Tata Steel: ఇన్వెస్టర్లను నిరాశపరిచిన టాటా స్టీల్.. క్యూ2లో వేలకోట్లు నష్టాలు..!!
Tata Steel: ప్రఖ్యాత దేశీయ స్టీల్ వ్యాపార దిగ్గజం టాటా స్టీల్ స్టేక్ హోల్డర్లను భారీ నిరాశకు గురిచేసింది. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో వేల కోట్ల నష్టాలను కంపెనీ నమోదు చేసింది.
తాజాగా టాటా స్టీల్ తన కన్సాలిడేటెడ్ క్యూ2 ఫలితాలను విడుదల చేసింది. దీని ప్రకారం సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ రూ.6,511 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఇదే సమయంలో కంపెనీ రూ.1,297 కోట్ల లాభాన్ని చూసింది. యూరోప్లో బలహీనత ఛార్జీలు, కుంచించుకుపోతున్న మార్జిన్లు దీనికి ప్రధాన కారణాలుగా ఉన్నాయి.

ఫలితాలు వెలువడటానికి ముందరే మార్కెట్ వర్గాలు నష్టాలను అంచనా వేశాయి. అయితే వారు రూ.700 వరకు నష్టం రావొచ్చని ఊహించినప్పటికీ పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. ఇదే క్రమంలో టాటా గ్రూప్ స్టీల్మేకర్ కార్యకలాపాల ద్వారా రూ.55,681 కోట్ల ఏకీకృత మొత్తం రాబడిని నివేదించింది. ఇది గత ఏడాది కాలంలో రూ.59,877 కోట్లుగా ఉంది. దేశీయంగా వ్యాపారం దాదాపు 20% అధిక మార్జిన్ను ఉత్పత్తి చేసింది. దీంతో EBITDA రూ.6,841 కోట్లుగా ఉంది.
రెండు భౌగోళిక ప్రాంతాలలో ప్రతి టన్ను ఆదాయం తక్కువగా ఉన్నట్లు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ & చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కౌశిక్ ఛటర్జీ వెల్లడించారు. టాటా స్టీల్ యూరోప్ గత త్రైమాసికంలో రూ.21,558.8 కోట్ల నుంచి రూ.18,846.7 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. అలాగే తక్కువ షిప్మెంట్లు, రియలైజేషన్లు తగ్గిన కారణంగా ఐరోపాలో కంపెనీ బలహీనమైన పనితీరును కనబరిచినట్లు విశ్లేషకులు ఫలితాలకు ముందే వెల్లడించారు. ఈ ఫలితాలతో నేడు స్టాక్ భారీగా నష్టాలను నమోదు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications