Market Crash: స్టాక్ మార్కెట్లలో కల్లోలం.. 950+ పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ సూచీ.. రక్తపాతం..
Market Crash: దేశీయ స్టాక్ మార్కెట్లలో అమ్మకాల సునామీ కొనసాగుతోంది. అంతర్జాతీయ పరిణామాలతో పాటు దేశీయ కంపెనీల పనితీరు ఇన్వెస్టర్లను నిరాశకు గురిచేయటంతో మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. వారం ప్రారంభంలో మార్కెట్లు ఎరుపు రంగు అద్దుకున్నాయి.
ఉదయం 10.04 గంటల సమయంలో సెన్సెక్స్ సూచీ 950 పాయింట్లకు పైగా నష్టాల్లో ఉండగా నిఫ్టీ సూచీ 250 పాయింట్ల వరకు కోల్పోయింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 322 పాయింట్లు కోల్పోగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 90కి పైగా పాయింట్లను కోల్పోయాయి.

ప్రధానంగా ఇన్ఫోసిస్ క్యూ4 ఫలితాలు నిరాశకు గురిచేయటంతో ఐటీ రంగం షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి నెలకొంది. నిఫ్టీ ఐటీ సూచీ సైతం 6 శాతానికి పైగా నష్టాల్లో కొనసాగుతోంది. దీనికి ముందు గతవారం టీసీఎస్ విడుదల చేసిన ఫలితాలు సైతం మార్కెట్లను మెప్పించలేకపోయాయి. అంతర్జాతీయ పరిణామాల కారణంగా దేశీయ ఐటీ సేవల రంగంలోని కంపెనీలు మార్కెట్ అంచనాలను అందుకోవటంలో విఫలం కావటం ఇందుకు ప్రధాన కారణంగా ఉంది.
ఈ క్రమంలో మార్కెట్లు బేర్స్ చేతిలోకి జారుకున్నాయి. ఈ తరుణంలో ఇన్ఫోసిస్ షేర్లు 12 శాతం నష్టాల్లో ఉండగా.. టీసీఎస్, ఎల్ టి మైండ్ ట్రీ, హెచ్సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, ఎల్ టి టెక్నాలజీస్, విప్రో, ఎంఫసిస్, కొఫొర్జీ వంటి ఐటీ సేవల సంస్థల షేర్లు భారీగా నష్టపోయాయి. వీటిలో అమ్మకాల ఒత్తిడి పెరగటంతో సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి.


Click it and Unblock the Notifications