Tax Penalty: కంపెనీపై విరుచుకుపడ్డ ఆదాయపు పన్ను శాఖ.. క్షీణించిన స్టాక్..
Suzlon Energy: స్టాక్ మార్కెట్లో అద్భుతమైన పెరుగుదల కొనసాగిస్తున్న కంపెనీపై ఆదాయపు పన్ను అధికారులు సీరియస్ అయ్యారు. ఈ క్రమంలో పెనాల్టీలు సైతం విధించటం ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేసింది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది సుజ్లాన్ ఎనర్జీ కంపెనీ షేర్ల గురించే. కంపెనీ స్టాక్ ఈరోజు ప్రారంభ ట్రేడ్లో పడిపోయాయి. అయితే త్వరలో స్టాక్ కౌంటర్ ప్రకాశవంతంగా కనిపించడం ప్రారంభించింది. మధ్యాహ్నం 1:15 గంటల ప్రాంతంలో సుజ్లాన్ ఎనర్జీ 2.85 శాతం పెరిగి రూ.41.55 వద్ద ట్రేడవుతోంది. ఉదయం రూ.39.95 వద్ద ప్రారంభమై రూ.38.40కి తగ్గింది.

2015-16 ఆర్థిక సంవత్సరం, 2017-18 కోసం ఆదాయపు పన్ను శాఖ రెండు ఆదాయపు పన్ను పెనాల్టీ ఉత్తర్వులను జారీ చేసింది. దీని తరువాత సుజ్లాన్ ఎనర్జీ లిమిటెడ్ షేర్లు మార్కెట్లో అద్భుతమైన పెరుగుదల మధ్య ఉదయం 3% కంటే ఎక్కువ పడిపోయాయి. రెండు పెనాల్టీ ఆర్డర్లు వరుసగా రూ.87.59 కోట్లు, రూ.172.76 కోట్లుగా ఉన్నాయి. దీనికి ముందు గడచిన 5 రోజుల కాలంలో సుజ్లాన్ ఎనర్జీ కంపెనీ షేర్లు సుమారు 13 శాతం పెరుగుదలను నమోదు చేశాయి.
అలాగే గత నెలలో 6 శాతం క్షీణత నమోదైంది. గత ఆరు నెలల్లో సుజ్లాన్ ఎనర్జీ దాదాపు 55 శాతం రాబడిని ఇచ్చింది. కాగా గత ఏడాది కాలంలో 413% భారీ రాబడిని ఇవ్వడం ద్వారా తన పెట్టుబడిదారులను ధనవంతులను చేసింది. ప్రతికూల వార్తల నేపథ్యంలో కంపెనీ మార్కెట్ క్యాప్ బీఎస్ఈలో రూ.55,263 కోట్లకు పడిపోయింది. అయితే తిరిగి పుంజుకున్న తర్వాత రూ.56,530 కోట్లకు చేరింది. కంపెనీ టెక్నికల్స్ పరిశీలిస్తే షేర్లు ఓవర్బాట్ లేదా ఓవర్సోల్డ్ జోన్లలో ట్రేడింగ్ చేయడం లేదని వెల్లడైంది.
కంపెనీ ప్రస్తుతం పన్ను అధికారులు జారీ చేసిన జరిమానాలపై అప్పీల్ దాఖలు చేసి న్యాయపరమైన పోరాటం కొనసాగించాలని నిర్ణయించింది. ఉత్తర్వులను సవాలు చేసే పనిలో నిమగ్నమై ఉంది. సుజ్లాన్ ఎనర్జీ మూడవ త్రైమాసిక లాభం రూ.69.8 కోట్ల నుంచి 160 శాతం పెరిగి రూ.203.2 కోట్లకు చేరుకుంది. సుజ్లాన్ ఎనర్జీ విండ్ టర్బైన్ల తయారీలో గుర్తింపును తెచ్చుకుంది.


Click it and Unblock the Notifications