రాష్ట్ర ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టనున్న కొత్త బడ్జెట్ సంక్షేమం, అభివృద్ధి మధ్య సమతుల్యతను సాధించేలా రూపుదిద్దుకుంటోంది. మొత్తం బడ్జెట్ సుమారు రూ.3.30 లక్షల కోట్లకు చేరనున్నట్లు అంచనా. గత బడ్జెట్లో రూ.3,04,965 కోట్ల వ్యయం ప్రతిపాదించగా, ఈసారి దానిపై 8-10 శాతం పెంపుతో భారీ బడ్జెట్ను సిద్ధం చేసినట్లు సమాచారం. శాసనసభలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, శాసనమండలిలో ఉత్తమ్కుమార్రెడ్డి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు.
ఈ బడ్జెట్లో ప్రధాన ఆకర్షణ సంక్షేమ పథకాలకే. రూ.1 లక్ష కోట్లకు పైగా సంక్షేమ రంగానికి కేటాయించే అవకాశాలున్నాయి. ముఖ్యంగా రైతులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, మహిళలు, పిల్లల సంక్షేమానికి భారీ నిధులు వెచ్చించనున్నారు. గతంలో ఈ విభాగాలకు రూ.72,396 కోట్లు కేటాయించగా, ఈసారి దాదాపు రూ.77 వేల కోట్ల వరకు పెంచే ప్రతిపాదనలు ఉన్నాయి.
Mar 20, 2026, 9:47 am IST
మధ్యాహ్నం 12 గంటలకు సభలో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క. 2026-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ సుమారు రూ.3.30 లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా
Mar 20, 2026, 9:29 am IST
ఉదయం 9.30 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ. ఈ భేటీలో బడ్జెట్ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది.
Mar 20, 2026, 9:28 am IST
బడ్జెట్ ప్రవేశపెట్టే కార్యక్రమం మధ్యాహ్నం 12.00 గంటలకు ఉభయ సభలతో ప్రారంభం కానుంది.
Mar 20, 2026, 8:53 am IST
2024–25లో రూ.2.91 లక్షల కోట్ల బడ్జెట్ను ప్రతిపాదించగా.. 2025–26లో 5 శాతం పెంచి రూ.3.05 లక్షల కోట్ల బడ్జెట్ను ప్రతిపాదించింది.ఇదే కొనసాగితే 2026–27కు రూ.3.20 లక్షల కోట్ల వరకు ప్రతిపాదించే అవకాశముంది.
Mar 20, 2026, 8:51 am IST
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడోసారి బడ్జెట్ ప్రవేశపెడుతోంది.
Mar 20, 2026, 7:40 am IST
కొత్త రుణాల సేకరణ కూడా రూ.70 వేల కోట్ల వరకు ఉండే అవకాశముంది. ఇందులో 70 శాతానికి పైగా పాత రుణాల చెల్లింపులకే వినియోగించాల్సి వస్తోంది.
Mar 20, 2026, 7:40 am IST
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై అత్యధిక ఒత్తిడి రుణాలు మరియు వాటి వడ్డీ చెల్లింపుల వల్లనే. గతంలో వడ్డీల కోసం రూ.19,369 కోట్లు కేటాయించినా, చివరికి రూ.25 వేల కోట్లకు పైగా ఖర్చు అయ్యింది. ఈసారి కూడా ఇదే స్థాయిలో నిధులు అవసరమవుతాయని అంచనా.
Mar 20, 2026, 7:40 am IST
పెన్షన్ల కోసం రూ.16 వేల కోట్లు అవసరమవుతుండగా, రిటైర్ అవుతున్న ఉద్యోగుల బెనిఫిట్స్కు కూడా భారీగా నిధులు అవసరం. పెండింగ్ బిల్లులు కూడా ప్రభుత్వంపై అదనపు ఒత్తిడిని సృష్టిస్తున్నాయి.
Mar 20, 2026, 7:40 am IST
ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్ల భారం కూడా బడ్జెట్పై ప్రభావం చూపుతోంది. గతంలో రూ.44,478 కోట్లు కేటాయించినా సరిపోక, ఈసారి రూ.46 వేల కోట్ల వరకు పెంచే అవకాశం ఉంది.
Mar 20, 2026, 7:40 am IST
ఇందిరమ్మ ఇళ్లు, సాగునీటి ప్రాజెక్టులు, యంగ్ ఇండియా స్కూల్స్ వంటి ప్రాజెక్టులకు భారీగా నిధులు అవసరం. ఇందిరమ్మ ఇళ్ల కోసం మాత్రమే రూ.17 వేల కోట్ల వరకు కేటాయించవచ్చని సమాచారం.
Mar 20, 2026, 7:40 am IST
అభివృద్ధి పనుల విషయంలో మూలధన వ్యయం కీలక పాత్ర పోషించనుంది. గత బడ్జెట్లో రూ.36,504 కోట్లుగా ఉన్న మూలధన వ్యయం ఈసారి రూ.45 వేల కోట్లకు పెరిగే అవకాశముంది.
Mar 20, 2026, 7:39 am IST
30 లక్షల వ్యవసాయ బోర్లు, 50 లక్షల గృహజ్యోతి ఇళ్లకు విద్యుత్ సరఫరా కోసం డిస్కంలు రూ.20 వేల కోట్లు కోరాయి. గతంలో ఇచ్చిన రూ.14 వేల కోట్లు సరిపోకపోవడంతో ఈసారి కేటాయింపులు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
Mar 20, 2026, 7:39 am IST
రైతుభరోసా, రైతుబీమా, వ్యవసాయ యాంత్రీకరణ వంటి పథకాల కోసం రూ.20 వేల కోట్లు కేటాయించే అవకాశముంది. అలాగే ఉచిత విద్యుత్ పథకాలకు భారీ భారం పడుతోంది.