Work From Home: టెక్కీల ఆటలు ఇక సాగవు..! NO వర్క్ ఫ్రమ్ హోమ్.. మళ్లీ ఉరుకులు పరుగుల జీవితమే..
Work From Home: స్విగ్గీ, మీషో వంటి కంపెనీలు ఉద్యోగులు ఎక్కడి నుంచైనా పనిచేయవచ్చని అవకాశం కలిపిస్తున్నాయి. ఈ తరుణంలో.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టెక్ కంపెనీలు తమ ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు తీసుకురావటానికి ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఇంటి వద్ద నుంచి ఎక్కువ కాలం పని చేయటం వల్ల వారి క్రియేటివిటీ దెబ్బతింటుందని వారు ఆందోళన చెందుతున్నారు. తాజాగా ఆపిల్ కంపెనీ కూడా ఇదే మార్గాన్ని ఎంచుకుంది. ఇకపై ఉద్యోగుల ఆటలు సాగవని టెక్ నిపుణులు అంటున్నారు. దీనికి తోడు దేశంలో ఏఏ కంపెనీలు ఇదే దారిలో నడుస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
రూటు మార్చిన ఆపిల్..
నెమ్మదిగా ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు తిరిగి తీసుకొచ్చేందుకు ఆపిల్ సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా హైబ్రిడ్ వర్క ఫ్రమ్ హోమ్ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు సీఈవో టిమ్ కుక్ ఉద్యోగులకు తెలిపారు. ఈ విధానం ద్వారా వారానికి 2 రోజులు ఇంటి వద్ద నుంచి పనిచేసేందుకు వెసులు బాటు ఉంటుంది. అయితే ఆఫీసులకు సెప్టెంబర్ 5 నాటికి తప్పుకుండా రావాలని కంపెనీ ఉద్యోగులకు స్పష్టం చేసింది. దీనిపై గతంలో ఉద్యోగులతో సర్వే నిర్వహించగా దాదాపు 76 శాతం మంది ఆఫీసులకు తిరిగి రావటానికి విముకత చూపారు. అయితే పరిస్థితులను కంపెనీ మెల్లగా మారుస్తోంది.
RPG గ్రూప్..
ఇటీవల RPG గ్రూప్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా కూడా ఉద్యోగులు తిరిగి ఆఫీసులకు రావలసిందిగా యోచిస్తున్నారు. ఇటీవల లింక్డ్ఇన్లో దీనిపై చర్చ మెుదలైంది. మనం సంస్థ స్పూర్తి, లక్ష్యం, సంస్కృతి, సృజనాత్మకత, స్నేహాన్ని పెంపొందించుకోవాలని అన్నారు. లాంగ్ టర్మ్ లో ఇంటి వద్ద నుంచి పనిచేయటం ఆచరణీయమైనది కాదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం RPG గ్రూప్ తన ఉద్యోగుల్లో సగం మంది హైబ్రిడ్ మోడ్లో పని చేయడానికి అనుమతిస్తుంది.
టాటా కన్సల్టెన్సీ గ్రూప్..
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 20% ఉద్యోగులు తిరిగి ఆఫీసులకు వస్తున్నారు. తక్షణ ప్రాతిపదికన కంపెనీ రిటర్న్-టు-ఆఫీస్ మోడల్ను కొనసాగిస్తామని వెల్లడించింది. 25/25 ప్రణాళికను మరింత నియంత్రిత పద్ధతిలో అమలు చేయనున్నట్లు మేనేజింగ్ డైరెక్టర్ రాజేష్ గోపీనాథన్ తెలిపారు.
విప్రో మాట ఇదే..
ప్రస్తుతానికి ఉద్యోగులకు వెసులుబాటు కల్పిస్తూ విప్రో ఎంప్లాయిస్ ను కార్యాలయానికి రావాలని ఒత్తిడి చేయటం లేదు. ఉద్యోగులు ఆఫీసులకు రావాలని క్లయింట్లు కోరటం తగ్గించారని కంపెనీ వెల్లడించింది. అయితే.. ఉద్యోగులకు సౌలభ్యాన్ని అందించడంతోపాటు, కనెక్ట్గా ఉండటం చాలా ముఖ్యమని భావిస్తున్నట్లు చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ (CHRO) సౌరభ్ గోవిల్ అన్నారు.
టెక్ మహీంద్రా..
కొవిడ్ తరువాత పరిస్థితి మెరుగుపడినందున.. ఆనంద్ మహీంద్రా నేతృత్వంలోని మహీంద్రా గ్రూప్ ఉద్యోగులను ఆగస్టు నుంచి వారంలోని అన్ని పని దినాల్లో కార్యాలయానికి తిరిగి రావాలని కోరింది. జూలై వరకు కంపెనీ ఉద్యోగులను ఇంటి నుంచి లేదా కార్యాలయం నుంచి పని చేయడానికి అనుమతించింది. అయితే ఇకపై తప్పక ఆఫీసులకు రావాల్సిందేనని కంపెనీ తేల్చి చెప్పింది.
జెన్సార్ టెక్నాలజీస్..
ఉద్యోగులను వారి మేనేజర్లతో కనెక్ట్ చేసే ప్రయత్నంలో, RPG గ్రూప్కు చెందిన IT సేవల సంస్థ Zensar వారంలో కొన్ని రోజులు కార్యాలయానికి తిరిగి రావాలని తన సిబ్బందిని కోరింది. ప్రస్తుతం వారానికి రెండు/మూడు రోజులు సౌకర్యవంతమైన ఎంపికను అందిస్తోంది. ఆఫీసులకు వచ్చి పని చేయటం వల్ల మేనేజర్లు, సహచరులు, సహోద్యోగులతో కనెక్ట్ అవ్వగలరని కంపెనీ చెబుతోంది. ఏదేమైతేనేం ఇకపై టెక్కీలకు మళ్లీ ఉరుకులు పరుగుల జీవితం తిరిగి ప్రారంభం కాబోతోంది. మెల్లమెల్లగా కంపెనీలు రానున్న కాలంలో పూర్తి స్థాయిలో ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు రావాలని కోరుతున్నాయి.