TCS Q3 ఫలితాలు: స్వల్పంగా పెరిగిన లాభం, రూ.5 డివిడెండ్
ముంబై: టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) నికర లాభం స్వల్పంగా పెరిగింది. 2019 డిసెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ నికర లాభం అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 0.20 శాతం పెరిగింది. ఇది నామమాత్రపు పెరుగుదల. గత ఏడాది ఇదే సమయంలో రూ.8,105 కోట్లగా ఉండగా ఈసారి రూ.8,118 కోట్లుగా ఉంది.
టీసీఎస్ ఈసారి రూ.8,180 కోట్లకు చేరుకుంటుందని విశ్లేషకులు అంచనా వేశారు. దాదాపు అంచనాలకు సమీపంలో నిలిచింది. కంపెనీ ఆదాయం 6.7 శాతం వృద్ధితో రూ.37,338 కోట్ల నుంచి రూ.39,854 కోట్లకు చేరుకుంది. ఆపరేటింగ్ మార్జిన్ 25 శాతంగా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలోని రెండో క్వార్టర్లో ఇది 24 శాతంగా ఉంది.
డిసెంబర్ త్రైమాసికానికి ప్రతి షేరుకు రూ.5 చొప్పున డివిడెండ్ను టీసీఎస్ ప్రకటించింది. ఈ డివిడెండ్ చెల్లింపుకు జనవరి 25 రికార్డు తేదీ కాగా, చెల్లింపు జనవరి 31వ తేదీన జరుగుతుంది.