Tamilnadu: దేశంలో కొన్నేళ్లుగా కార్మికుల పనిగంటల గురించి చర్చ నడుస్తూనే ఉంది. కార్మిక శాఖ సైతం రోజువారీ పని గంటలను 12కి పెంచుకోవచ్చనే సంకేతాలు ఇప్పటికే ప్రజల్లోకి పంపించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కర్ణాటక అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకుని బిల్ పాస్ చేసింది. అయితే ప్రస్తుతం తమిళనాడు సైతం ఇదే బాటలో నడవడానికి సిద్ధమైంది. విపక్షాలు వ్యతిరేకిస్తున్నా పట్టించుకోకుండా ముందుకే సాగనున్నట్లు స్పష్టం చేసింది.
తయారీ రంగంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా.. కర్మాగారాల్లోని ఉద్యోగులకు అనువైన పని గంటలను కల్పిస్తూ ఫ్యాక్టరీల (సవరణ) చట్టం 2023ని తమిళనాడు అసెంబ్లీ శుక్రవారం ఆమోదించింది. రాష్ట్రంలోని తమ ఉత్పాదక సంస్థలకు పని గంటల పొడిగింపు కల్పించాల్సిందిగా పలు మల్టీ నేషనల్ కంపెనీలు కోరుతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. దేశంలో అత్యధిక సంఖ్యలో కర్మాగారాలు, పారిశ్రామిక కార్మికులు తమిళనాడులో ఉండటంతో ఇప్పుడు ఈ బిల్లు పాస్ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

అసెంబ్లీ సమావేశాల ముగింపు రోజున బిల్లు చర్చకు వచ్చినప్పుడు వామపక్ష పార్టీలు, కాంగ్రెస్ మరియు విడుతలై చిరుతైగల్ కట్చి (VCK) దీనిపై నిరసనలు తెలిపాయి. సచివాలయం నుంచి వాకౌట్ చేశాయి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులను పరిగణలోనికి తీసుకుని ఈ బిల్లు ఆమోదించినట్లు ప్రభుత్వం సమర్థించుకుంది. రాష్ట్రంలోకి అంతర్జాతీయ పెట్టుబడులు తరలిరావడమే తమ లక్ష్యమని ప్రకటించింది.
ఈ బిల్లు ముఖ్యంగా మహిళలకు కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి తంగం తెన్నరసు తెలిపారు. ఈ పనిగంటల నిబంధన ఎలక్ట్రానిక్ పరిశ్రమలు, నాన్-లెదర్ షూ-మేకింగ్ పరిశ్రమలు, ఎలక్ట్రానిక్ క్లస్టర్లు వంటి కొన్ని రంగాలకు మాత్రమే వర్తిస్తుందని స్ఫష్టం చేశారు. వారికి సైతం వారం మొత్తంలో పని గంటలు మారవు అని వెల్లడించారు. వారానికి నాలుగు రోజులు పనిచేసి, మూడు రోజుల పాటు కుటుంబంతో సంతోషంగా గడిపే అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. శెలవులు, ఓవర్ టైమ్, వేతనాలపై ప్రస్తుత నిబంధనలు యథాతథంగా ఉంటాయన్నారు.


Click it and Unblock the Notifications