అమ్మ చేతి బెన్నె దోసెతో ఏడాదికి రూ. 12 లక్షలు సంపాదన.. వైరల్ అవుతున్న ముంబై వీధి వ్యాపారి సక్సెస్ స్టోరీ..
స్థిరమైన ఉద్యోగం, నెల తిరిగేసరికి చేతికిందే జీతం.. చాలామంది కోరుకునే సురక్షితమైన జీవితం ఇది. కానీ, కొందరు మాత్రం ఆ రొటీన్ జీవితానికి భిన్నంగా, తాము నమ్మిన ఆలోచనల వైపు అడుగులు వేస్తారు. అనిశ్చితిని ఎదుర్కొంటూ, రిస్క్ తీసుకుని, తమ అభిరుచినే వ్యాపారంగా మార్చుకోవడానికి నిరాటంకంగా శ్రమిస్తారు. అలాంటి వారి ప్రయాణం అంత సులభంగా సాగదు; అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతాయి. అయినా సరే, వదులుకోని సంకల్పంతో ముందడుగు వేసినప్పుడే అద్భుతమైన విజయాలు సాధ్యమవుతాయని నిరూపించారు ముంబైలోని థానేకు చెందిన గణేష్ సాఠే.
గణేష్ సాఠే తన సీఏ (CA) పరీక్షలకు సిద్ధమవుతున్న రోజుల్లో.. ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు చేసే సాంప్రదాయ ఉద్యోగం చేయడం తన లక్ష్యం కాదని గ్రహించారు. సొంతంగా ఏదైనా సాధించాలనే బలమైన కోరికతో, కుటుంబం నుండి రూ. 50,000 అప్పుగా తీసుకుని ఆహార వ్యాపారంలోకి అడుగుపెట్టారు. థానే ప్రాంత ప్రజలందరికీ తన తల్లి చేతి వంట అయిన రుచికరమైన 'బెన్నె దోస' రుచిని చూపించాలనేది ఆయన ఆశయం.

ఇందుకోసం తన సోదరి సప్న సహాయంతో ఒక పాత బండిని వీధి పక్కన చిన్న దుకాణంగా మార్చారు. పూణే నుండి ప్రత్యేకంగా తెప్పించిన అసలైన తెల్ల వెన్నతో, ఎక్కడా నాణ్యతలో రాజీ పడకుండా 'ది బెన్నె' (The Benne) అనే పేరుతో 2023లో ఒక చిన్న స్టాల్ను ఏర్పాటు చేసి, అక్టోబర్ 2025లో దానిని అధికారికంగా ప్రారంభించారు.
అయితే, వ్యాపారం ప్రారంభించిన కొత్తలో గణేష్ ఆశలపై నీళ్లు చల్లినంత పనైంది. ఆ ప్రాంతంలో అప్పటికే పిజ్జా రోల్స్, మోమోస్ వంటి ట్రెండీ ఫుడ్ ట్రక్కులు ఉండటంతో.. సంప్రదాయ దోసెలను పట్టించుకునేవారే కరువయ్యారు. ఒకానొక దశలో రోజువారీ అమ్మకాలు కేవలం రూ.200కి పడిపోయి, దుకాణాన్ని మూసివేయాలనే ఆలోచన కూడా వచ్చింది. కానీ ఆ తోబుట్టువులు ధైర్యం కోల్పోలేదు. వ్యాపార శైలిని మార్చి, సోషల్ మీడియా శక్తిని నమ్ముకున్నారు.
తమ రోజువారీ వ్యాపార ప్రయాణాన్ని, దోసెల తయారీ విధానాన్ని వీడియోల రూపంలో ఆన్లైన్లో పంచుకోవడం ప్రారంభించారు. ఒకవైపు తల్లి, సోదరి ఇంట్లో తాజా పిండిని సిద్ధం చేస్తుండగా.. గణేష్ స్టాల్ వద్ద కస్టమర్లకు సేవలందిస్తూ డిజిటల్ ప్లాట్ఫామ్లలో చురుగ్గా ఉండేవారు. క్రమంగా ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జనం 'ది బెన్నె' వైపు అడుగులు వేశారు. ఇక్కడి అద్భుతమైన రుచి నచ్చడంతో ఒకరి నుండి ఒకరికి ప్రచారం జరిగి కస్టమర్ల సంఖ్య విపరీతంగా పెరిగింది.
ఒకప్పుడు రోజుకు రూ. 200 సంపాదన కోసం ఇబ్బంది పడిన ఆ చిన్న బండి వద్ద.. ఇప్పుడు రోజుకు సగటున 400 మందికి పైగా కస్టమర్లు క్యూ కడుతున్నారు. డిమాండ్ ఎక్కువగా ఉండటంతో చాలాసార్లు దోసెలు త్వరగా అమ్ముడైపోతుంటాయి. ప్రస్తుతం ఈ వ్యాపారం రోజుకు దాదాపు రూ. 40 వేల ఆదాయాన్ని ఆర్జిస్తూ, నెలకు ఏకంగా రూ. 12 లక్షల రూపాయల లాభాన్ని గడిస్తోంది. కేవలం రూ. 50 వేల పెట్టుబడితో మొదలైన ఒక సాధారణ యువకుడి కల, పట్టుదల తోడైతే ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తుందో చెప్పడానికి గణేష్ సాఠే విజయగాథే ఒక నిదర్శనం.


Click it and Unblock the Notifications
