మీరు సాఫ్ట్వేర్ ఇంజనీరా? అయితే ఈ నిజాన్ని ఒప్పుకోవాల్సిందే.. టీసీఎస్ చైర్మన్ షాకింగ్ అప్డేట్!
భారతీయ ఐటీ రంగంలో గత కొన్ని దశాబ్దాలుగా ఒకే ట్రెండ్ నడుస్తోంది. కంపెనీలకు కొత్త ప్రాజెక్టులు రావడం, వేలాది మంది ఫ్రెషర్లను క్యాంపస్ సెలక్షన్స్ ద్వారా హైర్ చేసుకోవడం, ఆఫీసులను విస్తరించడం. కానీ, ఈ పాత మోడల్ మనం ఊహించిన దానికంటే చాలా వేగంగా మారిపోబోతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఎంట్రీతో భవిష్యత్తులో టెక్నాలజీ కంపెనీల నియామకాల శైలి పూర్తిగా మారిపోనుందని దేశంలోనే అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) స్పష్టం చేసింది.
ఇటీవల జరిగిన టీసీఎస్ 31వ వార్షిక సర్వసభ్య సమావేశంలో (AGM) కంపెనీ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో మనుషులు చేసే కొన్ని పనులను 'AI ఏజెంట్లు' భర్తీ చేస్తాయని, దీనివల్ల గతంలో లాగా ఐటీ కంపెనీలు భారీ సంఖ్యలో ఉద్యోగులను తీసుకునే రోజులు తగ్గిపోతాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది గ్లోబల్ టెక్ మార్కెట్లో లేఆఫ్స్ (layoffs) భయాలను మరింత పెంచింది.

సగం మంది మనుషులు.. సగం ఏఐ ఏజెంట్లు!
భవిష్యత్తులో కంపెనీల వర్క్ఫోర్స్ ఎలా ఉండబోతుందో చంద్రశేఖరన్ వివరిస్తూ.. "ఒక కంపెనీలో ఎంత మంది మానవ ఉద్యోగులు ఉంటారో, దాదాపు అంతే సంఖ్యలో ఏఐ వర్కర్లు కూడా ఉంటారు. మేము వారిని ఏఐ ఏజెంట్లు (AI Agents) అని పిలుస్తాము. కంపెనీలో 5 లక్షల మంది ఉద్యోగులు ఉంటే, రాబోయే రోజుల్లో 5 లక్షల మంది ఏఐ ఏజెంట్లు కూడా ఉండే కాలం ఎంతో దూరంలో లేదు" అని అన్నారు.
ఏ పనులు మనుషులు చేయాలి, ఏ పనులు ఏఐ ఏజెంట్లకు అప్పగించాలి అనే స్పష్టత త్వరలోనే వస్తుందని.. ఉద్యోగులు, ఏఐ ఏజెంట్లు ఇద్దరూ కలిసి పనిచేసే విధానమే ఐటీ పరిశ్రమ యొక్క భవిష్యత్తు కానుందని ఆయన పేర్కొన్నారు.
రిక్రూట్మెంట్లు తగ్గుతాయా?
ఖచ్చితంగా తగ్గుతాయని చంద్రశేఖరన్ ఓపెన్గా ఒప్పుకున్నారు. "ఇది నియామకాల తగ్గింపునకు దారితీస్తుందా? అంటే ఖచ్చితంగా అవుననే చెప్పాలి. గతంలో కంపెనీలు రికార్డు స్థాయిలో చేసిన నియామకాలు ఇకపై ఉండవు" అని ఆయన స్పష్టం చేశారు. అయితే ఇది కేవలం టీసీఎస్కు మాత్రమే పరిమితమైన సమస్య కాదని, ప్రపంచవ్యాప్తంగా మొత్తం టెక్నాలజీ రంగం ఎదుర్కోబోతున్న ఒక పెద్ద మార్పు అని ఆయన విశ్లేషించారు. ప్రస్తుత విధానంలో ఉన్న కొన్ని పనులు నేరుగా ఏఐ సిస్టమ్స్లోకి వెళ్లిపోవడమే దీనికి ప్రధాన కారణం.
దీనివల్ల ముఖ్యంగా ఎంట్రీ లెవెల్ (ఫ్రెషర్స్) ఉద్యోగాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఐటీ రంగంలో లేఆఫ్స్ (layoffs) , జాబ్స్ కొరతపై ఆందోళన చెందుతున్న యువతకు ఇది మరింత సవాల్తో కూడుకున్న విషయమే.
ఏఐ అనేది ఒక అద్భుతమైన అవకాశం!
నియామకాలు తగ్గినప్పటికీ, ఏఐ టెక్నాలజీ వల్ల కొత్త అవకాశాలు కూడా వస్తాయని చంద్రశేఖరన్ ఆశాభావం వ్యక్తం చేశారు. "ప్రతి కొత్త టెక్నాలజీ విప్లవం వచ్చినప్పుడు టెక్నాలజీపై పెట్టే పెట్టుబడులు (Tech Spending) పెరుగుతాయని నేను బలంగా నమ్ముతాను" అని అన్నారు. టీసీఎస్ చరిత్రలోనే ఏఐ అనేది అతిపెద్ద అవకాశమని ఆయన అభివర్ణించారు.
గతంలో కంప్యూటర్లు లేదా క్లౌడ్ టెక్నాలజీ వచ్చినప్పుడు కూడా పాత ఉద్యోగాలు పోయినా, వాటి స్థానంలో అంతకంటే మెరుగైన కొత్త ఉద్యోగాలు, వ్యాపారాలు పుట్టుకొచ్చాయని గుర్తు చేశారు. అదేవిధంగా ఏఐ యుగంలో కూడా కొత్త రకమైన టాలెంట్ అవసరమవుతుందని ఆయన చెప్పారు.
ఈ మారుతున్న కాలంలో ఉద్యోగాలు కోల్పోకుండా ఉండాలంటే ఉద్యోగులు, కంపెనీలు, , ప్రభుత్వాలు కూడా ఏఐ స్కిల్స్ (AI Skills) నేర్చుకోవడంపై దృష్టి పెట్టాలని టీసీఎస్ చైర్మన్ సూచించారు. రీ-స్కిల్లింగ్ (మళ్లీ కొత్త విద్యను నేర్చుకోవడం) ద్వారానే ఉద్యోగులు మార్కెట్లో నిలబడగలరు. మొత్తానికి, ప్రతి ఏటా పదుల వేల మందిని ఒకేసారి చేర్చుకునే ఐటీ గోల్డెన్ డేస్ ముగిసి.. మనుషులు, రోబోలు కలిసి పనిచేసే సరికొత్త అధ్యాయం మొదలుకాబోతోంది.


Click it and Unblock the Notifications