Krishna Kumar: కన్నుమూసిన టాటా సన్స్ మాజీ డైరెక్టర్.. పూర్తి వివరాలు..
Krishna Kumar: టాటా గ్రూప్ కు చెందిన ప్రముఖుడు ఆర్కె కృష్ణ కుమార్ గుండెపోటుతో ఆదివారం సాయంత్రం మరణించారు. 84 ఏళ్ల వయస్సులో ఆయన ముంబైలో తుదిశ్వాస విడిచారు.
|
ఎవరీ కృష్ణ కుమార్..
మనలో చాలా మందికి అసలు ఈ కృష్ణ కుమార్ ఎవరు అనే అనుమానం కలుగవచ్చు. ఆయన టాటా సన్స్ మాజీ డైరెక్టర్, టాటా సన్స్లో ముఖ్యంగా టాటా టీ (ఇప్పుడు టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్)లో అనేక కీలక పదవుల్లో కంపెనీని విజయవంతంగా నడిపారు. ఆయన తొలుత 1963లో టాటా అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో చేరారు. టాటా గ్లోబల్ బెవరేజెస్లో అంచెలంచెలుగా ఎదిగిన ఆయన కంపెనీ టాటా టీగా రూపాంతరం చెందడంలో కీలక పాత్ర పోషించారు.
టెట్లీ కొనుగోలు..
కృష్ణ కుమార్ 1997లో తాజ్ గ్రూప్ ఆఫ్ హోటళ్లను నిర్వహిస్తున్న ఇండియన్ హోటల్స్ కంపెనీకి అధిపతిగా నియమితులయ్యారు. 2013లో పదవీ విరమణ చేసే వరకు హోటల్ వ్యాపారానికి వైస్ ఛైర్మన్గా కొనసాగారు. భారత వాణిజ్యం, వ్యాపారానికి చేసిన కృషికి ఆయన 2009లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. దీనికి తోడు 2002 సంవత్సరంలో బ్రిటన్ కు చెందిన ప్రఖ్యాత టీ బ్రాండ్ టెట్లీని 271 మిలియన్ పౌండ్లకు కొనుగోలు చేసి అతిపెద్ద అంతర్జాతీయ రికార్డు డీల్ ను పూర్తి చేశారు.
తాజ్ హోటల్ పై దాడి..
26/11 దాడుల సమయంలో ముంబైలోని హోటల్ తాజ్ మహల్ ప్యాలెస్ నుంచి అతిథులను రక్షించే ప్రయత్నాలను పర్యవేక్షించారు. దీనికి తోడు ఆ తర్వాత జరిగిన తక్షణ పరిణామాల్లో ఆయన కీలక పాత్ర పోషించాడు.
పుట్టింది పెరిగింది..
కృష్ణకుమార్ 1938లో కేరళలోని తలస్సేరిలో జన్మించారు. కృష్ణకుమార్ తండ్రి పోలీసు కమిషనర్ కావటంతో.. ఆయన చెన్నైలోని పాఠశాలలో చదువుకున్నారు. ఆ తర్వాత అక్కడే లయోలా కళాశాల నుంచి పట్టభద్రుడయ్యాడు. ఆ తర్వాత ప్రెసిడెన్సీ కళాశాల నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని పొందాడు.