Tata Motors: లాభాల ప్రభంజనం సృష్టించిన టాటా మోటార్స్.. డివిడెండ్ ఎంతంటే..
Tata Motors: దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ తన మార్చి త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. ఈ క్రమంలో వరుసగా రెండవ త్రైమాసికంలో మంచి లాభాలను నమోదు చేసింది.
మార్చి త్రైమాసికంలో కంపెనీ కార్ల ధరలను పెంచటం, అలాగే లగ్జరీ జాఖ్వార్ ల్యాండ్ రోవర్ అమ్మకాలు స్థిరంగా కొనసాగటం కంపెనీకి కలిసొచ్చింది. జనవరి-మార్చి కాలానికి కార్ మేకర్ నికర లాభం రూ.5,408 కోట్లుగా నమోదైంది. గత సంవత్సరం ఇదే సమయంలో కంపెనీ రూ.1,033 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది.
సూపర్ లాభాలను నమోదు చేసిన టాటా మోటార్స్ దాదాపు ఏడేళ్ల తర్వాత తన ఇన్వెస్టర్లకు డివిడెండ్ చెల్లిస్తోంది. ఒక్కో షేరుపై రూ.2 చొప్పున డివిడెండ్ ఇవ్వనున్నట్లు కంపెనీ ప్రకటించింది. దీంతో ఇన్వెస్టర్లు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో కంపెనీ వ్యాపార ఆదాయం 35 శాతం పెరిగి రూ.1.06 లక్షల కోట్లుగా నమోదైంది.
సమీప కాలంలో అనిశ్చితులు, ద్రవ్యోల్బణ వాతావరణం ఉన్నప్పటికీ డిమాండ్ పరిస్థితిపై ఆశాజనకంగా ఉన్నట్లు ఆటోమేకర్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో తెలిపింది. FY24లో మరింత మెరుగుపరచడం, బలమైన పనితీరును అందించాలని లక్ష్యంగా కంపెనీ పెట్టుకుంది. జాగ్వార్ ల్యాండ్ రోవర్(JLR) మార్చి 31,2023తో ముగిసిన నాల్గవ త్రైమాసికంలో సంవత్సరానికి 49% వృద్ధితో 7.1 బిలియన్ పౌండ్ల ఆదాయాన్ని నమోదు చేసింది. పూర్తి సంవత్సర ఆదాయం 22.8 బిలియన్ పౌండ్లుగా ఉంది.
చిప్ సరఫరాలో క్రమంగా మెరుగుదలలు ఆర్థిక సంవత్సరంలో కొనసాగుతాయని బ్రాండ్ ఆశిస్తోంది. టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ మేనేజింగ్ డైరెక్టర్ శైలేష్ చంద్ర మాట్లాడుతూ కంపెనీ తన అత్యధిక వార్షిక దేశీయ అమ్మకాలను నమోదు చేయడానికి, FY22 కంటే బలమైన 46% అమ్మకపు వృద్ధిని సాధించడానికి పరిశ్రమ-బీటింగ్ వృద్ధిని వరుసగా మూడవ సంవత్సరం నమోదు చేసింది. కంపెనీ ప్రధానంగా ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి సారించటం ఆదాయాల వృద్ధికి సహాయం చేస్తోందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.