Bengaluru: షాక్ ఇస్తున్న కూరగాయల ధరలు! బెంగళూరులో సెంచరీ దాటిన బీన్స్..!
బెంగళూరు (Bengaluru) నగరంలో ఎండలు మండిపోతుంటే, మరోవైపు మార్కెట్లో కూరగాయల ధరలు అంతకంటే ఎక్కువగా మండిపోతున్నాయి. గత కొన్ని వారాలుగా సాధారణ ధరల కంటే దాదాపు 40% పైగా రేట్లు పెరగడంతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి వంటగదిలో నిత్యం వాడే బీన్స్, టొమాటో, క్యాబేజీ వంటివి ఇప్పుడు లగ్జరీ ఐటమ్స్గా మారిపోయాయి.
ఆకాశాన్నంటిన బీన్స్ ధర
ప్రస్తుతం బెంగళూరు మార్కెట్లలో అన్నిటికంటే ఎక్కువగా షాక్ ఇస్తోంది బీన్స్ ధర. ఏప్రిల్ నెలాఖరు వరకు కిలో రూ. 80-90 ఉన్న బీన్స్, ఇప్పుడు ఏకంగా రూ. 185 నుంచి రూ. 200 వరకు పలుకుతోంది. అంటే కేవలం కొన్ని రోజుల్లోనే ధర రెట్టింపు అయిందన్నమాట. కేవలం బీన్స్ మాత్రమే కాదు, టొమాటో కిలో రూ. 50కి చేరగా, కిలో రూ. 13 ఉన్న క్యాబేజీ ఇప్పుడు రూ. 20 దాటేసింది. బీరకాయ, కాకరకాయ, సొరకాయ వంటివి కూడా సామాన్యుడికి అందనంత దూరంలో ఉన్నాయి.

పంటలపై ఎండల ప్రభావం
ధరలు పెరగడానికి ప్రధాన కారణం విపరీతమైన ఎండలు. వేసవి తీవ్రత వల్ల పంటలు పూత దశలోనే ఎండిపోతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ఎండ దెబ్బకు టొమాటో పువ్వులు రాలిపోతుండగా, బీన్స్ గింజలు సరిగ్గా పెరగకముందే వాడిపోతున్నాయి. దీనివల్ల దిగుబడి గణనీయంగా తగ్గింది. యశ్వంత్పూర్ APMC యార్డ్లోని వ్యాపారుల మాటల ప్రకారం.. ఎండల వల్ల పంటలు దెబ్బతినడమే కాకుండా, నగరానికి వచ్చే కూరగాయల లోడ్లు కూడా 50% తగ్గిపోయాయి.
నీటి కరువుతో పెరుగుతున్న కష్టాలు
బెంగళూరు (Bengaluru) కు కూరగాయలు సరఫరా చేసే కోలార్, చిక్కబల్లాపూర్, రామనగర , తుమకూరు జిల్లాల్లో తీవ్రమైన నీటి ఎద్దడి నెలకొంది. భూగర్భ జల మట్టాలు పడిపోవడం, బోర్ బావులు ఎండిపోవడంతో రైతులు పంటలకు నీరు పెట్టలేక ఇబ్బంది పడుతున్నారు. నీటి కొరత వల్ల పంట కాల చక్రం దెబ్బతిని, కోతకు వచ్చే కూరగాయల పరిమాణం కూడా తగ్గిపోయింది. కేవలం వేడి మాత్రమే కాదు, ఇటీవల కురిసిన అకాల వర్షాలు, వడగళ్ల వాన వల్ల ఆకుకూరలు కూడా కుళ్ళిపోయి ధరలు పెరిగాయి. ప్రస్తుతం మార్కెట్లో కొత్తిమీర కట్ట రూ. 50 నుంచి రూ. 60 పలుకుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
వ్యాపారుల ఆందోళన
పంటల దిగుబడి తగ్గిపోవడంతో నగరానికి వచ్చే సరుకు తక్కువగా ఉందని ఎలక్ట్రానిక్ సిటీ వెజిటబుల్ అసోసియేషన్ సభ్యులు చెబుతున్నారు. డిమాండ్ ఎక్కువగా ఉండి, సప్లై తక్కువగా ఉండటమే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం. ఎండలు ఇలాగే కొనసాగితే మరికొన్ని రోజుల పాటు ధరలు దిగి వచ్చే సూచనలు కనిపించడం లేదు. హోప్ కామ్స్ (HOPCOMS) వంటి ప్రభుత్వ సంస్థల్లో కూడా రేట్లు సాధారణం కంటే ఎక్కువగా ఉండటంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications