నెల్లూరులో టాటా పవర్ ప్లాంట్.. 200 ఎకరాల భూమిని కేటాయించిన ఏపీ ప్రభుత్వం..
టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ (TPREL) భారతదేశ సౌర తయారీ రంగంలో కీలక మైలురాయిగా నిలిచే ఒక భారీ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించనుంది. దేశంలోనే అతిపెద్దదైన 10 గిగావాట్ల సామర్థ్యం గల ఇంగాట్, వేఫర్ తయారీ ప్లాంట్ను నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేయాలని సంస్థ నిర్ణయించింది. ఈ ప్రాజెక్టుకు మొత్తం పెట్టుబడి విలువ సుమారు రూ. 6,675 కోట్లుగా ఉంటుందని ది ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. సెమీకండక్టర్ చిప్స్, సౌర సెల్స్ , సౌర మాడ్యూల్స్ తయారీలో ఇంగాట్లు, వేఫర్లు అత్యంత కీలకమైన ముడి పదార్థాలుగా ఉపయోగపడతాయి.
ఈ మెగా ప్రాజెక్టు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెల్లూరులోని ఇఫ్కో కిసాన్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (SEZ) వద్ద మొత్తం 200 ఎకరాల భూమిని కేటాయించింది. ఇందులో 120 ఎకరాలు నేరుగా ప్లాంట్ నిర్మాణానికి వినియోగించనుండగా.. మిగిలిన 80 ఎకరాలను భవిష్యత్ విస్తరణ అవసరాల కోసం ఉంచారు. దేశీయ సౌర పరికరాల తయారీ సామర్థ్యాన్ని పెంచడం, ముఖ్యంగా చైనా వంటి దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించడం కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఈ ప్రాజెక్టు ప్రతిపాదనకు ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర పెట్టుబడి ప్రమోషన్ బోర్డు సమావేశంలో ఆమోదం లభించింది. అంతకు ముందు రాష్ట్ర పెట్టుబడి ప్రమోషన్ కమిటీ కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ వారం చివర్లో రాష్ట్ర కేబినెట్ నుంచి తుది ఆమోదం లభించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన వివరమైన ప్రాజెక్టు నివేదిక (DPR) ప్రకారం.. ఈ తయారీ యూనిట్ ద్వారా దాదాపు వెయ్యి మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. అంతేకాదు, ఈ ప్లాంట్కు అవసరమైన విద్యుత్ను పూర్తిగా పునరుత్పాదక వనరుల నుంచే సరఫరా చేయాలన్న లక్ష్యంతో, ఆంధ్రప్రదేశ్లోనే 200 మెగావాట్ల గ్రీన్ పవర్ ప్లాంట్ను అభివృద్ధి చేయడానికి కూడా TPREL భూమిని కేటాయించనుంది. గ్రీన్ పవర్ అందుబాటులో ఉండటం ఈ ప్రాజెక్టు నెల్లూరులో ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణమని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
ఈ పెట్టుబడిపై రాష్ట్ర ఐటీ, ఉపాధి కల్పనపై క్యాబినెట్ కమిటీకి నాయకత్వం వహిస్తున్న మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. టాటా గ్రూప్ నుంచి మరో మైలురాయి పెట్టుబడిని ఆంధ్రప్రదేశ్కు తీసుకురావడం గర్వకారణం. ఇది రాష్ట్ర విధానాలపై, మౌలిక సదుపాయాల సిద్ధతపై మరియు స్వచ్ఛమైన ఇంధన తయారీపై మా నిబద్ధతకు లభించిన విశ్వాస ఓటు అని అన్నారు.
గతంలో TPREL ఒడిశాలోని గోపాల్పూర్, కటక్ ప్రాంతాలను ఈ ప్రాజెక్టు కోసం పరిశీలించింది. అయితే కృష్ణపట్నం పోర్టుకు సమీపం, మెరుగైన లాజిస్టిక్స్ సదుపాయాలు మరియు విస్తృత భూమి లభ్యత కారణంగా చివరకు నెల్లూరును ఎంపిక చేసింది. ఇప్పటికే ప్రీమియర్ ఎనర్జీస్, వెబ్సోల్, వోల్ట్సన్ వంటి కంపెనీలు ఈ ప్రాంతంలో సౌర తయారీ ప్రాజెక్టులను ప్రారంభించడంతో నెల్లూరు వేగంగా సౌర ఉత్పాదక కేంద్రంగా మారుతోంది.
గత ఏడాది మార్చి 7న టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కింద రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన రంగంలో రూ. 49,000 కోట్ల వరకు పెట్టుబడి పెట్టేందుకు టాటా గ్రూప్ అంగీకరించింది. ఆ ఒప్పందంలో భాగంగా నెల్లూరు ఇంగాట్-వేఫర్ ప్లాంట్ను తొలి తయారీ ప్రాజెక్టుగా గుర్తించారు.
ప్రస్తుతం TPREL దేశవ్యాప్తంగా అనేక భారీ సౌర ప్రాజెక్టులను నిర్వహిస్తోంది. గుజరాత్లోని ధోలేరాలో 300 మెగావాట్ల ప్లాంట్, కర్ణాటకలోని పావగడలో 400 మెగావాట్ల యూనిట్, రాజస్థాన్లోని బికనీర్లో 450 మెగావాట్ల సౌకర్యం, మధ్యప్రదేశ్లోని నీముచ్లో 431 మెగావాట్ల యుటిలిటీ-స్కేల్ ప్రాజెక్ట్ ఇందులో ఉన్నాయి. నెల్లూరు ప్రాజెక్టుతో టాటా పవర్ భారతదేశ సౌర తయారీ రంగంలో తన స్థానాన్ని మరింత బలపరచనుంది.


Click it and Unblock the Notifications