IT Layoffs: భారతీయ టెక్ ఉద్యోగులకు ఇప్పుడిప్పుడే లేఆఫ్ హీట్ తగులుతోంది. చాలా దేశాల్లో ప్రఖ్యాత కంపెనీలు గత ఏడాది చివరి నుంచే ఎడాపెడా ఉద్యోగులను తొలిగించి ఖర్చులను తగ్గించుకున్నాయి. పరిస్థితులు మరింతగా దిగజారుతున్న వేళ కంపెనీలు మరింత కఠినంగా వ్యవహరిస్తున్నాయి.
గడచిన రెండేళ్లుగా టెక్ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా నిరంతరం ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతూనే ఉన్నాయి. చాలా కంపెనీలు అధిక జీతాలు అందుకుంటున్న, అనేక సంవత్సరాలుగా తమ వద్ద పనిచేస్తున్న ఉద్యోగులను సైతం వదులుకున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు దాదాపు 2.5 లక్షల మంది టెక్కీలను ఇళ్లకు పంపేశాయి. ఇది గత ఏడాది నమోదైన తొలగింపుల కంటే 50 శాతం అధికం. ముందుగా గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్ వంటి కంపెనీలు తొలగింపులను ప్రారంభించగా చివరికి ఆ ప్రభావం స్టార్టప్ కంపెనీలను కూడా తాకింది.

గతవారం నాటికి 1,106 కంపెనీలు 2,48,974 మంది ఉద్యోగులను తొలగించాయి. గత ఏడాది 1,54,336 మందిని ఇదే సమయంలో టెక్ కంపెనీలు లేఆఫ్ చేశఆయి. ప్రధానంగా రిటైల్ టెక్, కన్జ్యూమర్ టెక్ రంగాల్లో ఉద్యోగుల తొలగింపులు ఎక్కువగా నమోదయ్యాయి. అయితే ఏడాది ముగిసే నాటికి తొలగింపులు ఇంకా ఉంటాయని తెలుస్తోంది. ఈ క్రమంలోనే అమెజాన్ తాజాగా తన అలెక్సా విభాగంలో ఉద్యోగులకు ఉద్వాసన పలికింది.
ఇక భారతీయ టెక్ కంపెనీల విషయానికి వస్తే సరైన డీల్స్ లేక కంపెనీలు డీలా పడ్డాయి. మరో పక్క నియామకాలను సైతం దాదాపుగా నిలిపివేశాయని ఇటీవలి త్రైమాసిక ఫలితాలను అన్వేషించగా వెల్లడైంది. పైగా బెచ్ పై ఉద్యోగులు ఎక్కువగా కొనసాగటం.. ఖర్చులను తగ్గించుకునేందుకు వేతన పెంపులను వాయిదా వేయటం, కొన్ని విభాగాల ఉద్యోగులకు హైక్స్ నిరాకరించటం వంటి చర్యలతో ప్రస్తుతానికి ఉపశమనం పొందుతున్నాయి. అయితే ఈ ధోరణి ఇలాగే మరికొన్ని త్రైమాసికాలు కొనసాగితే ఇండియాలో సైతం టెక్ కంపెనీలు ఉద్యోగుల కోతలకు వెళ్లక తప్పని పరిస్థితులు ఏర్పడతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications