సూపర్టెక్ దివాలా, 25,000 హోమ్ బయ్యర్స్పై తీవ్ర ప్రభావం
ప్రముఖ రియాల్టీ దిగ్గజం సూపర్టెక్ లిమిటెడ్ దివాలా తీసినట్లుగా నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (NCLT) ప్రకటించింది. బకాయిలు చెల్లించడంలో సదరు సంస్థ విఫలమైందంటూ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పిటిషన్ దాఖలు చేయగా, ఎన్సీఎల్టీ ఢిల్లీ బెంచ్ శుక్రవారం తీర్పు వెలువరించింది. ఈ తీర్పుతో దాదాపు 25వేల హోమ్ బయ్యర్స్ పైన ప్రభావం పడుతుంది. అయితే ఈ తీర్పు పైన తాము నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రైబ్యునల్ను ఆశ్రయిస్తామని సూపర్ టెక్ తెలిపింది.
యూపీలోని నోయిడాలో సూపర్ టెక్ నిర్మించిన ట్విన్ టవర్స్ను కూల్చి వేయాలని సుప్రీం కోర్టు గత ఏడాది ఆదేశించింది. దీంతో ఈ కంపెనీ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. దీంతో తమకు బకాయిలు చెల్లించడంలో కంపెనీ విఫలమైందని ఎన్సీఎల్టీని యూనియన్ బ్యాంకు ఆశ్రయించింది. మార్చి 17న కంపెనీ చేసిన వన్ టైమ్ సెటిల్మెంట్ ప్రతిపాదనకు బ్యాంకు నో చెప్పింది. దీంతో ఎగవేతదారుగా గుర్తించేందుకు కంపెనీ తరఫు లాయర్ అంగీకరించారు. ఆ రోజు తీర్పును రిజర్వ్ చేసిన బెంచ్ తాజాగా తన తీర్పును వెలువరించింది.
సూపర్ టెక్ కంపెనీ ప్రస్తుతం గురుగ్రామ్, ఘజియాబాద్, నోయిడా, గ్రేటర్ నోయిడాలోని పలు ప్రాంతాల్లో చేపట్టిన పలు ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి. ఈ క్రమంలో దాదాపు ఇరవై ఐదు వేల మంది హోమ్ బయ్యర్స్ తమ ప్లాట్ల కోసం వేచి చూస్తున్నారు. ట్రైబ్యునల్ తీర్పుపై ఈ ప్రభావం ఉంటుంది.