TCS: గుడ్ న్యూస్ చెప్పిన టీసీఎస్.. ఫుల్ పేమెంట్ ఇస్తానంటూ ప్రకటన.. ఉద్యోగుల పండగ..
Variable Pay: ఐటీ కంపెనీల్లో ఉద్యోగులకు వేరియబుల్ పే విధానాన్ని అమలు చేస్తారని మనందరికీ తెలిసిందే. అయితే కంపెనీ పనితీరును బట్టి వాటి చెల్లింపులు ఆధారపడి ఉంటాయి. ఈ సమయంలో ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ తన ఉద్యోగులకు తీపి వార్త వెల్లడించింది. తాను 100 శాతం వేరియబుల్ పే చెల్లించటానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటన చేసింది.
క్యూ3 ఫలితాలు..
టీసీఎస్ ఇటీవల విడుదల చేసిన మూడో త్రైమాసిక ఫలితాలు ఇన్వెస్టర్లను నిరాశ పరిచాయి. దీంతో కంపెనీ షేర్లు సైతం స్టాక్ మార్కెట్లో నష్టాలను చవిచూశాయి. కానీ కంపెనీ తన ఉద్యోగులకు మాత్రం గుడ్ న్యూస్ వెల్లడించింది. అర్హలైన ఉద్యోగులందరికీ 100 శాతం వేరియబుల్ పే చెల్లింపులు చేస్తామని తెలిపింది. కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ నిర్ణయం వల్ల దాదాపుగా 70 శాతం మంది ఉద్యోగులు లాభపడనున్నాట్లు సమాచారం. మరి మిగతా ఉద్యోగుల సంగతేంటి..? అనేది వేచి చూడాల్సిందే.
నెంబర్-1 కంపెనీ..
ఐటీ రంగంలో అత్యుత్తమ కంపెనీగా కొనసాగుతున్న టీసీఎస్.. మిగిలిన 30 శాతం మంది ఉన్నతాధికారుల పనితీరు ఆధారంగా వేరియబుల్ వేతనాన్ని ప్రకటించింది. ఉన్నతాధికారుల పనితీరు అద్భుతంగా ఉంటే 100 శాతానికిపైగా చెల్లింపు చేయాలని కంపెనీ నిర్ణయించినట్లు సమాచారం. ఆపరేటింగ్ మార్జిన్ సమస్య ఉన్నప్పటికీ.. రెండవ త్రైమాసికంలోనూ TCS తన ఉద్యోగులకు 100 శాతం వేరియబుల్ పే చెల్లించింది.
ఇన్ఫోసిస్..
టీసీఎస్ కంపెనీ ఆటుపోట్లు ఉన్నప్పటికీ తన ఉద్యోగులకు రెండు త్రైమాసికాల్లోనూ 100 శాతం వేరియబుల్ పే చెల్లించాలని నిర్ణయించింది. అయితే అదే సమయంలో.. ఇన్ఫోసిస్ తన ఉద్యోగులకు 65 శాతం వేరియబుల్ పే మాత్రమే చెల్లించింది. C2 కేటగిరీ వరకు ఉన్న ఉద్యోగులందరికీ 100 శాతం వేరియబుల్ పే మొత్తం లభిస్తుందని, C3A కేటగిరీ.. అంతకంటే ఎక్కువ ఉన్న ఉద్యోగులకు వారి పనితీరు ఆధారంగా బోనస్ ఇవ్వబడుతుందని కంపెనీ మానవ వనరుల డిపార్ట్ మెంట్ పంపిన అంతర్గత మెయిల్ లో వెల్లడించింది.
ఉద్యోగుల సంఖ్య..
డిసెంబర్ 31 చివరి నాటికి కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 6,16,171 నుంచి 6,13,974కి తగ్గింది. అంటే డిసెంబర్ త్రైమాసికంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ హెడ్కౌంట్ గత త్రైమాసికంతో పోలిస్తే 2,197 తక్కువగా ఉంది.