టీసీఎస్ ఉద్యోగులకు బిగ్ షాక్.. హైక్ ఇచ్చినట్లే ఇచ్చి జీతంలో కొంత కట్ చేసిన టెక్ దిగ్గజం..
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) సంస్థలో ఇటీవల ఏప్రిల్ నెల జీతాలు అందుకున్న ఉద్యోగుల్లో చాలామంది తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తాము ఆశించిన దానికంటే తక్కువ మొత్తంలో 'వేరియబుల్ పే' (త్రైమాసిక బోనస్) రావడమే దీనికి ప్రధాన కారణం. కంపెనీ తన 'వర్క్ ఫ్రమ్ ఆఫీస్' విధానాన్ని మరింత కఠినతరం చేస్తూ, ఉద్యోగుల ఆఫీస్ అటెండెన్స్ను నేరుగా వారి వేరియబుల్ పేతో ముడిపెట్టింది. నిబంధనల ప్రకారం పూర్తి వేరియబుల్ పే పొందాలంటే ఉద్యోగులు త్రైమాసికంలో కనీసం 85 శాతం హాజరు కలిగి ఉండాలి.
ఒకవేళ హాజరు 75 నుండి 85 శాతం మధ్య ఉంటే వారికి రావాల్సిన బోనస్లో 75 శాతం మాత్రమే ఇస్తారు. అదే హాజరు 60 నుండి 75 శాతం మధ్యకు పడిపోతే వారి వేరియబుల్ పేలో ఏకంగా సగానికి సగం (50 శాతం) భారీ కోత విధిస్తున్నారు. ఇక ఆఫీస్ హాజరు 60 శాతం కంటే తక్కువగా ఉన్న ఉద్యోగులకు ఈ త్రైమాసిక బోనస్ మొత్తానికే నిలిపివేస్తున్నారు. ఈ కొత్త నిబంధనల వల్ల చాలామంది ఉద్యోగుల ఏప్రిల్ జీతాలు భారీగా తగ్గిపోయాయి.

అయితే ఆఫీసు హాజరు నిబంధనలను పూర్తిగా పాటించినప్పటికీ తమకు తక్కువ వేరియబుల్ పే వచ్చిందని కొందరు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం వేరియబుల్ పే అనేది కేవలం అటెండెన్స్ పైన మాత్రమే కాకుండా, సదరు ఉద్యోగి పనిచేస్తున్న బిజినెస్ యూనిట్ లేదా ప్రాజెక్ట్ యొక్క మార్కెట్ పనితీరు, కంపెనీ లాభాల పైన కూడా ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయంగా ఐటీ క్లయింట్ల ఖర్చులు తగ్గడం, ప్రాజెక్టులు ఆలస్యం కావడం వంటి గ్లోబల్ పరిస్థితుల ప్రభావం కూడా ఉద్యోగుల బోనస్లపై పడింది. గడిచిన రెండేళ్లలో ఈ రకమైన వేరియబుల్ పే తగ్గింపుల వల్ల కొందరు సీనియర్ ఉద్యోగులు లక్షల రూపాయల్లో నష్టపోయామని పేర్కొంటున్నారు.
మరోవైపు టీసీఎస్ ఈ ఏడాది ఏప్రిల్ నుండి సగటున 5 శాతం వార్షిక వేతన పెంపును (Salary Hike) ప్రకటించినప్పటికీ, అప్రైజల్ లెటర్లు అందుకున్న తర్వాత ఉద్యోగులలో కొత్త గందరగోళం మొదలైంది. జీతం పెరిగినట్లు పేపర్పై కనిపిస్తున్నా, చేతికి వచ్చే నెలవారీ జీతం (Take-home salary) తగ్గిందని కొందరు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. కొందరికి నెలకు రూ. 3 వేల వరకు తగ్గగా, మరికొందరికి వార్షిక సీటీసీ (CTC) లో రూ. వేయి నుండి రూ. 10 వేల వరకు తక్కువగా చూపిస్తోంది.
భారతదేశ కొత్త లేబర్ కోడ్స్ (Labour Codes) నిబంధనలకు అనుగుణంగా కంపెనీ తన సీటీసీ స్ట్రక్చర్లో మార్పులు చేయడమే దీనికి ప్రధాన కారణం. ఈ మార్పులలో భాగంగా గ్రాట్యుటీ ప్రయోజనాలను అంతర్గతంగా కొనసాగిస్తూనే, ప్రదర్శించే సీటీసీ స్ట్రక్చర్ నుండి తొలగించారు. దీనివల్ల కాగితంపై సీటీసీ తక్కువగా కనిపిస్తోందని, భవిష్యత్తులో వేరే కంపెనీలకు మారేటప్పుడు శాలరీ నెగోషియేషన్స్లో ఇది తమను దెబ్బతీస్తుందని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
ఈ గందరగోళంపై టీసీఎస్ స్పందిస్తూ... కొత్త లేబర్ కోడ్స్ నిబంధనలకు అనుగుణంగా ఉండటానికి, ఉద్యోగులందరి శాలరీ స్ట్రక్చర్ను ఒకే తాటిపైకి తీసుకురావడానికి, పన్ను ఆదా సౌలభ్యాన్ని కల్పిస్తూనే టేక్-హోమ్ శాలరీని రక్షించడానికి ఈ మార్పులు చేసినట్లు స్పష్టం చేసింది. కంపెనీ ఎల్లప్పుడూ ఉద్యోగుల దీర్ఘకాలిక వృద్ధికి కట్టుబడి ఉంటుందని తెలిపింది. అయితే, ఈ అప్రైజల్స్ లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన (A+ రేటింగ్ ఉన్న) ఉద్యోగులకు 9 నుండి 13 శాతం వరకు, 'A' రేటింగ్ ఉన్నవారికి 5 నుండి 9 శాతం వరకు జీతాల పెంపు లభించగా, తక్కువ పర్ఫార్మెన్స్ బ్యాండ్లలో ఉన్నవారికి మాత్రం నామమాత్రపు పెంపు మాత్రమే దక్కింది.


Click it and Unblock the Notifications
