ఉద్యోగుల జీతాల్లో కోత.. బాస్ అకౌంట్లో మాత్రం రూ.28 కోట్లు! TCS ఉద్యోగుల ఆగ్రహం!
భారతీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) లో ఇప్పుడు ఒక కొత్త వివాదం ముదురుతోంది. కంపెనీ తాజాగా విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం, టీసీఎస్ సీఈఓ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కే కృతివాసన్ గత ఆర్థిక సంవత్సరంలో (FY26) ఏకంగా రూ.28 కోట్లకు పైగా జీతాన్ని అందుకున్నారు. గతేడాదితో పోలిస్తే ఆయన జీతం 6.3% పెరిగింది. అయితే, ఇదే సమయంలో కంపెనీలో శాలరీ హైక్ (salary hike) కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగుల నుంచి మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
అప్రైజల్స్ తర్వాత జరిగిన కొన్ని మార్పుల వల్ల తమ చేతికి వచ్చే నెలవారీ జీతం (Take-home salary) పెరగాల్సింది పోయి, మరింత తగ్గిందని చాలా మంది ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. ఒకవైపు తమకు సరైన జీతాల పెంపు లేకపోగా, బాస్ జీతం మాత్రం కోట్లలో ఉండటంపై వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

సీఈఓ జీతం.. సామాన్య ఉద్యోగి కంటే 333 రెట్లు ఎక్కువ!
కృతివాసన్ అందుకున్న రూ.28 కోట్ల ప్యాకేజీలో బేసిక్ శాలరీ కేవలం రూ.1.67 కోట్లు మాత్రమే. మిగతాదంతా అలవెన్సులు, కంపెనీ లాభాల్లో వచ్చే కమిషన్ రూపంలోనే అందింది. ఇందులో దాదాపు రూ.25 కోట్లు కేవలం పర్ఫార్మెన్స్ లింక్డ్ కమిషన్ కావడం విశేషం. అయితే, ఈ నివేదికలో షాకింగ్ విషయం ఏంటంటే.. కంపెనీలోని ఒక సాధారణ ఉద్యోగి సగటు (Median) జీతంతో పోలిస్తే, సీఈఓ కృతివాసన్ జీతం ఏకంగా 333 రెట్లు ఎక్కువ! ఈ భారీ వ్యత్యాసమే ఇప్పుడు ఉద్యోగుల్లో చర్చనీయాంశంగా మారింది.
మిగతా కంపెనీల బాస్ల జీతాలు ఎంతంటే?
టీసీఎస్ సీఈఓ జీతం రూ.28 కోట్లు వినడానికి చాలా పెద్ద మొత్తంగా అనిపించినా, దేశంలోని ఇతర టాప్ ఐటీ కంపెనీల సీఈఓలతో పోలిస్తే ఇది తక్కువేనని చెప్పాలి. మన దేశంలో అత్యధిక జీతం తీసుకుంటున్న ఐటీ బాస్ల లిస్ట్ ఇలా ఉంది..
- సి విజయకుమార్ (HCLTech): ఈయన ఏడాదికి అత్యధికంగా రూ. 94.6 కోట్లు తీసుకుంటూ దేశంలోనే టాప్ ఐటీ ఎగ్జిక్యూటివ్గా నిలిచారు.
- సలీల్ పరేఖ్ (Infosys): ఇన్ఫోసిస్ బాస్ సలీల్ పరేఖ్ ఏడాదికి రూ. 80.62 కోట్ల భారీ ప్యాకేజీని అందుకుంటున్నారు.
- మోహిత్ జోషి (Tech Mahindra): టెక్ మహీంద్రా సీఈఓ మోహిత్ జోషి వార్షిక సంపాదన దాదాపు రూ. 54 కోట్లుగా ఉంది.
- శ్రీనివాస్ పల్లియా (Wipro): విప్రో సారథి శ్రీనివాస్ పల్లియా కూడా ఏడాదికి సుమారు రూ. 54 కోట్లు ఆర్జిస్తున్నారు.
- కే కృతివాసన్ (TCS - FY26): దేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీకి నాయకత్వం వహిస్తున్నప్పటికీ, మిగతావారితో పోలిస్తే కృతివాసన్ జీతం రూ. 28 కోట్లుగా కాస్త తక్కువగానే ఉంది
HCL టెక్ సీఈఓ విజయకుమార్ జీతం వచ్చే ఏడాది ఏకంగా రూ.154 కోట్లకు చేరే అవకాశం ఉందట. ఇక ఇన్ఫోసిస్ సీఈఓ జీతం అక్కడి సాధారణ ఉద్యోగి జీతం కంటే 750 రెట్లు ఎక్కువ కాగా, టెక్ మహీంద్రాలో ఈ గ్యాప్ ఏకంగా 840 రెట్లు పైనే ఉంది.
TCS క్లారిటీ..
ఈ వివాదంపై టీసీఎస్ యాజమాన్యం స్పందించింది. తాము ఎవరి జీతాల్లోనూ కోత విధించలేదని కంపెనీ స్పష్టమైన వివరణ ఇచ్చింది. అయితే, ఉద్యోగుల మంత్లీ టేక్-హోమ్ శాలరీ తగ్గడానికి గల కారణాన్ని కూడా వెల్లడించింది. ఇప్పటివరకు ఉద్యోగుల మంత్లీ కాంపెన్సేషన్ స్ట్రక్చర్లో కలిపి ఉన్న గ్రాట్యుటీ (Gratuity) మొత్తాన్ని.. ఇకపై కాస్ట్-టు-కంపెనీ (CTC) లోని మంత్లీ పేమెంట్స్ నుంచి మినహాయించినట్లు పేర్కొంది. దీనివల్ల నెలకు చేతికొచ్చే జీతంలో స్వల్ప మార్పు కనిపించిందే తప్ప, ఎవరికీ శాలరీ కట్ చేయలేదని, వార్షిక జీతాల పెంపు (salary hike) ప్రక్రియ ఎప్పటిలాగే నిబంధనల ప్రకారం సాగుతుందని కంపెనీ యాజమాన్యం క్లారిటీ ఇచ్చింది.
ఉద్యోగాల కోత భయం!
ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో ఆర్థిక అస్థిరత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వల్ల వస్తున్న మార్పుల వల్ల ఐటీ కంపెనీలు సతమతమవుతున్నాయి. ఈ నేపథ్యంలో, దాదాపు 12,000 మంది ఉద్యోగులను (అంటే మొత్తం వర్క్ఫోర్స్లో 2%) తొలగించడానికి టీసీఎస్ ప్లాన్ చేస్తోందనే వార్తలు కూడా వస్తున్నాయి.


Click it and Unblock the Notifications