Telangana: ఎలక్ట్రిక్ బ్యాటరీల యూనిట్కు మంత్రి KTR శంకుస్థాపన.. వేల మందికి ఉపాధి..!
Zahirabad News: బీఆర్ఎస్ పార్టీ పాలనలో తెలంగాణ క్రమంగా అభివృద్ధి వైపు వేగాన్ని పెంచుకుంటూ పోతోంది. అనేక సంవత్సరాలుగా జరుగుతున్న డెవలప్మెంట్ కు.. ప్రభుత్వం తీసుకొచ్చిన సింగిల్ విండో క్లియరెన్స్ కొత్త వేగాన్ని ఇచ్చింది. దీంతో తక్కువ కాలంలోనే ఎక్కువ పరిశ్రమలు తెలంగాణకు వస్తున్నాయి.
ఈ క్రమంలో మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ కు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల తయారీ పరిశ్రమకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈవీ బ్యాటరీ యూనిట్ ను జహీరాబాద్ ప్లాంట్ దగ్గరే దీనిని రూ.1,000 కోట్లతో కంపెనీ ఏర్పాటు చేస్తోంది. రెండు నెలల కిందట హైదరాబాదులో జరిగిన Telangana Mobility Valley Summitలో కంపెనీ ఈ పెట్టుబడికి సంబంధించిన ప్రకటనను చేసింది. అత్యంత వేగంగా దీనిని కార్యరూపం దాల్చటంతో అనేక కొత్త ఉపాధి అవకాశాలు స్థానిక యువతకు అందుబాటులోకి రానున్నాయి.
జహీరాబాద్ శివారు ప్రాంతంలో ఆల్విన్ కంపెనీ 1981లో తేలికపాటి వాహవాలు, బస్సులు తయారు చేసే పరిశ్రమను ఏర్పాటు చేసింది. దానిని 1996లో మహీంద్రా గ్రూప్ కొనుగోలు చేసింది. 2013లో ఇక్కడ ట్రాక్టర్ తయారీ యూనిట్ ను కంపెనీ ఏర్పాటు చేసింది. ఆ తర్వాత 2015 నుంచి ఇతర వాహనాలను సైతం తయారు చేయటం కంపెనీ ప్రారంభించింది. అయితే కంపెనీ తాజాగా వాహన రంగంలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకునే క్రమంలో ఎలక్ట్రిక్ వాహనాలకు అవసరమైన బ్యాటరీల తయారీని ఇక్కడి నుంచే చేపట్టాలని నిర్ణయించింది.
2030 నాటికి దేశంలో 70 శాతం కమర్షియల్ కార్లు, 30 శాతం ప్రైవేటు కార్లు విద్యుత్ ఆధారితమైనవిగా మారనున్నాయి. ఈ క్రమంలో 40 శాతం బస్సులు, 80 శాతం టూవీలర్లు ఎలక్ట్రిసిటీపై నడవనున్నాయని అంచనాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ఇంత భారీ షిఫ్ట్ కారణంగా బ్యాటరీల అవసరం ఎక్కువగా ఉంటుంది. దీనిని అందిపుచ్చుకునేందుకు మహీంద్రా గ్రూప్ తాజాగా తెలంగాణంలో ఏర్పాటు చేస్తున్న తయారీ యూనిట్ తోడ్పడనుందని తెలుస్తోంది.