హార్ముజ్ జలసంధి తెరవాలంటే ఈ షరతులు ఒప్పుకోవాల్సిందే.. ట్రంప్కు డెడ్ లైన్ పెట్టిన ఇరాన్..
ప్రపంచంలోనే అత్యంత కీలకమైన ఇంధన రవాణా మార్గమైన హార్ముజ్ జలసంధి ద్వారా వాణిజ్య నౌకల రాకపోకలను పునరుద్ధరించడానికి ఇరాన్ ఆరు షరతులను విధించింది. ఈ జలసంధిని తిరిగి తెరవాలంటే అమెరికా తన వైఖరిని మార్చుకోవాలని స్పష్టం చేస్తూ.. వాషింగ్టన్ ముందు ఆరు ప్రధాన డిమాండ్లను ఉంచినట్లు ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ మాజీ కార్యదర్శి, సుప్రీం లీడర్ అయతోల్లా అలీ ఖమేనీ సలహాదారు అయిన మొహమ్మద్ బఘేర్ జోల్ఘదర్ వెల్లడించారు.
మరోవైపు ఈ మార్గంలో వాణిజ్య నౌకల నిర్వహణ కోసం ఒమన్తో ఉమ్మడి సాంకేతిక ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి ఇరాన్ చేరువైంది. ప్రతిపాదిత ఒప్పందం ప్రకారం రవాణా నిర్వహణలో టెహ్రాన్, మస్కట్లకు ఉమ్మడి బాధ్యతలు ఉంటాయి. అయితే ఒమన్తో ఒప్పందం కుదిరినంత మాత్రాన జలసంధి తెరుచుకోదని.. తమ ఆరు పొలిటికల్ డిమాండ్లను పరిష్కరిస్తేనే సాధారణ నౌకాయానం సాధ్యమవుతుందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఖ్చి స్పష్టం చేశారు.

ఇరాన్ విధించిన 6 ప్రధాన డిమాండ్లు:
1. బెదిరింపులు నిలిపివేత: ఇరాన్పై అమెరికా తన బెదిరింపు ధోరణిని, అవమానకరమైన భాషను శాశ్వతంగా మానుకోవాలి.
2. ప్రాంతీయ వివాదాల ముగింపు: లెబనాన్, పాలస్తీనా, యెమెన్ మరియు ఇరాక్లలో ఇరాన్ మరియు దాని మిత్రదేశాలపై అమెరికా సాగిస్తున్న సైనిక దురాక్రమణను తక్షణమే ముగించాలి.
3. నావికా దిగ్బంధనం ఎత్తివేత: ఇరాన్ చుట్టూ ఉన్న ప్రాంతాల నుండి అమెరికా నావికా, వైమానిక దళాలను ఉపసంహరించుకోవడంతో పాటు విధించిన నావికా దిగ్బంధనాన్ని ఎత్తివేయాలి.
4. యుద్ధ పరిహారం: ఇటీవల జరిగిన రెండు యుద్ధాలలో (2025లో జరిగిన 12 రోజుల యుద్ధంతో సహా) ఇరాన్కు జరిగిన ఆస్తి, ప్రాణ నష్టానికి అమెరికా భారీ పరిహారం చెల్లించాలి.
5. ఆంక్షల రద్దు: ఇరాన్పై విధించిన క్రూరమైన, చట్టవిరుద్ధమైన ఆర్థిక ఆంక్షలను తక్షణమే తొలగించాలి.
6. స్తంభింపజేసిన ఆస్తుల విడుదల: విదేశాలలో జప్తు చేసిన లేదా స్తంభింపజేసిన ఇరాన్ నిధులను, ఆస్తులను బేషరతుగా విడుదల చేయాలి.
పర్షియన్ గల్ఫ్, అరేబియా సముద్రాన్ని కలిపే ఈ 33 కిలోమీటర్ల ఇరుకైన జలసంధి నిలిచిపోవడం వల్ల గ్లోబల్ ఎనర్జీ మార్కెట్ తీవ్ర ఆందోళన చెందుతోంది. యూఎస్ ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ (EIA) ప్రకారం.. ఈ జలసంధి గుండా రోజుకు సుమారు 20 మిలియన్ బ్యారెళ్ల చమురు రవాణా అవుతుంది. ఇందులో 82 శాతం ఆసియా దేశాలకే వెళ్తుంది. ముఖ్యంగా ఇరాన్ ఎగుమతి చేసే మొత్తం చమురులో 90 శాతాన్ని చైనానే కొనుగోలు చేస్తోంది.
ఈ జలసంధి మూసివేత వల్ల ఆసియా రిఫైనరీలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొనే ముప్పు ఏర్పడింది. ఇరాన్ షరతుల వార్తలతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా 3 శాతం పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్కు $86.03 డాలర్లకు చేరుకోగా.. యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ 80.61 డాలర్లకి పెరిగింది.
మరోవైపు ఇరాన్ Strait of Hormuz గుండా వెళ్లే నౌకలను స్వయంగా పర్యవేక్షించడమే కాకుండా రుసుములు వసూలు చేయాలని యోచిస్తుండటంపై షిప్పింగ్ పరిశ్రమ వర్గాలు చట్టపరమైన, బీమా సంబంధిత ఆందోళనలను వ్యక్తం చేస్తున్నాయి. వైట్ హౌస్ ఈ విధివిధానాలను గమనిస్తుండగా.. అంతర్జాతీయ సమాజం ఇరాన్-అమెరికా మధ్య తదుపరి దౌత్యపరమైన పరిణామాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.


Click it and Unblock the Notifications
