Tamilnadu: '12 గంటల పని' బిల్లుపై తమిళనాడు సర్కారు యూటర్న్.. చట్టంగా మారక మునుపే నిలిపివేత
Tamilnadu: 12 గంటల పని బిల్లును తమిళనాడు అసెంబ్లీ గత వారం ఆమోదించిన విషయం తెలిసిందే. వివిధ కంపెనీలకు అనుకూలంగా ఉత్పత్తిని పెంచడానికి, పెట్టుబడులను ఆకర్షించడానికి స్టాలిన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే విపక్షాలు సహా వివిధ వర్గాలు దీనిని తీవ్రంగా నిరసించారు. దీంతో చేసేదేమీ లేక బిల్లును వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
తమిళనాడులోని కర్మాగారాల్లో పనిచేస్తున్న కార్మికులకు బిగ్ రిలీఫ్ దొరినట్లయింది. సిబ్బందికి 12 గంటల పనిదినాలకు సంబంధించిన బిల్లును MK స్టాలిన్ ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాల నుంచి తీవ్ర నిరసనలు వెల్లువెత్తడంతో సర్కారు తన నిర్ణయాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. ఫ్యాక్టరీల్లో 8 గంటలకు బదులు తప్పనిసరిగా 12 గంటల పనిని అనుమతించాలని గత వారం ఆమోదించిన బిల్లుకు ఇప్పుడు బ్రేక్ పడినట్లుయింది.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల కోసం ఫ్యాక్టరీల (సవరణ) చట్టం 2023ని తమిళనాడు శాసనసభ ఏప్రిల్ 21న ఆమోదించింది. అయితే వివిధ కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీల ప్రతినిధుల అభిప్రాయాల మేరకు.. బిల్లు అమలును తాత్కాలికంగా నిలిపివేసినట్లు ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. ప్రభుత్వం గత వారమే ఈ బిల్లును ఆమోదించినా, అది ఇంకా చట్టంగా మారలేదు.
'కార్మికుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుంటూనే పారిశ్రామిక వృద్ధిని ప్రోత్సహించడం ప్రభుత్వ లక్ష్యం. పరిశ్రమల అభివృద్ధిలో శ్రామికుల పాత్ర ఎంతో ఉంటుంది. కార్మిక సంక్షేమంపై DMK ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టింది. ప్రజల అభిప్రాయాలను గౌరవించడం, విశ్లేషించడం, అనంతరం తగిన చర్యలు తీసుకోవడం దిశగా మా ప్రభుత్వం కట్టుబడి ఉంది' అని CM స్టాలిన్ తెలిపారు.
Apple ఫోన్ సరఫరాదారులు ఫాక్స్ కాన్ మరియు పెగాట్రాన్ తో పాటు షూ మేకర్ Nike, Pou Chen వంటి సంస్థల నుంచి బిలియన్ డాలర్ల పెట్టుబడులను తమిళనాడు ఆకర్షించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పారిశ్రామిక ఉత్పత్తిని పెంచడమే లక్ష్యంగా ఈ బిల్లును ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే దీనిపై అసెంబ్లీలో చర్చ సమయంలో కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, అధికార డీఎంకే పార్టీ మిత్రపక్షాలు విడుతలై చిరుతైగల్ కట్చి (వీసీకే) వాకౌట్ చేశాయి. కానీ మెజారిటీ ఉన్న DMK మాత్రం సభలో మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదించుకుంది.