తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న హైదరాబాద్ (Hyderabad) నగరాభివృద్ధిపై బడ్జెట్ (Telangana Budget 2026-27) లో కీలక ప్రకటనలు వెలువడ్డాయి. నగర పాలనను మరింత చేరువ చేసేందుకు , మౌలిక సదుపాయాలను వేగవంతంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)ని పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించింది. దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి GHMC పునర్వవస్థీకరణ గురించి ప్రస్తావించారు. హైదరాబాద్ (Hyderabad) నగరంలో మూడు కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి ప్రకటించారు. కేవలం పాలనా సౌలభ్యం కోసమే కాకుండా, హైదరాబాద్ను ప్రపంచ స్థాయి నగరాల జాబితాలో టాప్- 10 లో నిలబెట్టడమే లక్ష్యంగా ఈ మార్పులు చేపడుతోంది.

మూడు కొత్త మున్సిపల్ కార్పొరేషన్లు
పెరుగుతున్న జనాభా , విస్తరిస్తున్న నగర పరిధిని దృష్టిలో ఉంచుకుని, జీహెచ్ఎంసీని మూడు వేర్వేరు మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
- 1. గ్రేటర్ హైదరాబాద్ (Greater Hyderabad)
- 2. సైబరాబాద్ (Cyberabad)
- 3. మల్కాజ్గిరి (Malkajgiri)
ఈ విభజనలో భాగంగా ఔటర్ రింగ్ రోడ్ (ORR) లోపల , వెలుపల ఉన్న 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లను విలీనం చేసి కొత్త డివిజన్లు , బ్లాక్లను ఏర్పాటు చేయనున్నారు. దీనివల్ల అధికార వికేంద్రీకరణ జరిగి, స్థానిక సమస్యల పరిష్కారం మరింత వేగవంతం అవుతుంది.
హైడ్రా (HYDRA) , సమన్వయ సంస్థ
నగరంలోని వివిధ విభాగాల మధ్య సమన్వయం కోసం ప్రభుత్వం ఒక కొత్త చట్టపరమైన సంస్థను ఏర్పాటు చేయబోతోంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ బోర్డు , ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్న 'హైడ్రా' (HYDRA) వంటి అన్ని ఏజెన్సీలను ఒకే గొడుగు కిందకు తీసుకురావడానికి చట్ట సవరణ చేయనున్నారు. దీనివల్ల విపత్తు నిర్వహణ, చెరువుల రక్షణ , మౌలిక సదుపాయాల కల్పనలో స్పష్టత వస్తుందని ప్రభుత్వం బడ్జెట్లో వివరించింది.
రియల్ ఎస్టేట్ రంగానికి బూస్ట్
ఈ పునర్వ్యవస్థీకరణ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి పెద్ద ఊతం ఇవ్వనుంది. ముఖ్యంగా సైబరాబాద్ , మల్కాజ్గిరి ప్రాంతాలు స్వతంత్ర కార్పొరేషన్లుగా మారడం వల్ల ఆయా ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీ , విద్యుత్ వంటి వసతులు మెరుగుపడతాయి. ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి కోసం సమర్థవంతమైన అధికారులను నియమించడమే కాకుండా, పాలనలో సంస్కరణలు తీసుకురావడం వల్ల పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం భారత్ నుండి ఢిల్లీ, ముంబై మాత్రమే గ్లోబల్ సిటీల జాబితాలో ఉండగా, త్వరలోనే హైదరాబాద్ కూడా ఆ జాబితాలో చేరుతుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.
తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం హైదరాబాద్ భవిష్యత్తును మార్చేసేలా ఉంది. జీహెచ్ఎంసీ విభజన ద్వారా సామాన్య పౌరులకు సేవలు వేగంగా అందడమే కాకుండా, నగరం అంతటా సమతుల్య అభివృద్ధి జరుగుతుంది. హైదరాబాద్ ను గ్లోబల్ హబ్ గా మార్చే దిశగా వేస్తున్న ఈ అడుగులు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు , గృహ కొనుగోలుదారులకు కొత్త అవకాశాలను తెచ్చిపెట్టనున్నాయి.


Click it and Unblock the Notifications