tata: దేశంలో టాటా గ్రూపునకు ఉన్న మంచి పేరు తెలియనిది కాదు. ప్యాసింజర్, కమర్షియల్ వాహనాల తయారీలో టాటా మోటార్స్ ది అందె వేసిన చెయ్యి. అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నత స్థానానికి చేరింది. తాజాగా సంస్థ అందుకున్న ఓ మైలు రాయితో.. ఉద్యోగులు, స్టాక్ హోల్డర్లు, సరఫరాదారులు అందరూ మంచి ఉత్సాహంగా ఉన్నారు. గత 25 ఏళ్లలో కంపెనీ సాధించిన విజయంగా దీన్ని కీర్తిస్తున్నారు.

50 లక్షల మైలురాయి:
ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారుగా పేరున్న టాటా మోటార్స్.. 50 లక్షల ప్యాసింజర్ వాహనాల ఉత్పత్తి మార్కును సాధించినట్లు నిన్న ప్రకటించింది. ఈ ఫీట్ ను చేరుకోవడానికి 25 ఏళ్లు పట్టింది. 1998 నుంచి మార్కెట్లో వివిధ రకాల ఐకానిక్ బ్రాండ్లను ప్రవేశపెట్టిన ఘనత ఈ కంపెనీది కావడం విశేషం. సంస్థ ఉద్యోగులు ఈ మైలురాయిని సంబరంగా జరుపుకున్నారు. టాటా మోటార్స్ కార్లు, SUVలను వినియోగించి '50 LAKH' అని కనిపించేలా ఓ ఫార్మేషన్ ఏర్పాటు చేశారు.

కేవలం మూడేళ్లలోనే:
గత చరిత్ర చూస్తే.. 2004లో 10 లక్షలు, 2010 నాటికి 20, 2015లో 30, 2020 నాటికి 40 లక్షల కార్లను టాటా గ్రూపు ఉత్పత్తి చేసింది. ఈ గణాంకాలను చూస్తే 10 లక్షల కార్ల తయారీ కోసం దాదాపు 5 ఏళ్లు పట్టింది. కానీ 2020 అనంతరం కరోనా సంక్షోభం, ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్ల కొరత ఉన్నప్పటికీ.. వాటిని అధిగమించి కేవలం 3 సంవత్సరాల్లోనే 10 లక్షల మార్కును చేరుకోవడం విశేషం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వినియోగదారులు, ఉద్యోగులను కలుపుకుంటూ.. ఓ ప్రచార కార్యక్రమాన్ని కంపెనీ ప్రారంభించనుంది. నెలపాటు సంస్థ తయారీ ప్లాంట్లు, ప్రాంతీయ కార్యాలయాల్లో వేడుకలు జరపనుంది.

ఒడిదుడుకులు ఎదుర్కొంటూనే..
ఈ మైలురాయిని అందుకోవడంపై టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ మేనేజింగ్ డైరెక్టర్ శైలేష్ చంద్ర ఆనందం వ్యక్తం చేశారు. 50 లక్షల వాహనాల ఉత్పత్తితో చరిత్ర సృష్టించడం సంతోషంగా ఉందన్నారు. తమ ఈ ప్రయాణంలో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్నట్లు చెప్పారు. కానీ నూతన ఉత్పత్తులను పరిచయం చేస్తూ, దేశాన్ని మరింత అభివృద్ధి పథంలో తీసుకెళ్లడానికి తమ వంతు ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ ఘనతను అందుకోవడంలో తమను ఎంతగానో నమ్మి, ఆదరించిన కస్టమర్లకు కృతఙతలు తెలిపారు. ఇందుకోసం శ్రమించిన ఉద్యోగులు, సప్లయర్లు, పార్టనర్లు, ప్రభుత్వాల సహకారాన్ని కొనియాడారు.


Click it and Unblock the Notifications