IT News: హైదరాబాద్లో రీసెర్చ్ సెంటర్ విస్తరణకు సేల్స్ఫోర్స్ నిర్ణయం.. KTR ఏమన్నారంటే..
Salesforce: టెక్ కంపెనీల పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది హైదరాబాద్ నగరం. ఒకప్పుడు బెంగళూరును పెట్టుబడులకు ఎంచుకున్న కంపెనీలు ఇప్పుడు వ్యాపార అనుకూల వాతావరణంతో పాటు, స్కిల్ ఉద్యోగులు లభించటంతో కంపెనీలు తెలంగాణలో తమ విస్తరణను సాగిస్తున్నాయి.
టెక్ కంపెనీలు ప్రపంచ స్థాయిలో దూసుకుపోతున్న వేళ ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ మేజర్ సేల్స్ఫోర్స్ హైదరాబాద్లోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ని విస్తరించడం ద్వారా తన భారత వ్యాపారాన్ని విస్తరించనున్నట్లు గురువారం ప్రకటించింది. 2016లో ప్రారంభమైన హైదరాబాద్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కంపెనీకి కీలక కేంద్రంగా మారింది. ప్రస్తుతం కంపెనీకి బెంగళూరు, ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, పూణె, జైపూర్లోని కార్యాలయాల్లో 9,000 మంది ఉద్యోగులు ఉన్నారు.

దేశంలో వృద్ధి పథం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉందని, వేగంగా అభివృద్ధి చెందాలని తాము భావిస్తున్నట్లు సేల్స్ఫోర్స్ ఇండియా CEO, ఛైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య తెలిపారు. హైదరాబాద్ CoEలోని బృందాలు అన్ని పరిమాణాల సంస్థలకు అవసరమైన క్లౌడ్ పరిష్కారాలను సిద్ధం చేస్తున్నారని ఆమె వెల్లడించారు. కంపెనీ హెల్త్ క్లౌడ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ క్లౌడ్, నెట్ జీరో క్లౌడ్ ఉన్నాయని ఆమె తెలిపారు. Air India, HDFC Ltd, Tata CliQ, Mahindra Ltd వంటి ప్రముఖ భారతీయ కంపెనీలు తమ కస్టమర్లతో కనెక్ట్ కావడానికి సేల్స్ఫోర్స్ టెక్నాలజీలను ఉపయోగిస్తాయని వెల్లడించారు.
భారతదేశం గ్లోబల్ డిజిటల్ నాయకత్వాన్ని సాధిస్తున్నందున, హైదరాబాద్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ త్వరలో అనేక ప్రపంచ స్థాయి ఆవిష్కరణలకు నిలయంగా మారుతుందని అంచనా వేస్తున్నట్లు తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. హైదరాబాద్ సేల్స్ఫోర్స్ వృద్ధి వ్యూహంలో అంతర్భాగంగా మారినందుకు గర్విస్తున్నామని ఆయన తెలిపారు.


Click it and Unblock the Notifications