Suagar Prices: ఈ ఏడాది ప్రజలకు నిత్యావసర సరకులు ఒకదాని తర్వాత మరొకటి షాక్ ఇస్తోంది. ధరలు గరిష్ఠాలకు చేరుకుంటున్న వేళ కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగి ఎగుమతులపై ఆంక్షలు విధిస్తోంది.
ఇప్పటికే బియ్యం, కూరగాయలు, టమాటా, పప్పు దినుసులు, జీలకర్ర, ఉల్లిపాయలు, వంటనూనెలు అంటూ వంటింటి సామాను ధరలు పైపైకి పెరిగిపోతున్నాయి. ఇప్పుడు పండుగ సీజన్ మెుదలవుతున్న క్రమంలో పంచదార ధరలు చేదెక్కుతున్నాయి. ప్రధానంగా వర్షాభావ పరిస్థితుల కారణంగా పంట దిగుబడులు తగ్గటంతో డిమాండ్ కు తగినంతగా సరఫరాలు కొరవడి రేట్లు గరిష్ఠాలను తాకుతున్నాయి.

ప్రస్తుత సీజన్లో చక్కెర ఉత్పత్తి తగ్గడంతో ధరలు భారీగానే ఉంటాయని అంచనా. ఇదే క్రమంలో అంతర్జాతీయ మార్కెట్లో చక్కెర ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో భారత్ తన చక్కెర ఎగుమతులను పెంచే అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. దేశంలో చక్కెర ధరలను నియంత్రించడానికి ప్రభుత్వానికి మిగిలి ఉన్న ఏకైక సమర్థవంతమైన పరిష్కారం ఎగుమతులను తగ్గించటమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏప్రిల్-జూలై మధ్య దేశీయ చక్కెర ధర కిలోకు రూ.36గా ఉండేదని ICRA పరిశోధన నివేదిక వెల్లడించింది. ఈ క్రమంలో పెరుగుతున్న డిమాండ్ కారణంగా చక్కెర ధరల్లో పెరుగుదల ఆగస్టు, సెప్టెంబరులో కనిపించింది.
రానున్న రోజుల్లో ఇది మరింతగా పెరుగుతుందని ఇక్రా వెల్లడించింది. సెప్టెంబర్ 15,2023 వరకు దేశీయ చక్కెర ఉత్పత్తి దాదాపు 32.76 మిలియన్ టన్నులుగా ఉంది. ఇది గత చక్కెర సీజన్ కంటే తక్కువ. మహారాష్ట్రలో అసమాన వర్షపాతం కారణంగా చెరకు ఉత్పత్తి తగ్గడం ఉత్పత్తి తగ్గడానికి అసలు కారణం. దీంతో సగటు కిలో చక్కెర ధర రూ.35.6గా ఉంది. ఈ క్రమంలో చక్కెర ధరలు వేగంగా పెరగకుండా ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటోందని నిపుణులు చెబుతున్నారు. అందుకే గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ప్రభుత్వం ఎగుమతులను నియంత్రించడం ప్రారంభించింది. చక్కెర మిల్లుల నుంచి రోజువారీ విక్రయ నివేదికలను తెప్పించుకుంటోంది.


Click it and Unblock the Notifications