TATA iphone: ముగింపు దశకు టాటా ఐఫోన్ డీల్... మేడిన్ ఇండియా ఐఫోన్కు మార్గం సుగమం
TATA iphone: దేశీయంగా తయారైన ఐఫోన్ను భారతీయులు వినియోగించే సమయం మరెంతో దూరంలో లేదు. మార్చి చివరి నాటికి ఐఫోన్ తయారుచేసేందుకు టాటా గ్రూపు వడివడిగా అడుగులు వేస్తోంది. తైవాన్కు చెందిన విస్ట్రన్ కంపెనీతో గత కొంత కాలంగా టాటా గ్రూపు చర్చలు జరుపుతోంది. బెంగుళూరు దగ్గర్లోని ఆ సంస్థకు చెందిన ప్లాంట్లో మెజారిటీ వాటాను టేక్ ఓవర్ చేయనుంది. ఈ డీల్ పూర్తికాగానే విస్ట్రన్ సహాయంతో సొంతగా ఐఫోన్ను తయారు చేసి విడుదల చేయనుంది.
భారత్లో ఆపిల్ ఉత్పత్తులను తైవాన్కి చెందిన ఫాక్స్కాన్, విస్ట్రోన్, పెగాట్రాన్లు నిర్వహిస్తున్నాయి. డ్రాగన్ కంట్రీకి దీటుగా ఎదగాలన్న భారత్ ఆశయాలను ఈ డీల్ ముందుకు తీసుకువెళ్లనున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. పలు రాజకీయ ఇబ్బందులు, అమెరికాతో విభేదాలు, కొవిడ్ విజృంభణ వల్ల చైనా సతమతం అవుతుండగా.. భారత్ ఎదుగుదలకు ఇది అనువైన సమయంగా భావిస్తున్నారు. పలు దిగ్గజ సంస్థలు సైతం బీజింగ్ను వదిలి భారత్ వైపు వస్తుండటంతో ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని మోదీ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది.
మార్చి చివరి నాటికి ఈ డీల్ పూర్తి చేసుకుని తదనంతర ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ప్రోత్సాహకాలను సైతు అందుకోవాలని టాటా గ్రూప్ భావిస్తోంది. చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి ఆపిల్ సంస్థ ప్రయత్నిస్తోంది. ఈ తరుణంలో ఆపిల్తో వ్యాపార భాగస్వామ్యాన్ని విస్తరించే దిశగా టాటా గ్రూపు సైతం పావులు కదుపుతోంది. హోసూర్లోని తన ఫ్యాక్టరీలో ఇప్పటికే నియామకాలను పెంచింది. భవిష్యత్తులో ఇక్కడ సైతం ఐఫోన్ తయారీని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ముంబైతో మొదలుపెట్టి దేశవ్యాప్తంగా 100 ఆపిల్ స్టోర్లను లాంచ్ చేయనున్నట్లు సంస్థ ఇప్పటికే ప్రకటించింది.