ట్రంప్ ఒత్తిడి, మైక్రోసాఫ్ట్ వద్దకు టిక్టాక్: నా జీవితంలోనే వింత ఘటన.. సత్య నాదెళ్ల
టిక్టాక్ కొనుగోలుకు తాను చేసిన ప్రయత్నం తన జీవితంలోనే వింతైన ఘటనగా అభివర్ణించారు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల. ప్రముఖ షార్ట్ వీడియో షేరింగ్ యాప్ టిక్టాక్ అమెరికా కార్యకలాపాలను కొనుగోలు చేయడానికి మైక్రోసాఫ్ట్ విఫలయత్నం చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి సత్య నాదెళ్ల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టిక్టాక్ తమ వద్దకు వచ్చిందని సత్య నాదెళ్ల గుర్తు చేశారు. కానీ తాము మాత్రం వారి వద్దకు వెళ్లలేదన్నారు. టిక్టాక్ అమ్మకానికి రావడానికి ట్రంప్ కారణమని అభిప్రాయపడ్డారు. అమెరికా, చైనా సమీకరణాల మధ్య టిక్టాక్ ఇరుక్కుపోయిందని, అందుకే వారు అమెరికాలో ఇతరులతో భాగస్వామ్యం కుదుర్చుకోవాలని భావించారని తెలిపారు. అప్పటికే ఎక్స్బాక్స్ వీడియో గేమింగ్ టూల్స్, లింక్డిన్లో యూజర్ల భద్రతకు తాము అమలు చేస్తోన్న విధానాలు బైట్డ్యాన్స్ను ఆకర్షించాయని తెలిపారు. అంతేకాకుండా తమ వద్ద సమర్థనీయ కోడింగ్ ఇంజినీర్స్ ఉన్నారని తెలిపారు. అందుకే బైట్ డ్యాన్స్ తమ వైపు మొగ్గు చూపిందని భావిస్తున్నామన్నారు.
ఈ ఒప్పందం ద్వారా ఏ సాధించాలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ముందే ఒక నిర్దిష్టమైన లక్ష్యం ఉండేదని తాను భావిస్తున్నానని, నాటి ప్రభుత్వానికి కొన్ని ప్రత్యేక అవసరాలు ఉన్నాయనేది తన అభిప్రాయమన్నారు. కానీ అనుకోకుండా ఈ పరిణామాల నుండి వారు కనిపించకుండా పోయారని, అసలు నమ్మలేకపోయానన్నారు. తన జీవితంలో తాను చేపట్టిన పనుల్లో ఇదే అత్యంత వింతైన ఘటన అన్నారు. కానీ, తాను చాలా విషయాలు నేర్చుకున్నానని, చాలామంది గురించి తెలిసిందన్నారు. టిక్ టాక్ను సొంతం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారా అని అడగ్గా.. ప్రస్తుతం ఉన్న వాటితో సంతోషంగా ఉన్నామన్నారు.
జోబిడెన్ నాయకత్వంలో ఇప్పటికీ ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయా అంటే తనకు తెలియదన్నారు. అయితే నేషనల్ సెక్యూరిటీ ఆందోళనపై దృష్టి సారించినట్లు బైడెన్ అడ్మినిస్ట్రేషన్ చెబుతోందన్నారు. క్రిప్టో కరెన్సీ అంశంపై కూడా సత్య నాదెళ్ల స్పందించారు. సైబర్ సెక్యూరిటీ దృష్ట్యా క్రిప్టోకరెన్సీపై ప్రభుత్వ నియంత్రణ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. లేదంటే సమస్యలు ఎదురు కావొచ్చునన్నారు.