40 ఏళ్ల కనిష్టానికి పీఎఫ్ వడ్డీ రేటు, ఐనా ఇదే ఆకర్షణీయం, ఎందుకంటే
ఈపీఎఫ్ వడ్డీ రేటు నలభై ఏళ్ల కనిష్టానికి చేరుకుంది. ఉద్యోగుల భవిష్య నిధి వడ్డీ రేటును మరోసారి తగ్గించారు. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ వడ్డీ రేటును 8.1 శాతానికి తగ్గిస్తూ ప్రావిడెంట్ ఫండ్ ట్రస్టీలు పంపించిన ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదం తెలిపింది. కేంద్రం ఆమోదం నేపథ్యంలో ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై ఉన్న వడ్డీరేటు తగ్గింది. 1977-78 ఆర్థిక సంవత్సరంలో ఉన్న ఈపీఎఫ్ వడ్డీ రేటు 8 శాతం. ఆ తర్వాత ఈ నలభై ఏళ్లలో ఇదే కనిష్టం. 8.50 శాతంగా ఉన్న వడ్డీ రేటును 40 బేసిస్ పాయింట్లకు తగ్గించడంతో 8.1 శాతానికి చేరుకుంది.
ఈ ప్రభావం 6 కోట్ల మంది ఉద్యోగులపై ఉంటుంది. 2020 మార్చిలో చివరిసారిగా ఈపీఎఫ్ డిపాజిట్లపై వడ్డీరేటును 8.4గా నిర్ధారించింది కేంద్రం. రెండేళ్ల తర్వాత ఇప్పుడు దీనిని 8.1కి మరింత తగ్గించింది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో పీఎఫ్ వడ్డీ రేటు 8.8 శాతం కాగా, 2016-17లో అమలులో ఉన్న వడ్డీ రేటు 8.65 శాతం. మరుసటి ఆర్థిక సంవత్సరం (2017-18) 8.55 శాతానికి తగ్గించగా, 2019-20లో 8.5గా నిర్ధారించింది. తాజాగా 8.1 శాతానికి కుదించింది.
ఈపీఎఫ్ వార్షిక వడ్డీరేటు 8.1 శాతానికి తగ్గినప్పటికీ, పన్ను ఆదా అయ్యే పొదుపు మార్గాల్లో ఇదే అన్నింటికంటే ఆకర్షణీయమైనది. వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ (VPF)కు కూడా ఇదే వడ్డీరేటు ఉంది. దీంతో పీపీఎఫ్, ఎన్ఎస్సీ, ఆర్బీఐ సేవింగ్స్ బాండ్స్ వంటి వాటిలో ఎక్కువ వడ్డీరేటు వస్తున్నవి ఇప్పుడు ఇవే. ఇక వివిధ బ్యాంకుల్లో FDలపై 6 శాతం కంటే తక్కువ వడ్డీరేటు ఉంది. సీనియర్ సిటిజన్స్కు 6.5 శాతం, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) వడ్డీరేటు 7.1 శాతంగా ఉంది.