భారత్లో పెట్టుబడులపై కార్ల కంపెనీల జాగ్రత్త, అవే దెబ్బతీశాయి! SUVలకు డిమాండ్
ఆటో దిగ్గజం సుజుకీ కార్ప్ భారత్లో సేల్స్ ఇక ముందు కూడా అంత ఆశాజనకంగా ఉంటాయని భావించడం లేదు. ఇది ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆటోమేకర్ కంపెనీ. ఇది గత ఏడేళ్లుగా వరుసగా వృద్ధిని నమోదు చేసింది. గత కొన్నాళ్లుగా భారత్లో ఆటో రంగం బలహీనపడింది. గత త్రైమాసికంలో మారుతీ సుజుకీ లాభాలు క్షీణించాయి. సేల్స్ దాదాపు సగానికి పడిపోయాయి. భారత్లో వృద్ధి ముందుకు కదులుతుందని తాము అనుకోవడం లేదని సుజుకీ ప్రెసిడెంట్ తోషిహిరో సుజుకీ హెచ్చరించారు.
BSNL క్రేజీ ఆఫర్: మీరు ఫోన్ చేసి మాట్లాడితే, మీకే డబ్బులిస్త
ఫిబ్రవరి నుంచి తగ్గిన సేల్స్
మారుతీ సేల్స్ ఈ ఏడాది జనవరి వరకు పెరిగాయి. ఆ మరుసటి నెల (ఫిబ్రవరి) నుంచి క్రమంగా సెప్టెంబర్ వరకు తగ్గుతూ వచ్చాయి. బ్యాంకులకు లిక్విడిటీ ఇబ్బందులు, అధిక ట్యాక్సులు, బలహీన రూరల్ ఎకానమీ కారణంగా ఆటో సేల్స్ గత కొద్ది రోజులుగా భారీ తగ్గుతోన్న విషయం తెలిసిందే. గ్లోబల్ మార్కెట్ లీడర్లు అయిన ఫోర్డ్, వోక్స్ వ్యాగన్, ఫియట్లు చిన్న కార్ల మార్కెట్లోకి ప్రవేశించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పెట్టుబడుల విషయంలో జాగ్రత్త
కార్ల తయారీదారులు భారత్లో తమ భవిష్యత్తు పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నారని, అందులో ఎక్కువమంది భారత్లో కొత్త మోడల్ ప్రణాళికలను వాయిదా వేస్తున్నారని లేదా రద్దు చేసుకుంటున్నారని ఆటో సెక్టార్ నిపుణులు పునీత్ గుప్తా చెప్పారు. కొంతమంది ఉత్పత్తిదారులు చిన్న కార్లతో వ్యాల్యూమ్స్ వెంట పడకుండా ఉత్పత్తిపరంగా తమ బలాలపై దృష్టి సారిస్తున్నారని ఆటో నిపుణులు చెబుతున్నారు. మరికొందరు ఉత్పత్తులు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంటున్నారని చెబుతున్నారు.
ఇవి దెబ్బతీశాయి
వరుసగా గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్సులు, ఎలక్ట్రిక్ వెహికిల్ పాలసీ, ఉబెర్, ఓలా వంటి రైడ్ షేరింగ్ కంపెనీలు ఆటో రంగాన్ని దెబ్బతీశాయని అంటున్నారు. ఇది భారత్లోని గ్లోబల్ ఆటో మేకర్స్ను దెబ్బతీసిందని చెబుతున్నారు. విధానపరమైన అస్థిరత ఉన్న సమయంలో.. మరిన్ని పెట్టుబడులు పెట్టాలని హెడ్ క్వార్టర్స్ను కోరడం ఇబ్బందికరమే అంటున్నారు.
భారత్ కోసం ప్రత్యేకంగా కార్లు.. ఖరీదైనదే..
భారత్లో ప్రధానంగా స్మాల్ కార్ మార్కెట్ ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో ప్రపంచ మార్కెట్లో ఇవి బలహీనంగా ఉంటాయి. చైనా, అమెరికా వంటి దేశాల్లో SUV, లగ్జరీ కార్లు ఎక్కువగా విక్రయిస్తారు. ఈ రెండు దేశాలు టాప్ మార్కెట్ కలిగిన దేశాలు. వెస్టర్న్ ఆటోమేకర్స్ ప్రత్యేకంగా ఇండియాకు అనుగుణంగా కార్లను డిజైన్ చేసి, ఉత్పత్తి చేయాల్సి వచ్చిందని చెబుతున్నారు. ఇది ఖరీదైన అంశమని కన్సల్టెన్సీ అవెన్షియమ్ అడ్వైజర్స్ మేనేజింగ్ పార్ట్నర్ వీజీ రామకృష్ణన్ అన్నారు.
SUVలకు పెరిగిన డిమాండ్
చాలా కంపెనీలు మాస్ మార్కెట్కు అనుగుణంగా ముందుకు వెళ్లాయని, ఇఫ్పుడు నిర్దిష్ట విభాగాలపై దృష్టి పెట్టే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. వోక్స్ వ్యాగన్ సిస్టర్ కంపెనీ స్కోడా భారత్లో ఎస్యూవీ కార్లపై ఫోకస్ పెట్టింది. ఫియట్ కూడా అదే దారిలో నడుస్తోంది. ప్రస్తుతం భారత్లో చిన్న కార్ల కంటే SUVలకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. చిన్న కార్ల రంగంలో లీడర్ అయిన మారుతీ వంటి సంస్థలు కూడా SUV వంటి కార్లను లాంచ్ చేసేందుకు మొగ్గు చూపుతున్నాయి. టయోటా, సుజుకీలు కొత్త వెహికిల్ టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి, ఖర్చులు తగ్గించుకోవడానికి జత కలిశాయి. ఆటో మేకర్స్ ప్రస్తుతం ఖర్చులు తగ్గించుకోవాలని, రాబడిని పెంచుకోవాలని చూస్తున్నాయి.