తెలంగాణ బడ్జెట్..ఈ రంగాలకే అధిక కేటాయింపులు.. రైతుల కోసం ఎంతంటే..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టనున్న కొత్త బడ్జెట్ సంక్షేమం, అభివృద్ధి మధ్య సమతుల్యతను సాధించేలా రూపుదిద్దుకుంటోంది. మొత్తం బడ్జెట్ సుమారు రూ.3.30 లక్షల కోట్లకు చేరనున్నట్లు అంచనా. గత బడ్జెట్లో రూ.3,04,965 కోట్ల వ్యయం ప్రతిపాదించగా, ఈసారి దానిపై 8-10 శాతం పెంపుతో భారీ బడ్జెట్ను సిద్ధం చేసినట్లు సమాచారం. శాసనసభలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, శాసనమండలిలో ఉత్తమ్కుమార్రెడ్డి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు.
ఈ బడ్జెట్లో ప్రధాన ఆకర్షణ సంక్షేమ పథకాలకే. రూ.1 లక్ష కోట్లకు పైగా సంక్షేమ రంగానికి కేటాయించే అవకాశాలున్నాయి. ముఖ్యంగా రైతులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, మహిళలు, పిల్లల సంక్షేమానికి భారీ నిధులు వెచ్చించనున్నారు. గతంలో ఈ విభాగాలకు రూ.72,396 కోట్లు కేటాయించగా, ఈసారి దాదాపు రూ.77 వేల కోట్ల వరకు పెంచే ప్రతిపాదనలు ఉన్నాయి.

వ్యవసాయ రంగానికి కూడా ప్రాధాన్యత పెరుగుతోంది. రైతుభరోసా, రైతుబీమా, వ్యవసాయ యాంత్రీకరణ వంటి పథకాల కోసం రూ.20 వేల కోట్లు కేటాయించే అవకాశముంది. అలాగే ఉచిత విద్యుత్ పథకాలకు భారీ భారం పడుతోంది. 30 లక్షల వ్యవసాయ బోర్లు, 50 లక్షల గృహజ్యోతి ఇళ్లకు విద్యుత్ సరఫరా కోసం డిస్కంలు రూ.20 వేల కోట్లు కోరాయి. గతంలో ఇచ్చిన రూ.14 వేల కోట్లు సరిపోకపోవడంతో ఈసారి కేటాయింపులు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
అభివృద్ధి పనుల విషయంలో మూలధన వ్యయం కీలక పాత్ర పోషించనుంది. గత బడ్జెట్లో రూ.36,504 కోట్లుగా ఉన్న మూలధన వ్యయం ఈసారి రూ.45 వేల కోట్లకు పెరిగే అవకాశముంది. ఇందిరమ్మ ఇళ్లు, సాగునీటి ప్రాజెక్టులు, యంగ్ ఇండియా స్కూల్స్ వంటి ప్రాజెక్టులకు భారీగా నిధులు అవసరం. ఇందిరమ్మ ఇళ్ల కోసం మాత్రమే రూ.17 వేల కోట్ల వరకు కేటాయించవచ్చని సమాచారం.
ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్ల భారం కూడా బడ్జెట్పై ప్రభావం చూపుతోంది. గతంలో రూ.44,478 కోట్లు కేటాయించినా సరిపోక, ఈసారి రూ.46 వేల కోట్ల వరకు పెంచే అవకాశం ఉంది. పెన్షన్ల కోసం రూ.16 వేల కోట్లు అవసరమవుతుండగా, రిటైర్ అవుతున్న ఉద్యోగుల బెనిఫిట్స్కు కూడా భారీగా నిధులు అవసరం. పెండింగ్ బిల్లులు కూడా ప్రభుత్వంపై అదనపు ఒత్తిడిని సృష్టిస్తున్నాయి.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై అత్యధిక ఒత్తిడి రుణాలు మరియు వాటి వడ్డీ చెల్లింపుల వల్లనే. గతంలో వడ్డీల కోసం రూ.19,369 కోట్లు కేటాయించినా, చివరికి రూ.25 వేల కోట్లకు పైగా ఖర్చు అయ్యింది. ఈసారి కూడా ఇదే స్థాయిలో నిధులు అవసరమవుతాయని అంచనా. కొత్త రుణాల సేకరణ కూడా రూ.70 వేల కోట్ల వరకు ఉండే అవకాశముంది. ఇందులో 70 శాతానికి పైగా పాత రుణాల చెల్లింపులకే వినియోగించాల్సి వస్తోంది.
ఏదేమైనా ఈ బడ్జెట్ సంక్షేమాన్ని కొనసాగిస్తూ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలనే లక్ష్యంతో రూపొందించబడుతోంది. అయితే రుణ భారం, వడ్డీ చెల్లింపులు రాష్ట్ర ఆర్థిక స్థితిపై కీలక ప్రభావం చూపే అంశాలుగా మారుతున్నాయి.


Click it and Unblock the Notifications