఇన్సురెన్స్: గడువు, అర్హత, డాక్యుమెంట్స్...
లాభాలు రావాలంటే ఆ భారాన్ని మన మీద వేసేయాలి టెలికాం కంపెనీలు నిర్ణయం తీసేసుకున్నాయని సమాచారం. ఈ మేరకు ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనం ప్రచురించింది. అందులో నుంచి కొన్ని వివరాలు మీకోసం. పెద్ద మొత్తంలో ఏజీఆర్ బకాయిలు పేరుకు పోవటం కూడా ఒక కారణమే అని అంటున్నారు. ఈ బకాయిలను సకాలంలో చెల్లించాలన్నా... లేదంటే మార్కెట్ నుంచి నిధుల సమీకరణ చేపట్టాలన్న టెలికాం కంపెనీలు తప్పనిసరిగా వాటి ఆదయ మార్గాలను పెంచుకోవాల్సి వస్తుంది. అందుకే బిల్లులు పెంచాల్సి వస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.
రెండే ఉంటే కష్టమే...
ప్రస్తుతం సుమారు రూ 53,000 కోట్ల ఏజీఆర్ బకాయి ఉన్న వోడాఫోన్ - ఐడియా ఆ సొమ్మును నిర్దిష్ట సమయంలోగా ప్రభుత్వానికి చెల్లించలేకపొతే ... అది మూతపడే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అదే జరిగితే ఇకపై కేవలం ఎయిర్టెల్, రిలయన్స్ జియో రెండు సంస్థల మధ్యే పోటీ ఉంటుంది. ఇది కూడా మొబైల్ బిల్లుల పెరుగుదలకు దారి తీస్తుందని చెబుతున్నారు. ఎందుకంటే వినియోగదారులకు పెద్దగా ఛాన్సులు ఉండవు. అయితే ఎయిర్టెల్ వాడాలి. లేదంటే జియో వినియోగించాలి. ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ ఉన్నా లేనట్టే. ఎందుకంటే ఇప్పటికే ఈ కంపెనీ కార్యకలాపాలు గణనీయంగా పడిపోయాయి. ప్రైవేట్ సంస్థలతో పోటీ పడే దశలో ఈ కంపెనీ లేదు. పైగా విపరీతమైన నష్టాలతో కనీసం వేతనాలు ఇచ్చే పరిస్థితిలో కూడా లేకుండా మనుగడ సాగిస్తోంది.
జియో రాకతో మారిన పరిణామాలు..
మూడేళ్ళ క్రితం రిలయన్స్ జియో రాకతో ఇండియాలో టెలికాం రంగం పూర్తిగా మార్పుకు లోనయ్యింది. రిలయన్స్ జియో తన వినియోగదారులకు ఏడాది పాటు పూర్తిగా ఉచిత కాల్స్ అందించింది. డేటా చార్జీలు కూడా చాలా తక్కువగా ఉండేలా చూసింది. దీంతో మూడేళ్ళ లోనే సుమారు 37 కోట్ల మంది వినియోగదారులతో దేశంలోనే నెంబర్ టెలికాం రంగ కంపెనీగా ఆవిర్భవించింది. ఈ మూడేళ్ళ కాలంలో దిగ్గజ కంపెనీలు కూడా పోటీలో నిలబడటం కష్టతరమైంది. జియో దెబ్బకు ఎయిర్టెల్, ఐడియా, వోడాఫోన్ కూడా రేట్లు తగ్గించాల్సి వచ్చింది. దీంతో వాటి ఆదాయానికి గండి పడింది. అప్పులు పేరుకుపోయాయి. అప్పటి వరకు లాభాలు ఆర్జించిన కంపెనీలు సైతం నష్టాల బాట పట్టాయి. పోటీ ని తట్టుకోలేక ఏకంగా వోడాఫోన్ - ఐడియా కలిసిపోయాయి. ఐన సరే వాటి కష్టాలు తగ్గలేదు సరికదా పెరిగాయి. ఇదే అదునుగా జియో ప్రస్తుతం చార్జీలను వసూలు చేస్తోంది. లాభాల బాటన పయనిస్తోంది.
అందుకే పెంపు...
ఇతరత్రా కారణాలతో పాటు మొబైల్ చార్జీలు పెరిగేందుకు మరో ముఖ్యమైన కారణం ఉంది. అదేమిటంటే మన దేశ జీడీపీ లో టెలికాం వినియోగ వ్యయం ప్రస్తుతం 0.73% నికి పడిపోయింది. మూడేళ్ళ క్రితం అది 1.25% మేరకు ఉండేది. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటే... ఇప్పుడున్న బిల్లులను కనీసం 30% పెంచేందుకు టెలికాం కంపెనీలకు అవకాశం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఒక్కో వినియోగదారుని నుంచి సగటు ఆదాయం రూ 120 స్థాయిలో ఉంది. జియో రాక మునుపు అది రూ 180 నుంచి రూ 200 వరకు ఉండేది. కాబట్టి మళ్ళీ అదే స్థాయికి చార్జీలను పెంచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెబుతున్నారు. ఇటీవల కంపెనీలు 14% నుంచి 33% వరకు చార్జీలు పెంచాయి. దాంతో సగటు ఆదాయం రూ 160 కి చేరింది. కానీ ఇది రూ 200 కి పెంచే యోచనలో కంపెనీలు ఉన్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు.