Tata Steel: స్టీల్ ఉత్పత్తి రంగంలో టాటా గ్రూప్ చాలా అనుభవాన్ని కలిగి ఉన్న సంగతి తెలిసిందే. ఈ సంస్థ కేవలం మనదేశంలో మాత్రమే కాక బయట సైతం ఉక్కు ఉత్పత్తి రంగంలో తన పెట్టుబడులను కలిగి ఉన్న సంగతి తెలిసిందే.
తాజాగా సౌత్ వేల్స్లోని పోర్ట్ టాల్బోట్ సైట్లో అత్యాధునిక ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేస్ స్టీల్మేకింగ్లో పెట్టుబడి పెట్టే ప్రతిపాదనపై టాటా స్టీల్కు యూకే ప్రభుత్వం మద్ధతుగా నిలుస్తోంది. ఇందుకోసం 621 మిలియన్ డాలర్ల సపోర్ట్ ఫండింగ్ ప్యాకేజీని ప్రకటించింది. పోర్ట్ టాల్బోట్ లోని రెండు బొగ్గుతో నడిచే బ్లాస్ట్ ఫర్నేస్లను జీరో-కార్బన్ విద్యుత్తో పనిచేసే గ్రీన్ ఎలక్ట్రిక్ ఆర్క్ వెర్షన్లకు మార్చడంలో సహాయపడటానికి గ్రాంట్తో సహా £1.25 బిలియన్ల మూలధన వ్యయం దీనికి ఖర్చవుతోంది.

టాటా స్టీల్ తన ప్రాజెక్టు ద్వారా బ్రిటన్ ఉక్కు భద్రతను పెంపొందిస్తుందని, ఉక్కు పరిశ్రమ డీకార్బనైజేషన్ వైపు మెుదటి అడుగులు వేస్తోందని రెగ్యులేటరీ ఫైలింగ్స్లో వెల్లడించింది. ఇది ఒక దశాబ్ద కాలంలో దాదాపు 50 మిలియన్ టన్నుల ప్రత్యక్ష ఉద్గారాలను తగ్గించటంలో తోడ్పడనుంది. దీనికి ముందు గత సంవత్సరం టాటా స్టీల్ తన యూకే కార్యకలాపాలకు ముప్పు ఉందని తెలిపింది. తక్కువ కార్బన్-ఇంటెన్సివ్ ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేస్లకు తరలించడంలో సహాయపడటానికి అక్కడి ప్రభుత్వ నిధులను పొందకపోతే ఇబ్బందులు తప్పవని హెచ్చరించింది.
టాటా స్టీల్ UKలోని ఉత్పత్తి సౌకర్యాలు జీవిత కాల ముగింపుకు చేరువలో ఉన్నందున గణనీయమైన సవాళ్లను ఎదుర్కొంటోందని టాటా స్టీల్ సీఈవో, MD టీవీ నరేంద్రన్ వ్యాఖ్యానించారు. అందుకే భవిష్యత్తు అవసరాల రీత్యా పర్యావరణ హితమైన, ఆధునిక భవిష్యత్తు-సిద్ధమైన వ్యాపారంగా మార్చడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. అయితే తాజా ఒప్పందం వల్ల 3,000 మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని రాయిటర్స్ నివేదించింది.


Click it and Unblock the Notifications