ముఖేష్ అంబానీని ఢీ కొట్టాలంటే: టాటా గ్రూప్ కీలక నిర్ణయం: వాటిపై ఫోకస్
ముంబై: ఈ మధ్యకాలంలో కార్పొరేట్ సెక్టార్స్లో టేకోవర్ల పర్వం నడుస్తోంది. ప్రత్యేకించి- దేశీయ పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్- ఇతర కంపెనీల్లో వాటాలను పెద్ద ఎత్తున కొనుగోలు చేయడం, వాటిల్లో పెట్టుబడులు పెట్టడం, వీలైతే వాటిని పూర్తిగా తన గ్రూప్ ఆఫ్ కంపెనీల్లోకి చేర్చడం వంటి కార్యకలాపాలపై దృష్టి సారించింది. రిటైల్ బిజినెస్, ఫ్యాషన్, అప్పెరల్స్, టెలి కమ్యూనికేషన్స్, గ్రోసరీస్..వంటి రంగాల్లో భారీగా పెట్టుబడులు పెట్టారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అడుగు పెట్టని రంగం అంటూ ఏదీ లేదు. లోకల్ సెర్చింజిన్ను జస్ట్ డయల్ సైతం సొంతం చేసుకున్నారు. ఆయా సెక్టార్లలో ఇప్పటికే పాతుకు పోయిన కంపెనీలకు ప్రధాన పోటీదారుగా తయారైంది రిలయన్స్ ఇండస్ట్రీస్. ఈ పోటీని తట్టుకోవడానికి కాంపిటీటర్స్ సైతం తమ వ్యాపార పరిధిని పెంచుకోవడానికి ప్రాధాన్యత ఇస్తోన్నారు. ఈ పరిణామాల మధ్య టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మేనేజ్మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది.
టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ కూడా టేకోవర్లపై దృష్టి సారించింది. టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీల్లో ఇదీ ఒకటి. రిటైల్ సెగ్మెంట్ను నెలకొన్న పోటీని ఎదుర్కొనడానికి టాప్ బ్రాండ్స్కు చెందిన కంపెనీలను కొనుగోలు చేసే దిశగా చర్యలు తీసుకుంటోంది. దీనికోసం ఇప్పటికే చర్చల ప్రక్రియ సైతం ప్రారంభించింది. వచ్చే ఆరు నెలల కాలంలో కనీసం 60 చిన్న తరహా గ్రోసరీస్, ఇతర గృహావసర కన్స్యూమర్ బ్రాండ్స్ను కొనుగోలు చేసేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుంది.
టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సునీల్ డిసౌజా ఈ విషయాన్ని వెల్లడించారు. టాప్ బ్రాండింగ్స్ను కొనుగోలు చేయడంపై ఇప్పటికే దృష్టి సారించామని, ఈ దిశగా చర్చలు జరుపుతున్నామని చెప్పారు. ఓ బిజినెస్ డెయిలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ సెగ్మెంట్లో తమ వ్యాపార కార్యకలాపాల పరిధిని విస్తరించుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, యునిలివర్ వంటి కంపెనీల నుంచి ఈ సెగ్మంట్లో పోటీ తీవ్రంగా ఉందని, దీన్ని అధిగమించాల్సి ఉందని వ్యాఖ్యానించారు. బాటిల్డ్ వాటర్ బిజినెస్లో కొనసాగుతున్న నౌరిష్కో బేవరేజెస్ లిమిటెడ్ కూడా ఈ జాబితాలో ఉంది. కాగా- స్టార్ బక్స్ కార్పొరేషన్ కింద ఏర్పాటు చేసిన కెఫేల సంఖ్యను మరింత పెంచబోతున్నామని డిసౌజా అన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 26 నగరాల్లో 268 కెఫెలను కొత్తగా ఏర్పాటు చేశామని, ఈ ఫైనాన్షియల్ ఇయర్లోనూ కొత్త వాటిని జత చేస్తామని అన్నారు.