భారత్ను తీవ్రంగా భయపెడుతున్న సూపర్ ఎల్ నినో.. పలు రాష్ట్రాలు కరువు కాటకాలు, వేడిగాలులతో విలవిల..
ఈ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలను కలవరపెడుతున్న ఏకైక అంశం ఏదైనా ఉందంటే అది 'సూపర్ ఎల్ నినో' (Super El Niño). భారతదేశంపై దీని ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2026లో సూపర్ ఎల్ నినో రికార్డు స్థాయిలో వేడిని తీసుకురావచ్చని ఐఎమ్డి హెచ్చరించింది. ఇంతకీ ఎల్ నినో అంటే ఏమిటి.. ఎందుకు ఇంతలా కలవరపెడుతోంది. భారత్ లో దీని ప్రభావం ఎలా ఉండబోతోంది ఓ సారి చూద్దాం.
ఎల్ నినో అనేది మధ్య, తూర్పు పసిఫిక్ మహాసముద్ర ఉపరితల నీరు సాధారణం కంటే ఎక్కువగా వేడెక్కడం వల్ల సంభవించే ఒక సహజ వాతావరణ పరిణామంగా చెప్పవచ్చు. ఈ సముద్ర ఉష్ణోగ్రతల మార్పు ప్రపంచవ్యాప్త వాతావరణ సరళిని మార్చేస్తుంది. స్పానిష్ భాషలో ఎల్ నినో అంటే 'చిన్న బిడ్డ' అని అర్థం. కొన్ని శతాబ్దాల క్రితం పెరూ దేశపు జాలర్లు క్రిస్మస్ సమయంలో సముద్రపు నీరు వేడెక్కడాన్ని గమనించి ఈ పేరు పెట్టారు. సాధారణంగా ఇది ప్రతి 2 నుండి 7 సంవత్సరాలకు ఒకసారి సంభవించి, దాదాపు ఏడాది పాటు కొనసాగుతుంది.

సముద్రపు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే ఎక్కువగా పెరిగినప్పుడు దానిని "సూపర్ ఎల్ నినో"గా పరిగణిస్తారు. ఇది సాధారణ ఎల్ నినో కంటే తీవ్రమైన కరువులు, వరదలు, కార్చిచ్చులు, రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలకు దారితీస్తుంది. 2026లో ఎల్ నినో వేగంగా బలపడుతోందని అమెరికాకు చెందిన నోవా (NOAA) హెచ్చరించింది. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఇది 'చాలా బలంగా' మారడానికి మూడింట రెండు వంతుల అవకాశం ఉంది. గతంలో 1982-83, 1997-98, మరియు 2015-16లలో ఇలాంటి భయానక సూపర్ ఎల్ నినోలు సంభవించాయి. ఈసారి 'లా నినా' నుండి 'ఎల్ నినో'కు పరివర్తన చాలా వేగంగా జరగడం, భూతాపం (Global Warming) తోడు కావడం వల్ల ఆందోళన మరింత పెరిగింది.
భారతదేశానికి కావలసిన వర్షపాతంలో దాదాపు 70 శాతం జూన్-సెప్టెంబర్ మధ్య కురిసే నైరుతి రుతుపవనాల వల్లే వస్తుంది. ఎల్ నినో బలంగా ఉంటే రుతుపవన గాలులు బలహీనపడి దేశంలో వర్షాలు తగ్గుతాయి. 1951 నుండి 2022 మధ్య ఎల్ నినో వచ్చిన సంవత్సరాలలో 60 శాతం కాలం దేశంలో తక్కువ వర్షపాతమే నమోదైంది. ఈసారి కూడా రుతుపవనాలు బలహీనంగా ఉంటాయని భారత వాతావరణ శాఖ (IMD) ఇప్పటికే హెచ్చరించింది.
దీనివల్ల మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, గుజరాత్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలు తీవ్ర కరువు బారిన పడే ప్రమాదం ఉంది. అదే సమయంలో కొన్ని తీరప్రాంతాల్లో మాత్రం అకాల భారీ వర్షాలు, వరదలు సంభవించవచ్చు. వర్షాలు లేకపోతే వ్యవసాయ రంగం కుదేలవుతుంది. ముఖ్యంగా వరి, పప్పుధాన్యాలు, చెరకు, నూనెగింజల సాగు తీవ్రంగా దెబ్బతింటుంది. పంట దిగుబడి తగ్గడం వల్ల మార్కెట్లో బియ్యం, పప్పులు, కూరగాయలు, వంట నూనెల ధరలు పెరిగి ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. ఇది సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టడమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుంది.
గతంలో 2015-16 సూపర్ ఎల్ నినో వల్ల దేశంలో కరువు రాగా.. 2023-24 ఎల్ నినో సమయంలో మహారాష్ట్ర, దక్షిణ భారతదేశంలో మామిడి, జీడిపప్పు పంటలు, అలాగే కాశ్మీర్, హిమాచల్లలో ఆపిల్ సాగు దెబ్బతిన్నాయి. దీంతో పాటుగా తీవ్రమైన వేడి కారణంగా ప్రజలు కూలర్లు, ఏసీలను ఎక్కువగా వాడటం వల్ల విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయికి చేరుతుంది. మరోవైపు, వర్షాలు లేక జలాశయాల్లో నీటిమట్టం పడిపోవడంతో జలవిద్యుత్ (Hydroelectric power) ఉత్పత్తి తగ్గిపోతుంది. ఇది దేశంలో తీవ్ర విద్యుత్ కొరతకు దారితీయవచ్చు.
ప్రస్తుతం శాస్త్రవేత్తలు పసిఫిక్ మహాసముద్ర పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నారు. రాబోయే నెలల్లో దీని తీవ్రత మరింత స్పష్టం కానుంది. అయితే ఇది ముందస్తుగానే అప్రమత్తమవ్వాల్సిన సమయం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


Click it and Unblock the Notifications
