గతంలో లాగా కొత్త నియామకాలు ఇకపై ఉండకపోవచ్చు.. TCS ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ సంచలన వ్యాఖ్యలు..
సాంకేతిక రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులు ఐటీ పరిశ్రమ భవిష్యత్తును పూర్తిగా మార్చేయబోతున్నాయి. రాబోయే మూడేళ్ల కాలంలో కంపెనీలో పనిచేసే ఉద్యోగుల సంఖ్యకు సమానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఏజెంట్లు ఉంటాయని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ సంచలన అంచనా వేశారు.
కంపెనీ 31వ వార్షిక సర్వసభ్య సమావేశంలో (AGM) వాటాదారులను ఉద్దేశించి మాట్లాడిన ఆయన.. ఏఐ ఏజెంట్ల రాకతో గత కొన్నేళ్లుగా జరిగినంత భారీ స్థాయిలో ఇకపై కొత్త నియామకాలు ఉండకపోవచ్చని స్పష్టం చేశారు. ఐటీ పరిశ్రమలో ఏఐ ఆధారిత ఆటోమేషన్ కారణంగా ఉద్యోగాల వృద్ధి మందగిస్తుందని బహిరంగంగా అంగీకరించిన మొదటి అగ్రశ్రేణి ఐటీ అధిపతి ఆయనే కావడం గమనార్హం.

ఈ పరిణామాలపై చంద్రశేఖరన్ విశ్లేషిస్తూ.. భవిష్యత్తులో ఒక కంపెనీలో 5 లక్షల మంది మానవ ఉద్యోగులు ఉంటే, అంతే సంఖ్యలో అంటే 5 లక్షల ఏఐ ఏజెంట్లు కూడా అందులో భాగమవుతాయని చెప్పారు. ఇప్పటివరకు మానవులు చేసిన పనులలోని కొన్ని భాగాలను ఇకపై ఏఐ ఏజెంట్లు అత్యంత సమర్థవంతంగా పూర్తి చేయగలవని, దీనివల్ల కంపెనీలు, పరిశ్రమలు గతంలో లాగా పెద్ద సంఖ్యలో సిబ్బందిని నియమించుకోవాల్సిన అవసరం రాకపోవచ్చని పేర్కొన్నారు. అయితే దీని అర్థం మానవ ఉద్యోగాలు పూర్తిగా పోతాయని కాదని, భవిష్యత్తులో కంపెనీ ఉద్యోగులు, ఏఐ ఏజెంట్లు ఇద్దరూ కలిసికట్టుగా పనులను పంచుకుంటూ ముందుకు సాగడమే అసలైన సాంకేతిక భవిష్యత్తు అవుతుందని ఆయన వివరించారు.
ప్రస్తుత ఐటీ పరిశ్రమ యొక్క నియామక సరళిని పరిశీలిస్తే చంద్రశేఖరన్ అన్న మాటలు అక్షరాలా నిజమనిపిస్తోంది. ఐటీ కంపెనీలలో నియామకాలు జరుగుతున్నప్పటికీ, ఉద్యోగుల సంఖ్య పెరిగే వేగం గణనీయంగా మందగించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఐటీ రంగం మొత్తం కలిపి సుమారు 1,35,000 కొత్త నియామకాలను మాత్రమే చేపట్టనుంది, ఇది మునుపటి ఆర్థిక సంవత్సరం (FY2026) తో పోలిస్తే కేవలం 2.3 శాతం స్వల్ప పెరుగుదల మాత్రమే.
దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ సైతం 2027 ఆర్థిక సంవత్సరానికి గాను 25,000 మంది ఫ్రెషర్లను (Freshers) మాత్రమే క్యాంపస్ ప్లేస్మెంట్ల ద్వారా నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. రాబోయే త్రైమాసికాల్లో కంపెనీ ఈ సంఖ్యను కొంతవరకు పెంచే అవకాశం ఉన్నప్పటికీ, 2020 ఆర్థిక సంవత్సరం తర్వాత ఫ్రెషర్ల నియామకాల కోసం టీసీఎస్ ప్రకటించిన అత్యల్ప సంఖ్యలలో ఇది ఒకటి కావడం పరిశ్రమలో నెలకొన్న అనిశ్చితిని సూచిస్తోంది. అయితే, నియామకాలపై చూపే ఈ ప్రతికూల ప్రభావం కేవలం సాంకేతిక పరివర్తన (ట్రాన్సిషన్ పీరియడ్) జరిగేంత వరకే ఉంటుందని ఆయన కస్టమర్లకు, అభ్యర్థులకు ధీమా ఇచ్చారు.
క్లుప్తంగా చెప్పాలంటే ఐఆర్టీ రంగానికి, టీసీఎస్ చరిత్రకు ఏఐ అనేది ఒక సవాలు మాత్రమే కాదు, అంతకుమించి అపారమైన అతిపెద్ద వృద్ధి అవకాశమని చంద్రశేఖరన్ నొక్కిచెప్పారు. సాంకేతికత మారుతున్న తరుణంలో కొత్తగా పుట్టుకొస్తున్న ఏఐ ఆర్థిక వ్యవస్థలో సరికొత్త ఉద్యోగ మార్గాలు కూడా సృష్టించబడుతున్నాయని ఆయన గుర్తుచేశారు. ఈ విప్లవాత్మక ఏఐ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడానికి టీసీఎస్ అప్రమత్తమైందని, ఇందులో భాగంగానే ఏఐ ప్రతిభను పెంచడం (టాలెంట్ పూల్), సొంత డిజిటల్ ఆస్తుల సృష్టి, అత్యాధునిక ఏఐ ఆపరేటింగ్ సిస్టమ్లు మరియు మౌలిక సదుపాయాల (Infrastructure) బలోపేతం కోసం కంపెనీ భారీగా పెట్టుబడులు పెడుతోందని వాటాదారులకు వివరించారు.


Click it and Unblock the Notifications
