Stock market: సోమవారం స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది? ఇన్వెస్టర్లు తెలుసుకోవాల్సిన లెక్కలు ఇవే!
భారతీయ స్టాక్ మార్కెట్ (stock market) లో గత రెండు వారాలుగా సాగిన లాభాల పరంపరకు బ్రేక్ పడింది. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు, ఇంధన ధరల మంటల కారణంగా ఈ వారం దేశీయ ఈక్విటీ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. గత వారం రోజుల్లో బీఎస్ఈ సెన్సెక్స్ 2.70 శాతం, ఎన్ఎస్ఈ నిఫ్టీ 2.20 శాతం మేర పతనమయ్యాయి. శుక్రవారం నాటి ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 75,237.99 వద్ద, నిఫ్టీ 23,643.50 వద్ద స్థిరపడ్డాయి. అయితే, మే 18 సోమవారం నాడు మార్కెట్ ప్రారంభం కావడానికి కొన్ని సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎన్ఎస్ఈ ఇంటర్నేషనల్ ఎక్స్ఛేంజ్లో నిఫ్టీ ఫ్యూచర్స్ 61 పాయింట్లు (0.26%) లాభంతో 23,769 వద్ద ట్రేడవుతుండటం మార్కెట్ పాజిటివ్గా ఓపెన్ అయ్యే అవకాశాలను సూచిస్తోంది.

మార్కెట్ను భయపెడుతున్న ముడిచమురు..
రెలిగేర్ బ్రోకింగ్ లిమిటెడ్ రీసెర్చ్ విభాగం ఎస్వీపీ అజిత్ మిశ్రా అభిప్రాయం ప్రకారం.. పశ్చిమాసియా (Middle East) లో పెరుగుతున్న ఉద్రిక్తతలు, అమెరికా-ఇరాన్ వివాదం కారణంగా చమురు మార్కెట్ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతోంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు 105 డాలర్ల మార్కును దాటడం మార్కెట్లలో ఆందోళన పెంచింది.
జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ మాట్లాడుతూ.. "హోల్సేల్ ధరల సూచీ (WPI) అంచనాల కంటే ఎక్కువగా ఉండటం, పెట్రోల్ ధరల పెంపు ప్రభావం , బాండ్ ఈల్డ్స్ పెరగడం వల్ల ఇన్వెస్టర్ల దృష్టి ఇప్పుడు ద్రవ్యోల్బణం రిస్క్లపైకి మళ్లింది" అని చెప్పారు. ఈ వారంలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (FIIs) ఏకంగా రూ. 13,500 కోట్లకు పైగా షేర్లను విక్రయించగా, దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు (DIIs) రూ. 18,500 కోట్ల నికర కొనుగోళ్లతో మార్కెట్ మరింత పతనం కాకుండా అడ్డుకున్నారు.
సోమవారం నిఫ్టీ, సెన్సెక్స్ కీలక స్థాయిలు ఇవే!
ట్రేడర్లు సోమవారం మార్కెట్లో ఈ క్రింది సపోర్ట్, రెసిస్టెన్స్ స్థాయిలను గమనించాల్సి ఉంటుంది..
- నిఫ్టీ (Nifty): నిపుణుల ప్రకారం నిఫ్టీ తన కీలకమైన 23,800-24,500 కన్సాలిడేషన్ రేంజ్ నుండి కిందకు పడిపోవడం మార్కెట్ బలహీనతను చూపిస్తోంది. ఇప్పుడు నిఫ్టీకి 23,800-24,000 జోన్ తక్షణ రెసిస్టెన్స్గా (అడ్డంకిగా) మారనుంది. కింది స్థాయిలో 23,150 కీలక సపోర్ట్గా ఉండగా.. ఆ తర్వాత 22,900 వద్ద మరో సపోర్ట్ ఉంది. ఎన్రిచ్ మనీ సీఈఓ పొన్ముడి ఆర్ ప్రకారం.. నిఫ్టీ గనుక 23,500-23,400 పరిధిని కోల్పోతే 23,200-23,000 స్థాయికి పడిపోవచ్చు.
- సెన్సెక్స్ (Sensex): సెన్సెక్స్ ప్రస్తుతం 75,200-75,300 జోన్ వద్ద ట్రేడవుతోంది. దీనికి తక్షణ రెసిస్టెన్స్ 75,600-76,000 శ్రేణిలో ఉండగా.. కీలకమైన సపోర్ట్ 74,500-74,200 జోన్ వద్ద లభించనుంది.
ఇన్వెస్టర్లు ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలి?
ప్రస్తుత అస్థిరమైన మార్కెట్ పరిస్థితుల్లో సేఫ్ బెట్స్ (సురక్షితమైన షేర్ల) వైపు మొగ్గు చూపడం మంచిదని అజిత్ మిశ్రా సలహా ఇస్తున్నారు. మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకునే డిఫెన్సివ్ రంగాలు అయిన ఫార్మా, హెల్త్కేర్, ఎంపిక చేసిన ఎఫ్ఎమ్సీజీ (FMCG) తో పాటు ఎనర్జీ, మెటల్ ఆధారిత బిజినెస్ స్టాక్స్ ఈ సమయంలో కొంత స్థిరత్వాన్ని ఇస్తాయి.
మరోవైపు, ఐటీ (IT), వడ్డీ రేట్లకు ప్రభావితమయ్యే రంగాలు (బ్యాంకులు, రియల్ ఎస్టేట్) , డిస్క్రిషనరీ కన్జంప్షన్ రంగాలపై ఒత్తిడి కొనసాగే అవకాశం ఉందని హెచ్చరించారు. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం , స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ (Strait of Hormuz) తిరిగి సజావుగా తెరుచుకోవడం వంటి సానుకూల పరిణామాలు జరిగితేనే షేర్ మార్కెట్ (stock market) మళ్లీ స్థిరమైన దిశగా పయనిస్తుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కాబట్టి ప్రస్తుతానికి ఇన్వెస్టర్లు డిఫెన్సివ్ , సెలెక్టివ్ అప్రోచ్తో జాగ్రత్తగా ఉండటం మంచిది.


Click it and Unblock the Notifications