డీఎస్పీ అక్రమాస్తుల చిట్టాను పట్టించిన డైరీ.. భీంరెడ్డిని అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు..
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) శంకీరెడ్డి భీంరెడ్డిని ఏసీబీ అధికారులు సోమవారం సాయంత్రం అరెస్టు చేశారు. ప్రస్తుతం హైదరాబాద్లోని పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ (PCS) విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఆయనను, ఇబ్రహీంబాగ్లోని వెస్సెల్లా మెడోస్లో ఉన్న ఆయన స్వగృహం నుండి రాత్రి సుమారు 7.40 గంటలకు అదుపులోకి తీసుకున్నారు. తన సర్వీసు కాలంలో అవినీతి మార్గాలతో పాటుగా, అనుమానాస్పద మార్గాల ద్వారా ఆదాయ వనరులకు మించి అక్రమ ఆస్తులను కూడబెట్టారనే బలమైన ఆధారాలతో ఆయనను ప్రత్యేక ఏసీబీ కోర్టు ముందు హాజరుపరచనున్నారు.
జూలై 2న తెలంగాణ ,కర్ణాటక వ్యాప్తంగా డీఎస్పీ భీమ్ రెడ్డి నివాసంతో పాటు ఆయన బంధువులు, స్నేహితులు, సహచరులు, బినామీలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి ఇళ్లతో కలిపి మొత్తం 16 ప్రాంగణాల్లో ఏసీబీ ఏకకాలంలో దాడులు నిర్వహించింది. ఈ సోదాల్లో లభించిన ఆస్తుల వివరాలు అధికారులనే విస్మయానికి గురిచేశాయి.

లభించిన స్థిరాస్తులలో హైదరాబాద్ ఇబ్రహీంబాగ్లోని వెస్సెల్లా మెడోస్లో ఒక విల్లా, టెలికాం నగర్లో ఒక జీ+2+పెంట్ హౌస్ నివాస గృహంతో పాటు సాయి ప్రభా రెసిడెన్సీలో ఒక ఫ్లాట్, గచ్చిబౌలి క్రాంతి సియోన్ అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్, తెల్లాపూర్ అభినంద రెసిడెన్సీలో రెండు ఫ్లాట్లు ఉన్నాయి. అలాగే మణికొండ లాంకోహిల్స్ రోడ్డులో 500 చదరపు గజాల జీ+5 వాణిజ్య సముదాయంలో వాటా, మర్రిచెట్టు జంక్షన్ సమీపంలో 3000 చదరపు అడుగుల వాణిజ్య స్థలం, ప్రగతి రిసార్ట్స్లో 500 చదరపు గజాల స్థలం, నాగోల్ కామినేని ఆసుపత్రి సమీపంలో 200 చదరపు గజాలు, పటాన్చెరు జీపీఆర్ హౌసింగ్ సొసైటీ వద్ద 400 చదరపు గజాలు, పటాన్చెరులోనే మరో 200 చదరపు గజాలు, వికారాబాద్ మోమిన్పేట్లో 1,000 చదరపు గజాల ఖాళీ స్థలాలను గుర్తించారు.
ఇవే కాకుండా భారీ ఎత్తున వ్యవసాయ భూములను కూడా ఏసీబీ కనుగొంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో 3.5 ఎకరాలు, వికారాబాద్ మోమిన్పేట్లో 2 ఎకరాలు, ముచింతల గ్రామం (సీసీ కుంట) వద్ద 4.20 ఎకరాలు, బెంగళూరు దేవనహళ్లిలో ఒక ఎకరం భూమితో పాటు కర్ణాటకలో ఒకచోట 6 ఎకరాలు, మరోచోట ఏకంగా 38 ఎకరాల వ్యవసాయ భూములను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు మెసర్స్ శ్రీ రాఘవేంద్ర రాక్ సాండ్ మినరల్స్ సంస్థలో రూ. 75 లక్షల విలువైన పెట్టుబడులను కనుగొన్నారు. కేవలం స్థిరాస్తులే కాకుండా సోదాల సమయంలో డీఎస్పీ ఇంట్లో రూ. 3.60 లక్షల నగదు, ఆయన బినామీ నివాసంలో మరో రూ. 40 లక్షల అక్రమ నగదు దొరికింది. దాదాపు 2 కిలోగ్రాముల బంగారు ఆభరణాలు, 20 కిలోగ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్న అధికారులు, వివిధ బ్యాంకుల్లో ఉన్న సుమారు రూ. 19.91 లక్షల నిల్వలను కూడా గుర్తించారు.
ఈ అక్రమ ఆస్తుల కేసు దర్యాప్తు వేగవంతం కావడానికి డీఎస్పీ భీమ్ రెడ్డి స్వయంగా రాసుకున్న ఒక వ్యక్తిగత డైరీయే ప్రధాన కారణమని ఏసీబీ వర్గాలు వెల్లడించాయి. మే నెలలో తన భార్యతో కలిసి చార్ ధామ్ యాత్రకు వెళ్లే ముందు ఆయన ఈ డైరీని రాశారు. ఇందులో తనకున్న అక్రమ ఆస్తులు, పెట్టుబడులు, అప్పులు, బినామీల పేర్లను క్షుణ్ణంగా చేతిరాతతో నమోదు చేశారు. యాత్రకు వెళ్లే ముందే భద్రత కోసం ఈ డైరీకి సంబంధించిన స్కాన్ చేసిన కాపీలను వాట్సాప్ (WhatsApp) ద్వారా తన ఇద్దరు కుమారులకు పంపించారు.
సోదాల్లో ఈ డైరీ లభించడంతో ఏసీబీ దర్యాప్తు అధికారులకు అనేక రహస్య ఆస్తులు, బినామీ ఆర్థిక సంబంధాల లింకులను ఛేదించడం సులువైంది. ఈ డైరీయే ప్రస్తుతం ఈ కేసులో అత్యంత కీలకమైన సాక్ష్యంగా నిలిచింది. జూలై 2న సోదాలు జరగ్గా, బలమైన సాక్ష్యాధారాల ఆధారంగా జూలై 6, సోమవారం నాడు నిందితుడిని అధికారికంగా అరెస్ట్ చేశారు.


Click it and Unblock the Notifications
