తెలంగాణకు రూ.2,419 కోట్ల భారీ బూస్ట్.. సికింద్రాబాద్-కాజీపేట రైల్వే విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..
తెలంగాణలో రైల్వే మౌలిక సదుపాయాల బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ), సికింద్రాబాద్ (ఘట్కేసర్) - కాజీపేట మధ్య ఉన్న రైల్వే లైన్ను 4-లేన్లుగా విస్తరించేందుకు ఆమోదం తెలిపింది. మొత్తం రూ. 2,419 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టును రాబోయే నాలుగు సంవత్సరాల కాలపరిమితిలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
దాదాపు 110 కిలోమీటర్ల పొడవున్న ఈ మార్గంలో 17 ప్రధాన వంతెనలు మరియు 151 చిన్న వంతెనలు నిర్మించనున్నారు. ఈ రైలు మార్గం తెలంగాణలోని మేడ్చల్-మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, జనగాం, వరంగల్ జిల్లాల మీదుగా సాగుతుంది. ఈ సామర్థ్య పెంపుదల వల్ల రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట, భోంగీర్ కోట, సురేంద్రపురి, స్వర్ణగిరి ఆలయం వంటి ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలకు రైలు అనుసంధానం గణనీయంగా మెరుగుపడనుంది.

కేంద్ర కేబినెట్ నిర్ణయాలను వెల్లడిస్తూ రైల్వే, సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, ప్రస్తుతం ఘట్కేసర్ - కాజీపేట మధ్య ఉన్న రెండు లైన్ల విభాగం ఇప్పటికే 120 శాతం అదనపు రద్దీతో పనిచేస్తోందని, ఈ విస్తరణ ప్రాజెక్టును చేపట్టకపోతే ఈ రద్దీ భవిష్యత్తులో ఏకంగా 151 శాతానికి పెరిగే ప్రమాదం ఉందని తెలిపారు. ఈ మార్గం విస్తరణ వల్ల మోటుమారి - విష్ణుపురం, వాడి - తాండూర్లోని సిమెంట్ క్లస్టర్ల ఉత్పత్తుల రవాణాతో పాటు, బల్హర్షా, మణిక్గఢ్, గడ్చిరోలి ప్రాంతాల నుండి కర్ణాటకలోని ఉక్కు పరిశ్రమలకు ఇనుప ఖనిజం వేగంగా సరఫరా అవుతుందని వివరించారు. అంతేకాకుండా సింగరేణి బొగ్గు గనులు, పశ్చిమ బొగ్గు క్షేత్రాల సమీపంలో ఉన్నందున, ఇది వివిధ థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గును రవాణా చేయడానికి అత్యంత కీలకమైన మార్గంగా మారనుందని మంత్రి స్పష్టం చేశారు.
లైన్ సామర్థ్యం పెరగడం వల్ల రైళ్ల రాకపోకలు క్రమబద్ధీకరించబడి, భారతీయ రైల్వే కార్యాచరణ సామర్థ్యం, సేవా విశ్వసనీయత మరింత పెరుగుతాయని అశ్విని వైష్ణవ్ అన్నారు. ఈ మల్టీ-ట్రాకింగ్ ప్రాజెక్టులు మార్గంలో రద్దీని తగ్గించి, వ్యాపార లావాదేవీలను సులభతరం చేస్తాయని పేర్కొన్నారు. అంతిమంగా ఈ ప్రణాళికలన్నీ ప్రధానమంత్రి ఆవిష్కరించిన 'నూతన భారతదేశ దార్శనికత'కు అనుగుణంగా సాగుతున్నాయని, ప్రాంతీయంగా సమగ్ర అభివృద్ధిని సాధించడం ద్వారా ప్రజలకు ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలను పెంచి వారిని 'ఆత్మనిర్భర్' (స్వయం సమృద్ధి)గా తీర్చిదిద్దడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమని ఆయన వివరించారు.


Click it and Unblock the Notifications
